త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఒక ఆలోచన.. మహా విధ్వంసం: 9/11 కుట్రకు పాతికేళ్లు..

ప్రపంచాన్ని కుదిపేసిన 9/11 విషాదానికి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఆనాడు అమెరికాను వణికించిన ఆ భయానక ఉగ్రకుట్ర వెనుక అసలు ఏం జరిగింది? ఆ మాస్టర్ మైండ్స్ వ్యూహం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

S

International | Published On Sep 11, 2026, 4.09 pm IST

ఒక ఆలోచన.. మహా విధ్వంసం: 9/11 కుట్రకు పాతికేళ్లు..

సంక్షిప్త సారాంశం

2001 సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రూపొందించిన ఈ కథనం, ఖాలిద్ షేక్ మొహమ్మద్ మరియు ఒసామా బిన్ లాడెన్ రూపకల్పనలో సాగిన ఆ ఉగ్రకుట్ర వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని వివరిస్తుంది. మొహమ్మద్ అట్టా, రమ్జీ బినాల్‌షిబ్ వంటి కీలక వ్యక్తుల పాత్రతో సాగిన ఈ దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ అంతం ఏంటో ఈ కథనం వివరిస్తుంది.

Advertisement

                                9/11 దాడులకు 25 ఏళ్లు..ఆ ఘటన వెనుక ఉన్న భయంకర వ్యూహకర్తలు వీరే....

 

2001 సెప్టెంబర్ 11.. అమెరికాలో మరో సాధారణ ఉదయం మొదలైంది. న్యూయార్క్‌లో ఉద్యోగులు కార్యాలయాలకు బయలుదేరుతున్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కొద్ది గంటల్లోనే ప్రపంచం ఊహించని విధ్వంసాన్ని చూడాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలను రెండు విమానాలు ఢీకొట్టాయి. మరో విమానం అమెరికా రక్షణ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న పెంటగాన్‌ను ఢీకొట్టింది. నాలుగో విమానం ప్రయాణికుల ప్రతిఘటన తర్వాత పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఆ రోజు 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. 90 దేశాలకు చెందిన బాధితులు ఇందులో ఉన్నారు. అయితే సెప్టెంబర్ 11న ప్రపంచం చూసింది దాడి చివరి అంకాన్ని మాత్రమే. దాని వెనుక కథ మాత్రం ఏళ్ల ముందే మొదలైంది.

ఆ ఆలోచన ఎక్కడ పుట్టింది?

9/11 కుట్రను అర్థం చేసుకోవాలంటే ముందుగా తెలుసుకోవాల్సిన పేరు ఖాలిద్ షేక్ మొహమ్మద్ (KSM). 9/11 కమిషన్ అతడిని ఈ దాడుల ప్రధాన రూపకర్తగా పేర్కొంది. అమెరికాలో చదువుకున్న ఖాలిద్ తర్వాత అఫ్గానిస్థాన్ యుద్ధంతో ముడిపడిన జిహాదీ వర్గాలతో సంబంధాలు పెంచుకున్నాడు. ఖతార్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా కూడా పనిచేశాడు. అతని మేనల్లుడు రమ్జీ యూసఫ్ 1993 వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబు దాడికి ప్రధాన సూత్రధారి. ఆ దాడికి ఖాలిద్ కొంత ఆర్థిక సహాయం చేసినట్లు 9/11 కమిషన్ నమోదు చేసింది.

అక్కడితో కథ ముగియలేదు.

1994లో ఖాలిద్, రమ్జీ యూసఫ్ కలిసి ఫిలిప్పీన్స్‌లో బోజింకా కుట్ర పేరుతో మరో భారీ ప్రణాళికను రూపొందించారు. పసిఫిక్ మీదుగా ప్రయాణించే 12 అమెరికన్ వాణిజ్య విమానాలను రెండు రోజుల వ్యవధిలో పేల్చాలన్నది ఆ కుట్రలోని ప్రధాన ప్రణాళిక. 1995 జనవరిలో ఫిలిప్పీన్స్ అధికారులకు కుట్ర బయటపడటంతో అది అమలు కాలేదు. కానీ విమానాలను భారీ ఉగ్రదాడులకు ఉపయోగించాలన్న ఆలోచన మాత్రం అక్కడితో ఆగలేదు.

విమానమే ఆయుధంగా మారితే?

1996లో ఖాలిద్ అఫ్గానిస్థాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను కలిశాడు. అమెరికాలోని కీలక భవనాలపై ప్రయాణికుల విమానాలను ఢీకొట్టే ఆలోచనను అతడి ముందు ఉంచాడు. అదే ప్రతిపాదన తర్వాత 9/11 ‘విమానాల దాడి ప్రణాళిక’ గా రూపాంతరం చెందింది. అయితే బిన్ లాడెన్ వెంటనే దానికి ఆమోదం తెలపలేదు. 1998 చివర లేదా 1999 ప్రారంభంలో పరిస్థితి మారింది. బిన్ లాడెన్ ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాడు. 1999 మార్చి లేదా ఏప్రిల్‌లో ఖాలిద్‌ను కందహార్‌కు పిలిపించి, అల్‌ఖైదా ఈ ప్రణాళికకు మద్దతు ఇస్తుందని చెప్పినట్లు 9/11 కమిషన్ పేర్కొంది. అక్కడి నుంచి ఖాలిద్ ఆలోచన ఒక వ్యక్తి ప్రతిపాదనగా కాకుండా అల్‌ఖైదా చేపట్టిన భారీ కుట్రగా మారింది.

మొదటి ప్రణాళిక అమలు చేసి ఉంటే మరింత భారీ విధ్వంసమే !

ఖాలిద్ మొదట ఊహించిన దాడి 2001 సెప్టెంబర్ 11న జరిగిన దానికంటే చాలా పెద్దది. అతను తర్వాత ఇచ్చిన వివరాల ప్రకారం మొత్తం 10 విమానాలను హైజాక్ చేయాలనే ఆలోచన ఉంది. వాటిలో తొమ్మిదింటిని అమెరికా తూర్పు, పశ్చిమ తీరాల్లోని వివిధ లక్ష్యాలపై ఢీకొట్టాలన్నది ప్రణాళిక. అయితే అంత పెద్ద కుట్రను అమలు చేయడం అత్యంత క్లిష్టమని భావించి ప్రణాళికను కుదించారు. చివరకు నాలుగు విమానాలతో జరిగే దాడిగా మార్చారు. ఇక్కడే ఖాలిద్, బిన్ లాడెన్ పాత్రల మధ్య తేడా స్పష్టమవుతుంది. ఖాలిద్ ప్రధాన రూపకర్త. బిన్ లాడెన్ అల్‌ఖైదా అధినేతగా ఆ ప్రణాళికకు ఆమోదం తెలిపి, అవసరమైన మనుషులు, వనరులు, సంస్థాగత సహకారం అందించాడు. అల్‌ఖైదాలో కీలక బాధ్యతల్లో ఉన్న మొహమ్మద్ అతెఫ్ కూడా ప్రణాళికలో ముఖ్య పాత్ర పోషించాడు.

మొహమ్మద్ అట్టా ఎలా కీలక వ్యక్తిగా మారాడు?

ఈ కుట్రలో మరో కీలక పేరు మొహమ్మద్ అట్టా. ఈజిప్టుకు చెందిన అట్టా ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదివాడు. తర్వాత జర్మనీలో ఉన్నత చదువులు కొనసాగించాడు. హాంబర్గ్‌లో ఉన్న సమయంలో మార్వాన్ అల్-షెహీ, జియాద్ జర్రా, రమ్జీ బినాల్‌షిబ్‌లతో కూడిన తీవ్రవాద వర్గంలో భాగమయ్యాడు. 1999 చివర్లో ఈ హాంబర్గ్ వర్గంలోని సభ్యులు అఫ్గానిస్థాన్‌కు చేరుకోవడం 9/11 కుట్రలో కీలక మలుపుగా మారింది. పాశ్చాత్య దేశాల్లో జీవించిన అనుభవం, ఇంగ్లీషు భాషపై పట్టుతో వారిని విమానాల దాడి ప్రణాళికకు అనుకూలమైన వ్యక్తులుగా అల్‌ఖైదా నాయకత్వం గుర్తించింది. 2000 జూన్‌లో అట్టా అమెరికాకు చేరుకున్నాడు. అక్కడ విమాన శిక్షణ తీసుకున్నాడు. చివరకు అమెరికాలో దాడిని అమలు చేసే బృందానికి కీలక నాయకుడిగా ఎదిగాడు. 2001 సెప్టెంబర్ 11న అతడు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11లో ఉన్నాడు. అదే విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది.

విమానంలో లేడు.. అయినా కుట్రలో కీలకమే

9/11 కథలో ఎక్కువగా వినిపించని మరో పేరు రమ్జీ బినాల్‌షిబ్. అతడూ హాంబర్గ్ వర్గంలో భాగమే. మొదట అమెరికాకు వెళ్లి పైలట్‌గా ఈ కుట్రలో పాల్గొనాలని ప్రయత్నించాడు. కానీ అమెరికా వీసా రాకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. అయినా కుట్ర నుంచి అతడు బయటపడలేదు. అమెరికాలో ఉన్న అట్టా, అల్‌ఖైదా సీనియర్ నాయకత్వం మధ్య సమాచారాన్ని చేరవేసే కీలక మధ్యవర్తిగా వ్యవహరించాడు. అట్టా నుంచి వచ్చిన సమాచారాన్ని అల్‌ఖైదా నాయకత్వానికి చేరవేసే వ్యవస్థలో అతడి పాత్ర ఉంది. అంటే 9/11 అంటే విమానాల్లో ఉన్న 19 మంది కథ మాత్రమే కాదు. వారి వెనుక ప్రణాళిక రచించినవారు, నాయకత్వం వహించినవారు, సమాచార సమన్వయం చేసినవారితో కూడిన పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్ కూడా ఉంది.

చివరకు ఆ ఉదయం...

2001 సెప్టెంబర్ 11న అల్‌ఖైదాకు చెందిన 19 మంది నాలుగు అమెరికన్ వాణిజ్య విమానాలను హైజాక్ చేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్‌ను ఢీకొట్టింది. మూడో విమానం అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్‌ను ఢీకొట్టింది. నాలుగోది యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93. ఇతర విమానాలపై జరిగిన దాడుల గురించి ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకున్న ప్రయాణికులు హైజాకర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఆ ప్రతిఘటన మధ్య విమానం పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్ సమీపంలో కూలిపోయింది. అందులో ఉన్న 40 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఒక్క ఉదయం మొత్తం 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్‌లో 2,753 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, ఫ్లైట్ 93లో 40 మంది మరణించారు.

మరి సూత్రధారులు ఏమయ్యారు?

9/11 తర్వాత దాదాపు పదేళ్లపాటు ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు చిక్కలేదు. చివరకు 2011 మే 2న పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా ప్రత్యేక దళాలు చేపట్టిన రహస్య సైనిక చర్యలో అతడు హతమయ్యాడు. ఖాలిద్ షేక్ మొహమ్మద్ కథ మాత్రం మరోలా సాగింది. 2003 మార్చి 1న పాకిస్తాన్‌లోని రావల్పిండిలో అతడిని పట్టుకున్నారు. అనంతరం అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఆధీనంలోని రహస్య నిర్బంధ కేంద్రాల్లో ఉంచి విచారించారు. 2006లో క్యూబాలోని గ్వాంటనామో బే సైనిక నిర్బంధ కేంద్రానికి తరలించారు. పాతికేళ్లు పూర్తవుతున్న 2026 నాటికీ ఖాలిద్‌పై న్యాయప్రక్రియ పూర్తికాలేదు. అతడు గ్వాంటనామో బేలోనే నిర్బంధంలో ఉన్నాడు. విమానంలో లేని మరో కీలక వ్యక్తి అయిన రమ్జీ బినాల్‌షిబ్ 2002 సెప్టెంబర్‌లో కరాచీలో పట్టుబడ్డాడు; అప్పటి నుంచి గ్వాంటనామో బేలోనే నిర్బంధంలో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నాడు.

పాతికేళ్ల తర్వాత...

9/11 కథను వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అది 2001 సెప్టెంబర్ 11 ఉదయం ఒక్కసారిగా పుట్టిన కుట్ర కాదు. 1993 వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబు దాడి నేపథ్యం.. బోజింకా కుట్ర.. ఖాలిద్ ప్రతిపాదించిన విమానాల దాడి ప్రణాళిక.. బిన్ లాడెన్ ఇచ్చిన సంస్థాగత మద్దతు.. హాంబర్గ్ వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు.. చివరకు అమెరికాలో జరిగిన దాడులు — ఇలా ఎన్నో దశలు దాటుకుంటూ ఆ కుట్ర రూపుదిద్దుకుంది. చివరకు నాలుగు విమానాలను హైజాక్ చేసిన 19 మంది ప్రపంచం కళ్లముందే దాన్ని అమలు చేశారు. కుట్రకు సూత్రధారుల్లో కొందరు చనిపోయారు. మరికొందరు కటకటాల వెనుక ఉన్నారు. కానీ ఆ కుట్రతో ఎలాంటి సంబంధం లేని 2,977 మంది అమాయకులు చెల్లించిన మూల్యం మాత్రం తిరిగి రానిది. పాతికేళ్లు గడిచాయి. క్యాలెండర్‌లో తేదీలు మారాయి. న్యూయార్క్ నగర రూపురేఖలు కూడా మారాయి. కానీ 2001 సెప్టెంబర్ 11 ఉదయం మిగిల్చిన విషాదం మాత్రం చరిత్రలో అలాగే నిలిచిపోయింది.

 

Advertisement
Advertisement