త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dalai Lama | ద‌లైలామాకు గ్రామీ ద‌క్క‌డాన్ని వ్య‌తిరేకించిన చైనా.. బౌద్ధ‌మ‌త గురువుతో బీజింగ్ వైరం

Dalai Lama | టిబెట్ బౌద్ధ‌మ‌త గురువు ద‌లైలామాకు గ్రామీ అవార్డు (Grammy Awards) వ‌రించిన విష‌యం తెలిసిందే. 90 ఏళ్ల వ‌య‌సులో ఈ అవార్డు అందుకొని ద‌లైలామా రికార్డు సృష్టించారు.

D

International | Published On Feb 2, 2026, 4.42 pm IST

Dalai Lama | ద‌లైలామాకు గ్రామీ ద‌క్క‌డాన్ని వ్య‌తిరేకించిన చైనా.. బౌద్ధ‌మ‌త గురువుతో బీజింగ్ వైరం
Advertisement

Dalai Lama | టిబెట్ బౌద్ధ‌మ‌త గురువు ద‌లైలామాకు గ్రామీ అవార్డు (Grammy Awards) వ‌రించిన విష‌యం తెలిసిందే. 90 ఏళ్ల వ‌య‌సులో ఈ అవార్డు అందుకొని ద‌లైలామా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే అంశం గురించి చ‌ర్చ న‌డుస్తోంది. ఈ వ‌య‌సులో గ్రామీ ద‌క్కినందుకు ద‌లైలామాకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, బౌద్ధ‌మ‌త గురువును మొద‌ట్నుంచీ వ్య‌తిరేకిస్తూ వ‌స్తోన్న చైనా మాత్రం ద‌లైలామాకు గ్రామీ రావ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతోంది. ఆయ‌నకు ఈ అవార్డు ఇవ్వ‌డాన్ని బీజింగ్ తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఈ మేర‌కు ద‌లైలామాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ద‌లైలామా ఆధ్యాత్మిక‌ప‌ర‌మైన వ్య‌క్తి కాద‌ని వ్యాఖ్యానించింది. మ‌తం ముసుగులో ఆయ‌న చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని ఆరోపించింది.

చైనా మొద‌ట్నుంచీ ద‌లైలామా వ్య‌తిరేకే..

ఈ బౌద్ధమ‌త‌ గురువుకు 14వ ద‌లైలామాగా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ద‌లైలామా టిబెట్‌లో అతిపెద్ద మత గురువు. సాక్షాత్తూ బుద్ధుని అవ‌తారంగా టిబెట‌న్లు భావిస్తారు. అయితే, చైనా మాత్రం మొద‌టి నుంచీ ద‌లైలామాను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ వ‌స్తోంది. 1959లో అప్పటి చైనా ప్రభుత్వం టిబెట్‌ను ఆక్రమించుకుంది. చైనా దురాగతాల కారణంగా దలైలామా టిబెట్ నుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. దలైలామా రహస్యంగా భారతదేశానికి చేరుకున్న తర్వాత.. చైనా అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. దలైలామాపై కోపాన్ని మ‌రింత పెంచుకుంది. ఆయ‌న్ని భార‌త్ నుంచి బంధీగా తీసుకెళ్లాల‌ని కూడా భావించింది. కొన్ని సంద‌ర్భాల్లో ఆ కోపం భారత్‌పై కూడా చూపించింది. ఈ క్ర‌మంలో 1962 సంవత్సరంలో భారత్‌పై బీజింగ్ దాడి చేసింది. టిబెట్‌ను చైనా ఆక్రమించిన తర్వాతే భారత్‌తో సరిహద్దు గొడవలూ మొదలయ్యాయి. గతంలో చైనా, భారత్ సరిహద్దుల మధ్య ప్రత్యేక టిబెట్ దేశంగా ఉండేది. చైనా ఆక్ర‌మ‌ణ త‌ర్వాత‌ దలైలామాతో పాటు ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులు కూడా భారత్‌కు వచ్చేశారు. అప్పటి నుంచి టిబెటన్ ప్రవాస ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో పని చేస్తోంది.

ద‌లైలామా వార‌సుడిప‌ట్ల చైనా వైఖ‌రి ఇదీ..

ప్ర‌స్తుతం ద‌లైలామాకు 90 ఏళ్లు. తాను మ‌రో 40 ఏళ్ల పాటు జీవించే అవ‌కాశం ఉంద‌ని ద‌లైలామా ఇటీవ‌లే త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పేర్కొన్నారు. ఇక ద‌లైలామా 90 ఏళ్లు నిండ‌డంతో ఆయ‌న త‌ర్వాతి వార‌సుడి గురించి ఇటీవ‌లే తీవ్రంగా చ‌ర్చ న‌డిచింది. ఈ విష‌యంపై భార‌త్‌, చైనా మ‌ధ్య కూడా మాట‌ల యుద్ధం న‌డిచింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని భార‌త్ ఇటీవ‌లే స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, భార‌త్ నిర్ణ‌యాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. టిబెటన్‌ బౌద్ధ గురువు దలైలామాకు తన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను నిర్ణయించే అధికారం లేదని బీజింగ్ స్ప‌ష్టం చేసింది. టిబెటన్ బౌద్ధమతంలో ‘లివింగ్ బుద్ధాల’ పునర్జన్మ అనేది 700 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఒక చారిత్రక, మతపరమైన సంప్రదాయమని పేర్కొంది. ఈ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా ? అని నిర్ణయించే అధికారం 14వ దలైలామాకు లేదని వ్యాఖ్యానించింది.

Advertisement
Advertisement