త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russian oil | రష్యన్‌ ఆయిల్‌కు భారత్‌ దూరం.. వెనిజులాతో చర్చలు..!

Russian oil | ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించే దిశగా ముందుకు సాగుతుందన్న సంకేతాలున్నాయి. తాజాగా భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

P

International | Published On Feb 20, 2026, 3.23 pm IST

Russian oil | రష్యన్‌ ఆయిల్‌కు భారత్‌ దూరం.. వెనిజులాతో చర్చలు..!
Advertisement
  • త్వరలోనే యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం
  • వెల్లడించిన అమెరికా రాయబారి సెర్జియో గోర్‌

Russian oil | ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించే దిశగా ముందుకు సాగుతుందన్న సంకేతాలున్నాయి. తాజాగా భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ తనకు తానుగా రష్యన్‌ ఆయిల్‌కు దూరంగా ఉంటుందని.. వెనిజులాతో చమురు కొనుగోళ్ల విషయంలో చర్చలు జరుపుతోందన్నారు. ఇటీవల ప్రకటించిన భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామంగా భావిస్తున్నారు. ఆ ఒప్పందంతో భారత్ రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించేందుకు ముందుకు వచ్చినట్లు అమెరికా వర్గాలు పేర్కొంటున్నాయి.

అమెరికా వైఖరి – రష్యన్ చమురుపై స్పష్టత

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ సందర్భంగా మాట్లాడిన సెర్జియో గోర్ భారత్ తన చమురు ఆప్షన్‌ను విస్తరించే పనిలో ఉందన్నారు. వెనిజులా నుంచి చమురు దిగుమతులపై చర్చలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎవరూ చమురు కొనకూడదనే అభిప్రాయంలో అమెరికా ఉందని, ఇది కేవలం భారత్‌కు సంబంధించిన విషయం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకాలని.. ఆ సంఘర్షణకు సంబంధించిన కార్యకలాపాలు నిలిచిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా.. వైట్‌ హౌస్ ప్రకటనలో రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించేందుకు, పూర్తిగా నిలిపివేయేందుకు భారత్‌ అంగీకరించిందని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై భారత్‌ మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. న్యూఢిల్లీ మాత్రం ఇంధన అవసరాల దృష్ట్యా ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగా వెనిజులాని ఒక ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ట్రేడ్ డీల్.. టారిఫ్‌లు తగ్గింపు..

ఇంధన రంగంలోని ఈ మార్పులతోపాటు రెండు దేశాల వాణిజ్య సంబంధాలు కూడా కొత్త దశలోకి వెళ్లనున్నాయి. ట్రంప్ పరిపాలనకు చెందిన అధికారి సెర్జియో గోర్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. భారత్‌-అమెరికా మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా, న్యూఢిల్లీపై విధించిన టారిఫ్‌లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఇది చారిత్రాత్మక ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్య రాయితీలకే పరిమితం కాకుండా.. గ్లోబల్ ఎనర్జీ రంగంలో కీలక అధ్యాయంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యన్ చమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. వెనిజులా వంటి కొత్త వనరుల వైపు దృష్టి మళ్లించడం ద్వారా భారత్ మారుతున్న ప్రపంచ వాణిజ్య సమీకరణాలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మలుచుకుంటోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా జియోపాలిటికల్ ప్రాధాన్యత, యుద్ధ పరిస్థితులు ఇవన్నీ భారత్‌ ఇంధన వ్యూహంపై ప్రభావం చూపుతుండగా.. ఈ పరిణామాలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement