త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran | చేసేదేం లేక వ‌ట్టి చేతుల్తో వెళ్లిపోయారు.. జేడీ వాన్స్‌పై ఇరాన్ వ్యాఖ్య‌లు..

Iran | అమెరికాతో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జ‌రిగిన శాంతి చ‌ర్చ‌లు అర్థాంత‌రంగా నిలిచిపోయిన నేప‌థ్యంలో తాము ఆ దేశంతో ఒప్పందం కోసం తొంద‌ర‌ప‌డ‌డం లేద‌ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. చ‌ర్చ‌లు కొన‌సాగుతాయ‌ని, సైనికంగా సాధించ‌లేని విష‌యాల‌ను రాజ‌నీతితో సాధించ‌లేమ‌ని పేర్కొంది.

S

International | Published On Apr 12, 2026, 11.10 am IST

Iran | చేసేదేం లేక వ‌ట్టి చేతుల్తో వెళ్లిపోయారు.. జేడీ వాన్స్‌పై ఇరాన్ వ్యాఖ్య‌లు..
Advertisement

Iran | అమెరికాతో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జ‌రిగిన శాంతి చ‌ర్చ‌లు అర్థాంత‌రంగా నిలిచిపోయిన నేప‌థ్యంలో తాము ఆ దేశంతో ఒప్పందం కోసం తొంద‌ర‌ప‌డ‌డం లేద‌ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. చ‌ర్చ‌లు కొన‌సాగుతాయ‌ని, సైనికంగా సాధించ‌లేని విష‌యాల‌ను రాజ‌నీతితో సాధించ‌లేమ‌ని పేర్కొంది. బెస్ట్ అండ్ ఫైన‌ల్ ఆఫ‌ర్ అనేది ఏక ప‌క్ష నిర్ణ‌యం కాకుండా ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు జ‌పాన్‌లోని ఇరాన్ రాయ‌బార కార్యాల‌యం కూడా ఇవే వ్యాఖ్య‌లు చేసింది.

ఒప్పందం కోసం తొంద‌ర‌లేదు: ఇరాన్

శాంతి చ‌ర్చ‌ల్లో అమెరికా త‌ర‌ఫున ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్ర‌తినిధుల బృందం ఇస్లామాబాద్‌కు వ‌చ్చింది. అయితే చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాక అమెరికా ప్ర‌తినిధులు పాక్ నుంచి నిష్క్ర‌మించారు. ఈ నేప‌థ్యంలో ఇరాన్ ప్ర‌భుత్వం ఒప్పందం కోసం తాము త్వ‌ర ప‌డ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. ఈ విష‌యంలో తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు పనికిరావ‌ని స్ప‌ష్టం చేసింది. ఇరాన్ దేశీయ వార్తా సంస్థ ట‌స్నీమ్ స్పందిస్తూ చ‌ర్చ‌ల విష‌యంలో ఇరాన్ ఒత్తిడికి గుర‌వ‌డం లేద‌ని, త్వ‌రితగ‌తిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌నే ఆందోళ‌న కూడా లేద‌ని తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి ఎస్మాయిల్ బ‌ఘాయా మాట్లాడుతూ అమెరికాతో చ‌ర్చ‌లు కొన‌సాగుతాయ‌ని, ఆ దేశంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు.

వ‌ట్టి చేతుల్తో వెళ్లిపోయారు..

ఇస్లామాబాద్‌లో జ‌రిగిన శాంతి చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాక‌పోవ‌డంతో ఒకే స‌మావేశంలో ఒప్పందం కుదురుతుంద‌ని ఆశించ‌లేమ‌ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. అలాంటి అంచ‌నాలు ఎవ‌రికీ ఉండ‌వ‌ని తెలిపింది. అమెరికా ఈ చ‌ర్చ‌ల్లో అర్థం లేని డిమాండ్ల‌ను త‌మ ఎదుట ఉంచింద‌ని, చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యేందుకు అవే కార‌ణ‌మ‌ని తెలియ‌జేసింది. ఒప్పందం కుదుర్చుకునేందుకు త‌మ ప్ర‌తినిధులు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశార‌ని, అమెరికా అతి డిమాండ్ల‌తో చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయ‌ని పేర్కొంది. అమెరికా త‌మ ఎదుట ఉంచిన డిమాండ్ల‌ను తిర‌స్క‌రించామ‌ని, హోర్ముజ్ జ‌లసంధి మూసే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో చేసేది లేక అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ వ‌ట్టి చేతుల్తో వెళ్లిపోయార‌ని వ్యాఖ్య‌లు చేసింది. ప‌రువు నిలుపుకోవ‌డానికి వారికి మ‌రో మార్గం ఏదీ క‌నిపించ‌డం లేద‌ని ఎద్దేవా చేసింది.

Advertisement
Advertisement