త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Ships Safely Cross Hormuz | హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన 10 భారతీయ నౌకలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం మధ్య 10 భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించాయి. మరోవైపు, అమెరికాతో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలను ఇరాన్ తీవ్రంగా తిరస్కరించింది.

J

International | Published On Apr 20, 2026, 6.13 pm IST

Indian Ships Safely Cross Hormuz | హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన 10 భారతీయ నౌకలు
Advertisement

Indian Ships Safely Cross Hormuz | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో (West Asia) యుద్ధ వాతావరణం అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో భారతదేశానికి ఒక ఊరటనిచ్చే వార్త ఇది. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఇరాన్ నావికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ, 10 భారతీయ నౌకలు ఆ మార్గం గుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకున్నాయి.

భారత నౌకల ప్రయాణం సేఫ్

హార్ముజ్ జలసంధిని 10 భారతీయ నౌకలు సురక్షితంగా దాటాయని ఒక భారత ప్రభుత్వ అధికారి తెలిపినట్లు ప్రముఖ వార్తా సంస్థ 'రాయిటర్స్' వెల్లడించింది. సముద్ర మార్గంలో భారతీయ నౌకల సురక్షిత ప్రయాణం కోసం భారత ప్రభుత్వం నిరంతరం ఇరాన్, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని సదరు అధికారి స్పష్టం చేశారు. ఇటీవల అదే జలసంధిలో భారతీయ నౌకలపై దాడులు జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, తాజా పరిణామం భారత్‌కు ఊరటనిచ్చింది.

అమెరికాతో చర్చలకు ఇరాన్ 'నో'

మరోవైపు, పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరగాల్సిన రెండో విడత కాల్పుల విరమణ చర్చలను (Ceasefire Talks) ఇరాన్ తిరస్కరించింది. అమెరికా వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమని మండిపడింది. "వాషింగ్టన్ అహేతుకమైన డిమాండ్లు చేస్తోంది. వారి అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయి. వైఖరిలో నిరంతరం మార్పులు, పదేపదే వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి వద్ద నావికా దిగ్బంధనం కొనసాగిస్తోంది" అని ఇరాన్ ఆరోపించింది.

అయితే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నేతృత్వంలోని అమెరికా ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్ చేరుకోనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, ఇరాన్ చర్చలకు రానని స్పష్టం చేయడంతో, పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలకు ముగింపు పలికే అవకాశాలు సన్నగిల్లాయి.

ఇరాన్ అధ్యక్షుడితో పాక్ ప్రధాని మంతనాలు

ఈ పరిణామాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఊపందుకున్నాయి. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif), ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌ (Masoud Pezeshkian)తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాలతో పాకిస్థాన్ జరిపిన సంప్రదింపుల వివరాలను కూడా షెహబాజ్ షరీఫ్.. ఇరాన్ అధ్యక్షుడికి వివరించినట్లు సమాచారం.

Advertisement
Advertisement