త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CV Anand | మ‌హిళ‌ల‌, పిల్ల‌ల భ‌ద్ర‌త‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్‌

CV Anand | మహిళల భద్రతతో పాటు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మల్కాజ్‌గిరి కమిషనరేట్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం “మీ సురక్ష – కలసి ఉంటే కలదు సుఖం” అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (CDEW) – ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్స్ (FCCs) సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం కుటుంబ సామరస్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించింది.

P

Hyderabad | Published On Jun 6, 2026, 8.30 pm IST

CV Anand | మ‌హిళ‌ల‌, పిల్ల‌ల భ‌ద్ర‌త‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్‌
Advertisement

CV Anand | మహిళల భద్రతతో పాటు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మల్కాజ్‌గిరి కమిషనరేట్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం “మీ సురక్ష – కలసి ఉంటే కలదు సుఖం” అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (CDEW) – ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్స్ (FCCs) సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం కుటుంబ సామరస్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించింది. వివాహ బంధాల పరిరక్షణ, మహిళల భద్రతపై అవగాహన, కుటుంబ వివాదాలను కౌన్సెలింగ్ ద్వారా శాంతియుతంగా పరిష్కరించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. కమిషనరేట్ పరిధిలోని సీడీఈడ‌బ్ల్యూ కేంద్రాల జోక్యంతో తిరిగి కలిసిన 150కిపైగా దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, షీ షటిల్స్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు వంటి వ్యవస్థలు మహిళల భద్రతను బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ద్వారా కుటుంబాలను తిరిగి కలపడంలో మల్కాజిగిరి కమిషనరేట్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, సంభాషణ కుటుంబ స్థిరత్వానికి కీలకమని సూచించారు. మహిళా భద్రతా విభాగం డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ కుటుంబ సంబంధాలను నిలబెట్టడంలో ఓర్పు, నమ్మకం, అవగాహన అవసరమని అన్నారు. భరోసా కేంద్రాలు, సీడీఈడ‌బ్ల్యూ సెంటర్లు వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ హెడ్ ఎస్ఎన్ శ్రీదేవి మాట్లాడుతూ వివాహం పరస్పర గౌరవంపై ఆధారపడిన సామాజిక వ్యవస్థ అని, కౌన్సెలింగ్ కుటుంబ సమస్యల పరిష్కారంలో సమర్థ సాధనమని చెప్పారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది సీడీఈడ‌బ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 9,700కుపైగా కేసులు పరిష్కరించగా, 32వేల‌కుపైగా కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే, 377 అవగాహన కార్యక్రమాల ద్వారా 16వేల మందికి చేరువయ్యామని, సేవలపై 90 శాతానికి పైగా సంతృప్తి నమోదైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తిరిగి కలిసిన దంపతులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కుటుంబ కౌన్సెలింగ్‌లో విశేష సేవలందించిన కేంద్రాలు, కౌన్సిలర్లు, సిబ్బందిని సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు దంపతులు తమ అనుభవాలను పంచుకుంటూ, కుటుంబాలను మళ్లీ కలిపిన పోలీసు, కౌన్సెలింగ్ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement