త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ఇరాన్ కు కొత్త నాయ‌క‌త్వం అవ‌స‌రం, ఖామెనేయి రాజీనామా చేయాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

Donald Trump | ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు, ఉద్రిక్త ప‌రిస్థితుల‌ నేపథ్యంలో అక్కడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనేయి పాలనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 37 ఏళ్లుగా ఇరాన్‌ను పాలిస్తున్న ఖామెనేయి పదవికి రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ స్పష్టం చేశారు.

S

International | Published On Jan 18, 2026, 7.33 am IST

Donald Trump | ఇరాన్ కు కొత్త నాయ‌క‌త్వం అవ‌స‌రం, ఖామెనేయి రాజీనామా చేయాల్సిందే: డొనాల్డ్ ట్రంప్
Advertisement

Donald Trump | ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు, ఉద్రిక్త ప‌రిస్థితుల‌ నేపథ్యంలో అక్కడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనేయి పాలనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 37 ఏళ్లుగా ఇరాన్‌ను పాలిస్తున్న ఖామెనేయి పదవికి రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ స్పష్టం చేశారు. పాలిటికో అనే వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరం. ప్రజలపై భయం, హింసతో పాలన కొనసాగించడం సరైంది కాదు.. అని అన్నారు. రెండు రోజుల క్రితం 800 మందికిపైగా ప్రజలను ఉరి తీయకపోవడమే అతను తీసుకున్న ఉత్తమ నిర్ణయం.. అంటూ ఖామెనేయిపై ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. ఇరాన్ నాయకత్వం దేశాన్ని నడిపేందుకు అణచివేత, హింసపై ఆధారపడుతోందని, ఖామెనేయి కారణంగానే దేశం పూర్తిగా నాశనమైందని ఆయన ఆరోపించారు.

దేశాన్ని నడిపించాలంటే ప్రజల గౌరవాన్ని సంపాదించాలి. భయం, మరణాలతో పాలన సాగించడం నాయకత్వం కాదు. నేను అమెరికాను నడిపిస్తున్నట్లు దేశాన్ని సరిగ్గా నడిపించడంపై దృష్టి పెట్టాలి.. అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖామెనేయిని అనారోగ్య నాయకుడుగా అభివర్ణించిన ట్రంప్, ఆయన పాలన కారణంగానే ఇరాన్ ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత దారుణమైన దేశంగా మారిందని అన్నారు.

కాగా ట్రంప్ వ్యాఖ్యలకు ముందే ఇరాన్‌లోని నిరసనలపై ఖామెనేయి ఘాటుగా స్పందించారు. నిరసనకారులను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ, దేశాన్ని అస్తవ్యస్తం చేసే వారిని పూర్తిగా అణిచివేస్తాం అని హెచ్చరించారు. మతపరమైన పండుగ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఖామెనేయి మాట్లాడుతూ, దేశంలో అల్లర్లు సృష్టించే దేశీయ నేరస్థులను, అంతర్జాతీయ నేరగాళ్లను వదిలిపెట్టం.. అని అన్నారు. నిరసనలు అమెరికా కుట్రలో భాగమేనని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఇదే సమయంలో, నిరసనకారులపై దాడుల్లో వేలాది మంది మరణించినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో కనీసం 3,428 మంది నిరసనకారులు మృతి చెందినట్లు సమాచారం.

ఇరాన్‌కు చెందిన బ‌హిష్కృత‌ యువరాజు రెజా పహ్లవీ కూడా ప్రజలను ఉద్యమానికి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వరం వినిపించాలి. జాతీయ నినాదాలతో నిరసనలు చేయాలి.. అని ఆయన కోరారు. 1979 ఇస్లామిక్ విప్లవం సమయంలో దేశం విడిచిన పహ్లవీ తండ్రి పాలనకు మద్దతుగా పలువురు నిరసనకారులు నినాదాలు చేస్తుండ‌డం విశేషం. ట్రంప్‌పై ఆశలు పెట్టుకున్న పహ్లవీ, డొనాల్డ్ ట్రంప్ తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నాను. ఇరాన్ ప్రజల పక్షాన ఆయన నిలుస్తారు.. అని అన్నారు. భవిష్యత్తులో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని చెప్పిన పహ్లవీ, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కొత్త పాలనా విధానం నిర్ణయించాలన్నారు. నేను తప్పకుండా ఇరాన్‌కు తిరిగి వస్తాను.. అని స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement