త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court | రోడ్డెవరు వేశారో తేల్చండి.. హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై పోలీసులకు హైకోర్టు ఆదేశం

High Court | మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నిజాంపేట, బాచుపల్లి పరిధిలోని ఏపీఆర్‌ ప్రణవ్‌ యాంటిల్లా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద ఏర్పడిన రహదారి నిర్మాణం వెనుక ఎవరున్నారో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది.

P

Hyderabad | Published On Mar 13, 2026, 11.02 pm IST

High Court | రోడ్డెవరు వేశారో తేల్చండి.. హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై పోలీసులకు హైకోర్టు ఆదేశం
Advertisement

High Court | మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నిజాంపేట, బాచుపల్లి పరిధిలోని ఏపీఆర్‌ ప్రణవ్‌ యాంటిల్లా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద ఏర్పడిన రహదారి నిర్మాణం వెనుక ఎవరున్నారో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. బాచుపల్లి, దుండిగల్‌, జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు ఈ అంశంపై దర్యాప్తు చేసి వివరాలు ఇవ్వాలని సూచించింది. జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీఆర్‌ ప్రణవ్‌ యాంటిల్లా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. గేటెడ్‌ కమ్యూనిటీలోని కాంపౌండ్‌ గోడను హైడ్రా అధికారులు కూల్చి రహదారి నిర్మాణం చేపట్టారని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, తాము రోడ్డు వేయలేదని హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత ఏడాది జూన్‌లో హైడ్రా అధికారులు కాంపౌండ్‌ గోడను కొంతవరకు కూల్చివేయడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఆ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండా పాత నోటీసును ఆధారంగా చేసుకుని ఈనెల 5న తుది నోటీసు జారీ చేశారని చెప్పారు. రెండురోజుల్లో నిర్మాణాలను తొలగించాలంటూ ఇచ్చిన గడువు అన్యాయమని వాదించారు. ఈనెల 9న ఉదయం హైడ్రా అధికారులు పోలీసులతో కలిసి జేసీబీలతో వచ్చి కాంపౌండ్‌ గోడను కూల్చివేశారని తెలిపారు. వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

2014లో లేఔట్‌కు అనుమతులు తీసుకుని 600కు పైగా విల్లాలు నిర్మించామని, ఓపెన్‌ స్పేస్‌గా వదిలిన ప్రాంతంలో కాంపౌండ్‌ను కూల్చి పక్క భూమిలోకి రహదారి తీసుకువచ్చారని ఆరోపించారు. హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది డ్రాఫ్ట్‌ లేఔట్‌ ప్లాన్‌ ప్రకారం అక్కడ కాంపౌండ్‌ నిర్మాణం అనుమతించబడదని, రహదారులను మూసివేయరాదని తెలిపారు. హైడ్రా తరఫు న్యాయవాది మాత్రం తాము రహదారి నిర్మాణంలో భాగం కాలేదని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి హెచ్‌ఎండీయే, హైడ్రా సంస్థలు రహదారి నిర్మాణం జరగలేదని చెబుతున్న నేపథ్యంలో అసలు రోడ్డు ఎలా ఏర్పడిందన్నది విచారణకు అంశమని పేర్కొన్నారు. సంబంధిత పోలీసులు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ కేసు విచారణను ఏప్రిల్‌ 7కు వాయిదా వేశారు. అంతవరకు నాలుగు వారాలపాటు యథాతథ స్థితి కొనసాగించాలని, కొత్తగా ఏర్పడిన రహదారిపై రాకపోకలు అనుమతించవద్దని ఆదేశించారు.

Advertisement
Advertisement