త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కాలనాగులతో జాగ్రత్త.. 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే : కేటీఆర్‌

KTR | కాలం మనది కాని స‌మ‌యంలో వాన‌పాములు సైతం నాగుపాములై బుస‌లుకొడుతాయ‌ని, అలాంటి వాటితో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు సూచించారు. 2028లో వ‌చ్చేది కేసీఆర్ ప్ర‌భుత్వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు.

P

Telangana | Published On Jun 6, 2026, 8.51 pm IST

KTR | కాలనాగులతో జాగ్రత్త.. 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే : కేటీఆర్‌
Advertisement

KTR | కాలం మనది కాని స‌మ‌యంలో వాన‌పాములు సైతం నాగుపాములై బుస‌లుకొడుతాయ‌ని, అలాంటి వాటితో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు సూచించారు. 2028లో వ‌చ్చేది కేసీఆర్ ప్ర‌భుత్వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌వాసీ తెలంగాణ బిడ్డ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తమ మాతృభూమిని మర్చిపోకుండా ఆవిర్భావ సంబరాలు చేసుకుంటున్న ఎన్నారైలందరికీ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉన్న ఊరును, కన్న తల్లిని మర్చిపోకుండా ఖండాలు దాటినా తెలంగాణ తల్లిని తలుచుకుంటూ ఆవిర్భావ దినోత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం గొప్ప విషయమని ప్ర‌శంసించారు. వేల సంవత్సరాల కిందట మొదలైన తెలంగాణ చరిత్ర రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు, సంస్కృతి, పాటలతో తరతరాలుగా విలసిల్లుతున్నదన్నారు.

ప్ర‌తి త‌రం యుద్ధాన్ని న‌డిపించింది..

తెలంగాణ జాతిలో ప్రతి తరం ఏదో ఒక యుద్ధాన్ని, రణాన్ని నడిపించిందని కేటీఆర్ గుర్తు చేశారు. అది సాయుధ పోరాటాలైనా, ప్రజా ఉద్యమాలు, త్యాగాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైనా కావొచ్చ‌న్నారు. ప్ర‌తిసారీ తెలంగాణ జాతి తోటి ప్రజల కోసం కొట్లాడిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదన్నారు. భక్త రామదాసు (కంచర్ల గోపన్న) నుంచి గోరటి వెంకన్న దాకా ధిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజా కళాకారుల నుంచి మొదలుకొని ప్రజానాయకులు ఎందరినో కన్న ఈ గడ్డ అత్యంత ప్రత్యేకమైనదన్నారు. ప్రకృతితో మమేకమై బతుకమ్మను జరుపుకునే, పువ్వులను పూజించి ప్రకృతిని ఆరాధించే ఒకే ఒక్క జాతి ఈ ప్రపంచంలో తెలంగాణ జాతి అని ఆయన స్పష్టం చేశారు. ఇంత అద్భుతమైన చరిత్ర, సంస్కృతి కలిగిన మనందరం "నాది తెలంగాణ, నాది తెలంగాణ జాతి, నేను తెలంగాణ బిడ్డను" అని సగర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఊరికెనే రాలేదు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నదని, అయితే ఈ ప్రత్యేక రాష్ట్రం ఊరికేనే రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. దశాబ్దాల పాటు జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో జరిగిన మలి తెలంగాణ ఉద్యమంతోనే ఇది సాధ్యమైందన్నారు. మలి విడత ఉద్యమానికి నాయకత్వం వహించి, సబ్బండ వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళిన కేసీఆర్ గారి నాయకత్వంలో పుష్కరానికి పైగా సాగిన ప్రజాస్వామిక ఉద్యమం వల్లనే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందన్నారు. అనేక పదవీ త్యాగాలు, సవాళ్లను దాటుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. ప్రపంచంలో కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాం లాంటి దేశాలను 'ఏషియన్ టైగర్స్' గా పిలుస్తుంటారని, అవి చిన్న దేశాలే అయినా సాధించిన విజయాలు అతి గొప్పవని కేటీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా భారతదేశంలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ సైతం అత్యంత తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు.

అన్న‌పూర్ణ‌గా మ‌లిచిన ఘ‌న‌త కేసీఆర్‌దే

ఒకనాటి వలసల తెలంగాణను, కరువుల తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ గారిదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణను వ్యవసాయం నుంచి మొదలుకొని పరిశ్రమల దాకా ప్రతి రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టింది ముమ్మాటికీ కేసీఆర్‌దేన‌ని పున‌రుద్ఘాటించారు. ఒకనాడు అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న తెలంగాణను ఆర్థిక అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి, తలసరి ఆదాయంతో పాటు స్థూల జీఎస్డీపీ (GSDP) లోనూ ప్రథమ స్థానానికి చేర్చామన్నారు. ఒకప్పుడు గేలి చేయబడిన తెలంగాణ సంస్కృతిని ఈనాడు సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది కూడా ముమ్మాటికీ కేసీఆరేన‌న్నారు. "ఇవేమీ తెలియని 4 ఫీట్లు ఉన్న నాయకులు కొంతమంది తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసకొడతాయి. అలాంటి విషనాగులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement