త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Iran Conflict | యుద్ధం కొన‌సాగితే ఎవ‌రూ ఊహించ‌ని ఆయుధాల‌తో దాడులు.. అమెరికాకు ఐఆర్‌జీసీ వార్నింగ్‌..!

US-Iran Conflict | అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధ పరిస్థితులు కొనసాగితే కొత్త సైనిక సామర్థ్యాలను వినియోగిస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది. ఈ విషయాన్ని సెమీ అధికారిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

P

International | Published On Apr 14, 2026, 7.28 am IST

US-Iran Conflict | యుద్ధం కొన‌సాగితే ఎవ‌రూ ఊహించ‌ని ఆయుధాల‌తో దాడులు.. అమెరికాకు ఐఆర్‌జీసీ వార్నింగ్‌..!
Advertisement

US-Iran Conflict | అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధ పరిస్థితులు కొనసాగితే కొత్త సైనిక సామర్థ్యాలను వినియోగిస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది. ఈ విషయాన్ని సెమీ అధికారిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటివరకు తమ పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగించలేదని, యుద్ధం కొనసాగితే శత్రువులు ఊహించని స్థాయి ఆయుధ సామర్థ్యాలను బయటపెడతామని ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహెబ్బీ పేర్కొన్నారు.

ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రెజా తలాయెనిక్ మాట్లాడుతూ.. దేశ సాయుధ దళాల శక్తి రోజురోజుకూ పెరుగుతోందన్నారు. భవిష్యత్తులో దాడి, రక్షణ చర్యలను కొనసాగించేందుకు తగినంత క్షిపణులు, డ్రోన్లు, త‌దిత‌ర ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలను అధికారిక ఇరాన్ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏని ఉటంకిస్తూ షిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. అదేవిధంగా, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్, హార్ముజ్ జలసంధిపై అమెరికా ఆంక్షలు విధించే ప్రయత్నాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతీకార చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఇరాన్, అమెరికా ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్‌లో శనివారం, ఆదివారంలో విస్తృత చర్చలు జరిపాయి. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందం జ‌రుగ‌లేదు. 40 రోజులపాటు కొనసాగిన యుద్ధం అనంతరం బుధవారం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ చర్చలు జరిగాయి. ఇదిలా ఉండగా, సోమవారం అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన అన్ని నౌకాశ్రయాలు, తీర ప్రాంతాలపై నిర్బంధ చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరాన్‌కు సంబంధం లేని నౌకాశ్రయాల మధ్య ప్రయాణించే నౌకలకే హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర‌మైన హెచ్చరికలు జారీ చేశారు. తమ నిర్బంధానికి సమీపించే ఇరాన్ నౌకలను తక్షణమే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళానికి భారీ నష్టం వాటిల్లిందని, 158 నౌకలను పూర్తిగా ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అయితే, చిన్న పరిమాణంలో ఉన్న వేగవంతమైన దాడి నౌకలను మాత్రం పెద్దగా ముప్పుగా భావించలేదని తెలిపారు. నిర్బంధానికి సమీపించే ఏ నౌక అయినా వెంటనే ధ్వంసం చేస్తామ‌ని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి.

Advertisement
Advertisement