త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Ramesh | ప్రైవేట్ ట్రావెల్స్‌తో సైబ‌రాబాద్ పోలీసుల స‌మావేశం.. విద్యార్థుల భ‌ద్ర‌త‌కు కీల‌క ఆదేశాలు..

CP Ramesh | విద్యార్థుల రవాణా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, సాంకేతిక పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్ ఎం ర‌మేశ్ శనివారం ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన ఈ భేటీలో రవాణా శాఖ, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ సభ్యులు, విద్యాసంస్థల రవాణా నిర్వాహకులు పాల్గొన్నారు.

P

Hyderabad | Published On Jun 6, 2026, 7.52 pm IST

CP Ramesh | ప్రైవేట్ ట్రావెల్స్‌తో సైబ‌రాబాద్ పోలీసుల స‌మావేశం.. విద్యార్థుల భ‌ద్ర‌త‌కు కీల‌క ఆదేశాలు..
Advertisement

CP Ramesh | విద్యార్థుల రవాణా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, సాంకేతిక పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్ ఎం ర‌మేశ్ శనివారం ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన ఈ భేటీలో రవాణా శాఖ, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ సభ్యులు, విద్యాసంస్థల రవాణా నిర్వాహకులు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ స్పష్టం చేశారు. విద్యార్థులను తరలించే ప్రతి వాహనంలో సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ఆధారిత రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థలు, అత్యవసర భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. డ్రైవర్ల అర్హతలు, లైసెన్సులు, వాహన ఫిట్‌నెస్‌పై నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు, SCSC సంయుక్తంగా రూపొందించిన స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్‌పై ప్రజెంటేషన్ నిర్వహించారు.

ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, నిబంధనల కఠిన అమలు, భద్రత పెంపు, అందుబాటు ధరల్లో రవాణా సేవలు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలని వివరించారు. స్టూడెంట్ మొబిలిటీ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రయాణ వివరాలను రియల్‌టైమ్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. వాహనంలో విద్యార్థుల సంఖ్య, ఓవర్‌క్రౌడింగ్ స్థితి, డ్రైవర్ వివరాలు, లైసెన్స్ స్థితి, వాహనం ఫిట్‌నెస్, మార్గం, ప్రస్తుత లొకేషన్ వంటి కీలక సమాచారం యాప్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా విద్యార్థుల రవాణా వాహనాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, క్రీడా శిక్షణ కేంద్రాలకు విద్యార్థుల రవాణాలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులు వివరించారు.

ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, భద్రతా ప్రమాణాల అమలు, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా కార్యక్రమం ముందుకు సాగనుందని తెలిపారు. సమావేశంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులు రవాణా అనుమతులు, లైసెన్సులు, ఆర్టీఓ సంబంధిత సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారాలు అమలు చేస్తామని సీపీ హామీ ఇచ్చారు. ప్రారంభ దశలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని సీపీ సూచించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement