త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | “ఇండియా గొప్ప దేశం.. నా బెస్ట్ ఫ్రెండ్ చేతుల్లో ఉంది”: ‘హెల్-హోల్’ వివాదం తర్వాత ట్రంప్ యూటర్న్!

భారత్‌ను, భారతీయులను అవమానించేలా ఉన్న ఓ జాత్యహంకార పోస్ట్‌ను షేర్ చేసి తీవ్ర విమర్శల పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎట్టకేలకు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇండియా ఓ గొప్ప దేశం అని, తన అత్యుత్తమ మిత్రుడు ఆ దేశాన్ని నడుపుతున్నాడని ప్రశంసల వర్షం కురిపించారు.

J

International | Published On Apr 23, 2026, 8.56 pm IST

Donald Trump | “ఇండియా గొప్ప దేశం.. నా బెస్ట్ ఫ్రెండ్ చేతుల్లో ఉంది”: ‘హెల్-హోల్’ వివాదం తర్వాత ట్రంప్ యూటర్న్!

సంక్షిప్త సారాంశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఆకస్మికంగా ప్రశంసలు కురిపించారు. ఇండియా ఓ గొప్ప దేశమని, తన స్నేహితుడు అక్కడ అధికారంలో ఉన్నాడని పేర్కొన్నారు. అయితే, అంతకుముందు భారత్, చైనాలను 'హెల్ హోల్స్' (నరక కూపాలు) గా అభివర్ణిస్తూ, ఇక్కడి వలసదారులను 'ల్యాప్‌టాప్ గ్యాంగ్‌స్టర్లు' గా పేర్కొన్న మైఖేల్ సావేజ్ వివాదాస్పద పాడ్‌కాస్ట్‌ను ట్రంప్ షేర్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ (MEA) కూడా స్పందించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకున్నారు.

Advertisement

Donald Trump | త్రినేత్ర.న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. భారతీయులను కించపరిచేలా ఉన్న ఓ పాడ్‌కాస్ట్‌ను షేర్ చేసి వివాదంలో చిక్కుకున్న కొద్ది గంటల్లోనే ఆయన భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత ప్రధానితో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు.

"ఇండియా గొప్ప దేశం.. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్"

న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ ద్వారా ట్రంప్ తన సందేశాన్ని పంపారు. "భారతదేశం ఒక గొప్ప దేశం. అక్కడ అత్యున్నత స్థానంలో ఉన్న నాయకుడు నాకు చాలా మంచి స్నేహితుడు" అని ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి సానుకూల వ్యాఖ్యలు చేశారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

ట్రంప్ ప్రశంసలకు ముందు రోజు, ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. అమెరికన్ పొలిటికల్ కామంటేటర్, రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ నిర్వహించే 'సావేజ్ నేషన్' పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన ట్రాన్స్‌క్రిప్ట్, వీడియోను ట్రంప్ షేర్ చేశారు. ఇందులో భారత్, చైనా లాంటి ఆసియా దేశాలను సావేజ్ 'హెల్ హోల్స్' (నరక కూపాలు) గా అభివర్ణించాడు.

వలసదారులపై సావేజ్ జాత్యహంకార వ్యాఖ్యలు

ల్యాప్‌టాప్ గ్యాంగ్‌స్టర్లు: భారత్, చైనా వలసదారులను సావేజ్ 'ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు' అని కించపరిచాడు. వాళ్లు అమెరికా జెండాను తొక్కేశారని, మాఫియా కుటుంబాల కంటే ఎక్కువగా అమెరికాకు నష్టం చేశారని ఆరోపించాడు.

బర్త్ రైట్ సిటిజన్‌షిప్: ఆసియా దేశాల వారు అమెరికాకు వచ్చి తొమ్మిదో నెలలో బిడ్డకు జన్మనిస్తారని, ఇక్కడి చట్టాల వల్ల ఆ పుట్టిన బిడ్డలకు 'ఇన్‌స్టంట్' (తక్షణ) పౌరసత్వం లభిస్తోందని ఆయన మండిపడ్డాడు. అమెరికా పౌరసత్వ చట్టాలను మార్చాలని డిమాండ్ చేశాడు.

శ్వేతజాతీయులకు ఉద్యోగాలు లేవు: కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీల్లో 'శ్వేతజాతీయులకు' (White men) ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేకుండా పోయిందని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశాడు.

ట్రంప్ తప్పుడు వాదన.. వాస్తవం ఇది

సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలో పుట్టుకతోనే పౌరసత్వం (Birthright citizenship) ఇస్తున్న ఏకైక దేశం అమెరికా మాత్రమేనని తప్పుగా పేర్కొన్నారు.

దీనిపై సీఎన్‌ఎన్ (CNN) ఫ్యాక్ట్ చెక్ చేసి ట్రంప్ వాదనను ఖండించింది. అమెరికా మాత్రమే కాకుండా పొరుగున ఉన్న కెనడా, మెక్సికోలతో పాటు దక్షిణ అమెరికాలోని మెజారిటీ దేశాలతో కలుపుకుని దాదాపు మూడు డజన్ల దేశాలు తమ గడ్డపై పుట్టిన వారికి ఆటోమేటిక్‌గా పౌరసత్వం ఇస్తున్నాయని స్పష్టం చేసింది.

భారత్ రియాక్షన్ ఇదే..

భారత్, చైనాలను 'హెల్ హోల్స్' తో పోలుస్తూ ట్రంప్ చేసిన పోస్ట్‌పై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పందించింది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ను విలేకరులు ప్రశ్నించగా.. "దీనికి సంబంధించిన కొన్ని నివేదికలను మేము చూశాం. నేను దీన్ని ఇక్కడికే వదిలేస్తున్నాను" అని బదులిచ్చారు. ఈ పరిణామాల వెంటనే అమెరికా ఎంబసీ ద్వారా ట్రంప్ భారత్‌ను ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Advertisement
Advertisement