త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IMF | యుద్ధం ఎఫెక్ట్‌.. త‌గ్గ‌నున్న ప్ర‌పంచ వృద్ధి రేటు, పెర‌గ‌నున్న ద్ర‌వ్యోల్బ‌ణం.. త్వ‌ర‌లో నివేదిక‌..

IMF | యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డే ప్ర‌భావం గురించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియేవా త్వ‌ర‌లో ఓ నివేదిక‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఏప్రిల్ 14న విడుద‌ల కానున్న ఈ నివేదిక‌లో వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ అవుట్‌లుక్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

S

International | Published On Apr 7, 2026, 12.15 pm IST

IMF | యుద్ధం ఎఫెక్ట్‌.. త‌గ్గ‌నున్న ప్ర‌పంచ వృద్ధి రేటు, పెర‌గ‌నున్న ద్ర‌వ్యోల్బ‌ణం.. త్వ‌ర‌లో నివేదిక‌..
Advertisement

IMF | యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డే ప్ర‌భావం గురించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియేవా త్వ‌ర‌లో ఓ నివేదిక‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఏప్రిల్ 14న విడుద‌ల కానున్న ఈ నివేదిక‌లో వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ అవుట్‌లుక్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇరాన్ యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద్రవ్యోల్బ‌ణం పెరుగుతుండ‌డం, ఆర్థిక వృద్ధి మంద‌గించ‌డం వంటి అంశాల‌ను ఆ నివేదిక‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఈ మేర‌కు ఆమె రాయిట‌ర్స్ మీడియా సంస్థ‌కు వివ‌రాలను వెల్ల‌డించారు.

హోర్ముజ్ జ‌ల‌సంధి మూసివేత‌తోనే..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌మురు స‌ర‌ఫ‌రా 13 శాతం మేర త‌గ్గగా, గ్యాస్ స‌ర‌ఫ‌రాలు సైతం ఆల‌స్యం అవుతున్నాయి. స‌ప్లై చెయిన్స్ ఒత్తిడికి గుర‌వుతున్నాయి. ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ ప్ర‌ధానంగా హోర్ముజ్ జ‌ల‌సంధిని ఇరాన్ మూసివేయ‌డంతోనే సంభ‌విస్తున్నాయి. ప్ర‌పంచ చ‌మురు స‌ర‌ఫ‌రా, గ్యాస్ ర‌వాణాలో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారానే జ‌రుగుతుండ‌డంతో ప్ర‌స్తుతం చాలా దేశాల్లో చ‌మురు, గ్యాస్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌స్తుతం అన్ని ప‌రిస్థితులు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని పెంచుతున్నాయ‌ని, వృద్ధి రేటును నెమ్మ‌దింపజేస్తున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా జార్జియేవా తెలిపారు. ఇరాన్ యుద్ధం త్వ‌ర‌గా ముగిసినా కూడా వృద్ధి అంచ‌నాల‌ను త‌గ్గించి, ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నాల‌ను పెంచాల్సి వస్తుంద‌ని ఐఎంఎఫ్ భావిస్తుంద‌ని తెలిపారు.

పూర్తిగా మారిన అంచనాలు..

కోవిడ్ త‌రువాత దాని ప్ర‌భావం నుంచి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కోలుకుంటున్న నేప‌థ్యంలో 2026లో 3.3 శాతం, 2027లో 3.2 శాతం వృద్ధి న‌మోదవుతుంద‌ని ఐఎంఎఫ్ అంచ‌నా వేసింది. అయితే ఫిబ్ర‌వ‌రి 28న ప్రారంభం అయిన ఈ యుద్ధం కార‌ణంగా అంచ‌నాలు పూర్తిగా మారిపోయాయి. యుద్ధం ప్ర‌భావం కేవ‌లం చ‌మురుకే ప‌రిమితం కాలేదు, గ్యాస్‌, హీలియం, ఎరువులు, అనుబంధ స‌ర‌ఫ‌రా స‌ప్లై చెయిన్‌ల‌పై కూడా ప్ర‌భావం పడింద‌ని జార్జియేవా తెలిపారు. ఇంట‌ర్నేష‌న్ ఎన‌ర్జీ ఏజెన్సీ నివేదిక ప్ర‌కారం 72 ఇంధ‌న కేంద్రాలు దెబ్బ తిన‌గా, వాటిలో 3వ వంతు కేంద్రాలు చాలా వ‌ర‌కు ధ్వంసం అయ్యాయి. ఇంధన ఎగుమతి దేశాలు కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఇరాన్ దాడుల వల్ల ఖ‌తార్‌లో ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఈ దేశం తన సహజ వాయువు ఉత్పత్తిలో 17 శాతం పునరుద్ధరించడానికి 3 నుంచి 5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

సామాజిక అశాంతి పెరిగే ప్ర‌మాదం: ఐఎంఎఫ్‌

ఈ కారణంగా ఐఎంఎఫ్ ఈ ప్రభావాన్ని అసమాన ప్రభావంగా పేర్కొంటోంది. ఇంధన దిగుమతి దేశాలు ముందుగా దెబ్బతింటాయి. కానీ ఎగుమతి దేశాలు కూడా తరువాతి దశలో ప్రభావాన్ని అనుభవిస్తాయి. తక్కువ ఆదాయం క‌లిగిన దేశాలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండబోతుందని జార్జియేవా హెచ్చరించారు. ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది భారీ దెబ్బ అవుతుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత చాలా దేశాలకు ఆర్థికంగా సహాయం చేసే స్థోమత తగ్గిపోయింది. పెరుగుతున్న ఇంధన, ఆహార ధరల నుంచి ప్రజలను రక్షించడం వీలుకాకపోవడంతో సామాజిక అశాంతి పెరిగే ప్రమాదం ఉంద‌ని అన్నారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లో 85 శాతం దేశాలు ఇంధన దిగుమతిదారులే. ఇప్పటికే కొన్ని దేశాలు ఆర్థిక సహాయం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాయి. అయితే ఆ దేశాల పేర్ల‌ను జార్జియేవా వెల్లడించలేదు. అవసరమైతే ప్రస్తుత రుణ పథకాలను విస్తరించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

ఇంధ‌న స‌బ్సిడీల‌పై జాగ్ర‌త్త‌..

ప్రభుత్వాలు విస్తృతంగా ఇంధన సబ్సిడీలను ఇవ్వడంపై జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ చర్యలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ సంక్షోభం నేపథ్యంలో గ్లోబల్ సంస్థలు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ఇంట‌ర్నేష‌న్ మానెట‌రీ ఫండ్‌, ఇంటర్నేష‌న్ ఎన‌ర్జీ ఏజెన్సీ, వ‌ర‌ల్డ్ బ్యాంక్ గ్రూప్ కలిసి ఒక సమన్వయ సమితిని ఏర్పాటు చేశాయి. ఈ సమితి ఆర్థిక, ఇంధన రంగాలపై యుద్ధ ప్రభావాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ మేర‌కు ఈ సమితి ఓ సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేసింది. ఈ యుద్ధం వ‌ల్ల ప్ర‌పంచ ఇంధ‌న మార్కెట్ చ‌రిత్ర‌లో అతిపెద్ద స‌ర‌ఫ‌రా కొర‌తల‌ను ప్ర‌స్తుతం ప్ర‌పంచం ఎదుర్కొంటుంద‌ని తెలిపింది. చ‌మురు, గ్యాస్‌, ఎరువుల ధ‌ర‌లు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ఆహార ధరలపై ఒత్తిడి పెరుగుతుందని, హీలియం, ఫాస్ఫేట్, అల్యూమినియం స‌ప్లై చెయిన్స్ కూడా దెబ్బతిన్నాయని తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలోని విమాన రవాణా అంతరాయాల కారణంగా పర్యాటక రంగం కూడా ప్రభావితమవుతోంద‌ని పేర్కొంది.

Advertisement
Advertisement