త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Universities | అమెరికాలో విద్య‌కు భార‌తీయుల విముఖ‌త‌.. భారీగా త‌గ్గిన ద‌ర‌ఖాస్తులు..

US Universities | అమెరికాలోని యూనివ‌ర్సిటీల్లో చ‌దివేందుకు న‌మోదు చేసుకున్న భార‌తీయ విద్యార్థుల సంఖ్య 2025లో ఏకంగా 45 శాతం మేర తగ్గింద‌ని గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ కౌన్సిల్ (జీఎంఏసీ) వెల్ల‌డించింది. ఈ మేర‌కు జీఎంఏసీ తాజాగా ఓ శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేసింది.

S

International | Published On Feb 27, 2026, 6.56 am IST

US Universities | అమెరికాలో విద్య‌కు భార‌తీయుల విముఖ‌త‌.. భారీగా త‌గ్గిన ద‌ర‌ఖాస్తులు..
Advertisement

US Universities | అమెరికాలోని యూనివ‌ర్సిటీల్లో చ‌దివేందుకు న‌మోదు చేసుకున్న భార‌తీయ విద్యార్థుల సంఖ్య 2025లో ఏకంగా 45 శాతం మేర తగ్గింద‌ని గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ కౌన్సిల్ (జీఎంఏసీ) వెల్ల‌డించింది. ఈ మేర‌కు జీఎంఏసీ తాజాగా ఓ శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. 2025లో భార‌త గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల‌కు అంత‌ర్జాతీయ ద‌ర‌ఖాస్తులు 25 శాతం పెరిగాయ‌ని తెలిపింది. గ్లోబ‌ల్ మేనేజ్‌మెంట్ విద్య‌లో స్ప‌ష్ట‌మైన పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ను ఈ పెరుగుదల సూచిస్తుంద‌ని తెలియజేసింది. దీర్ఘ‌కాలంగా అమెరికాను విద్య‌కు ఉత్త‌మ ప్ర‌దేశంగా ఎంచుకున్న ఆసియా, యూరోప్ దేశాల విద్యార్థులు ప్ర‌స్తుతం గ‌ణ‌నీయంగా అమెరికాకు దూర‌మ‌వుతున్నార‌ని, వీసా విధానాలు, క‌రెన్సీ ప్ర‌భావం, విద్య‌కు ఖ‌ర్చు పెర‌గడం వంటివి ఇందుకు ప్ర‌ధాన కార‌ణాల‌ని స్ప‌ష్టం చేసింది.

361 బిజినెస్ స్కూల్స్‌లో స‌ర్వే..

జీఎంఏసీ 2025 అప్లికేషన్ ట్రెండ్స్ సర్వే ప్రకారం యూకే మినహా యూరప్, ఆసియాలో అంతర్జాతీయ దరఖాస్తులు పెరిగాయి. అయితే కెనడా, యూకే, అమెరికాలో అవి తగ్గాయి. అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదల స్థానిక దరఖాస్తుల పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 361 బిజినెస్ స్కూల్స్‌లో నిర్వహించిన పల్స్‌ సర్వేలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 54 శాతం ప్రోగ్రామ్‌ల‌కు 2025 శీతాకాల‌ సెమిస్టర్‌లో అంతర్జాతీయ ద‌ర‌ఖాస్తులు పెరిగినట్లు తెలిపారు. మరోవైపు అమెరికాలో మూడింట రెండు వంతుల‌ ప్రోగ్రామ్ రిజిస్ట్రేష‌న్‌లు త‌గ్గిన‌ట్లు వెల్లడించారు. అడ్మిష‌న్ అనంత‌రం కూడా వీసా సందిగ్ధ‌త ప్ర‌భావం చూపిస్తున్న‌ట్లు తేల్చారు. అమెరికాలోని దాదాపు 90 శాతం ప్రోగ్రామ్‌ల‌లో అడ్మిష‌న్ ఫీజు చెల్లించిన‌ప్ప‌టికీ ఇంకా కోర్సుల్లో చేర‌ని విద్యార్థుల్లో భార‌తీయులు అధిక సంఖ్య‌లో ఉన్నార‌ని తేలింది. వీసా ఆల‌స్యం, వీసా తిర‌స్క‌ర‌ణ‌, ఒకేసారి మ‌ల్టిపుల్ అడ్మిష‌న్లు పొంద‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వివ‌రించారు.

అమెరికాపై త‌గ్గుతున్న ఆస‌క్తి..

జీఎంఏసీ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ సర్వే ప్రకారం అమెరికాలో చదవాలనే ఆసక్తి 2019లో 57 శాతం ఉండగా, 2025లో అది 42 శాతానికి పడిపోయింది. అదే సమయంలో వెస్ట్రన్ యూరప్‌పై ఆసక్తి 63 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఆసియా, ఈస్టర్న్ యూరప్‌పై దరఖాస్తు ప్లానింగ్‌లు 2025 వరకు క్రమంగా పెరిగాయి. సెంట్రల్, సౌత్ ఆసియా విద్యార్థులు తమ స్వదేశ ప్రాంతాల్లో, ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఆసియాలోని ప్రోగ్రామ్‌లపై ఆసక్తి చూపుతుండగా, వెస్ట్రన్ యూరప్‌పై అభిరుచి ఏడాది వారీగా 6 శాతం పెరిగింది. కెనడా, అమెరికా, యూకేలోని విద్యాసంస్థలు వీసా విధాన మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులనే దరఖాస్తుల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నాయి. కెనడా 2024లో అమలు చేసిన అంతర్జాతీయ స్టడీ పర్మిట్ పరిమితి దరఖాస్తులు, అనుమతుల్లో గణనీయ తగ్గుదలకు దారి తీసింది. అమెరికాలో మొత్తం ఉన్నత విద్యా రంగంలో కొత్త అంతర్జాతీయ ద‌ర‌ఖాస్తులు 19 శాతం తగ్గాయి. వీసా ఇంటర్వ్యూ నిలిపివేతలు, వలస పరిమితి ప్రతిపాదనలు పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి.

నిర్ణయాల్లో ఇప్పుడు విద్యాసంస్థ ప్రతిష్ఠ కంటే ఆర్థిక అంశాలే ప్రాధాన్యం పొందుతున్నాయని జీఎంఏసీ పేర్కొంది. 2025 సెప్టెంబర్‌లో భారత రూపాయి ప్రధాన కరెన్సీలతో పోలిస్తే చరిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల విదేశీ విద్య ఖర్చు భారమైంది. 2026లో విద్యార్థులు యూనివ‌ర్సిటీల ర్యాంకింగ్ క‌న్నా వీసా స్ప‌ష్ట‌త‌, చ‌దువు అనంత‌ర ఉపాధి అవ‌కాశాలు, ఖ‌ర్చులు వంటి అంశాల‌పైనే ఎక్కువ‌గా దృష్టి కేంద్రీక‌రించార‌ని వైట్ పేప‌ర్‌లో తెలిపారు.

Advertisement
Advertisement