త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Journalist Accreditation Cards Telangana | తెలంగాణ జర్నలిస్టులకు బిగ్ రిలీఫ్.. అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు!

తెలంగాణలోని జర్నలిస్టులకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన వివాదాస్పద జీవోలపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుత కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపిన వివరాలను రికార్డు చేసింది. కోర్టులో జరిగిన పూర్తి వాదనల ఇవే.

J

Hyderabad | Published On Feb 26, 2026, 7.13 pm IST

Journalist Accreditation Cards Telangana | తెలంగాణ జర్నలిస్టులకు బిగ్ రిలీఫ్.. అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు!
Advertisement

Journalist Accreditation Cards Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) భారీ ఊరటనిచ్చింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (Accreditation cards) నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రస్తుత కార్డుల చెల్లుబాటు గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అసలు వివాదం ఏంటి? కోర్టులో ఏం జరిగింది?

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు, అక్రిడిటేషన్ నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 252, సవరించిన జీవో 103లను సవాలు చేస్తూ 'తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్' (TUWJF) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ జీవోల వల్ల జర్నలిస్టుల వృత్తిపరమైన కార్యకలాపాలకు, వారికి అందే సదుపాయాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని పిటిషనర్ తరఫు ప్రముఖ న్యాయవాది బర్కత్ అలీ ఖాన్ కోర్టుకు విన్నవించారు.

ప్రభుత్వం వివరణ ఏంటి?

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక వివరణ ఇచ్చారు. జర్నలిస్టుల రోజువారీ వృత్తి కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రస్తుతమున్న అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు తాత్కాలికంగా పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు.. ప్రస్తుతం వాడుకలో ఉన్న కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అలాగే, జీవో 252, జీవో 103 నిబంధనలపై పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి స్థాయి వివరణ (కౌంటర్) సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

అంతరాయం లేకుండా సేవలు

హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడిటెడ్ జర్నలిస్టులు.. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావడానికి, ఇతర ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదు.

న్యాయం జరిగే వరకు పోరాటం

కోర్టు తీర్పుపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TUWJF) జనరల్ సెక్రటరీ సయ్యద్ ఘౌస్ ముహియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. కార్డుల గడువు పొడిగింపును స్వాగతిస్తున్నామని, అయితే ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ఉన్న నిబంధనలు తొలగిపోయి, వారికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement