త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Volcanic Eruption | బద్ద‌లైన‌ అగ్నిప‌ర్వ‌తం.. నిలిచిన విమానాలు.. చిక్కుకుపోయిన 1.70లక్ష‌ల మంది ప్ర‌యాణికులు

Volcanic Eruption | ఇండోనేషియాలోని అనక్‌ క్రకటోవా అగ్ని పర్వతం (Mount Anak Krakatoa) బ‌ద్ద‌లైంది. భారీగా లావా, బూడిద‌ను వెద‌జ‌ల్లుతున్నది. బూడిద మేఘాలు (Volcanic Eruption) జావా వైపు 20వేల అడుగుల ఎత్తుకు, సుమత్రా వైపు ఏకంగా 50వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి.

G

International | Published On Sep 7, 2026, 8.29 am IST

Volcanic Eruption | బద్ద‌లైన‌ అగ్నిప‌ర్వ‌తం.. నిలిచిన విమానాలు.. చిక్కుకుపోయిన 1.70లక్ష‌ల మంది ప్ర‌యాణికులు
Advertisement

Volcanic Eruption | త్రినేత్ర‌.న్యూస్‌: ఇండోనేషియాలోని అనక్‌ క్రకటోవా అగ్ని పర్వతం (Mount Anak Krakatoa) బ‌ద్ద‌లైంది. భారీగా లావా, బూడిద‌ను వెద‌జ‌ల్లుతున్నది. బూడిద మేఘాలు (Volcanic Eruption) జావా వైపు 20వేల అడుగుల ఎత్తుకు, సుమత్రా వైపు ఏకంగా 50వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో విమాన రాక‌పోక‌లు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. దేశంలోని ప్ర‌ధాన విమానాశ్ర‌యం అయిన‌ జకార్తా ఎయిర్‌పోర్ట్‌ సహా ఏడు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. మొత్తం 1558 విమానాల‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఆయా విమానాశ్ర‌యాల్లో సుమారు 1.70 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు (Passengers Stranded) చిక్కుకుపోయారు.

జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జల సంధిలో ఉన్న ఈ అగ్ని పర్వతం ఆదివారం తెల్ల‌వారుజామున 3.53కి 30 సెకండ్ల పాటు విస్ఫోటం చెందింది. లావా, విస్పోట‌న శ‌బ్దాలు కొన్ని వంద‌ల కిల‌మీట‌ర్ల వ‌ర‌కు వినిపించాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. 50వేల అడుగుల ఎత్తుకు బూడిద మేఘాలు చేరుకున్నాయని ఇండోనేషియా (Indonasia) వాతావరణ సంస్థ తెలిపింది. అగ్ని పర్వతానికి కనీసం 3 కిలోమీటర్ల దూరం వరకు సందర్శకులెవరూ వెళ్లొద్దని హెచ్చరించింది. బూడిద తీవ్రత కారణంగా శ్వాసకోశ, కళ్లు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉండ‌టంతో.. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. జకార్తాలోని సోకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల‌తోపాటు జకార్తా, లంపంగ్‌ ప్రావిన్స్‌లలోని పలు ప్రాంతాల్లో అగ్ని పర్వతం బూడిదను గుర్తించారు. విస్ఫోటం కారణంగా రెండు బూడిద మేఘాలు ఏర్పడినట్టు తెలియజేసింది.

ఆంక్షల పొడిగింపు

అగ్నిప‌ర్వ‌తం నుంచి వ‌చ్చిన‌ బూడిద గాల్లో వ్యాపించ‌డంతో జ‌కార్తా తోపాటు ఏడు విమానాశ్ర‌యాల‌ను (Airports Closed) తాత్కాలికంగా మూసివేశారు. దీంతో సింగపూర్, దోహా, సిడ్నీ, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కాగా, పెరుగుతున్న విస్ఫోటన కార్యకలాపాల కారణంగా సోమవారం ఉదయం 8.59 గంటల వరకు ఈ ఆంక్షలను పొడిగించారు. దీంతో ఎనిమిది విమానాశ్ర‌యాల్లో 1558 విమాన స‌ర్వీసులు ర‌ద్ద‌వ‌గా, 1 ల‌క్షా 70 వేల మంది ప్ర‌యాణికులు చిక్కుకుపోయారు.

ర‌ద్ద‌యిన‌వాటిలో 900కు పైగా విమానాలు సోకార్నో - హట్టా విమానాశ్రయానికి రావాల్సినవే ఉన్నాయని (Flights Cancelled) ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. విమాన రాకపోకలకు ప్రత్యామ్నాయంగా సెమరాంగ్, సురబయా తదితర నగరాల్లోని విమానాశ్రయాలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి దుడీ పుర్వగంధి తెలిపారు. కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విమానయాన సంస్థలకు సూచించారు.

క్రకటోవా నుంచి ఏర్ప‌డిన అన‌క్ క్ర‌క‌టోవా..

అనక్ క్రకటోవా అంటే 'క్రకటోవా బిడ్డ' అని అర్థం. 1883లో మౌంట్ క్రకటోవా  (Krakatoa Volcano) భారీ పేలుడు తర్వాత ఏర్పడిన పగుళ్ల నుంచి గత శతాబ్దం ప్రారంభంలో ఈ అగ్నిపర్వతం సముద్రం నుంచి పైకి ఉద్భవించింది. అప్పటినుంచి ఇది అప్పుడప్పుడు బద్దలవుతూనే ఉంది. డిసెంబర్ 2018లో ఈ అగ్నిపర్వతం కూలిపోవడంతో సంభవించిన భారీ సునామీ (Tsunami) వ‌ల్ల‌ సుమత్రా, జావా తీర ప్రాంతాల్లో 400 మందికి పైగా మరణించారు. వేల మంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో సుమారు 70-90 మీటర్ల ఎత్తున్న రాతి బండలు విరిగిపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇండోనేషియా పసిఫిక్రిం గ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) ప్రాంతంలో ఉంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ దక్షిణ అమెరికా అంచు నుంచి న్యూజిలాండ్ వరకు దాదాపు 40వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ జోన్‌లో భారీ సంఖ్యలో అగ్నిపర్వతాలు, భూకంప కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలో వచ్చే భూకంపాలలో (Earthquakes) దాదాపు 90 శాతం ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి. భూమిపై ఉన్న క్రియాశీల అగ్నిపర్వతాలలో 75 శాతం అంటే దాదాపు 452 అగ్నిపర్వతాలు ఇక్క‌డే ఉండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement