త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tech Mahindra | ఆరోగ్యం బాగాలేక‌ సెల‌వు పెడితే ఉద్యోగం నుంచి తీసేశారు.. టెక్ మ‌హీంద్రాపై ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు..

Tech Mahindra | ఆరోగ్యం బాగాలేద‌ని సెల‌వు పెడితే తీవ్ర వేధింపుల‌కు గురి చేశార‌ని, చివ‌ర‌కు ఎలాంటి స‌రైన కార‌ణం లేకుండానే త‌న‌ను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని ఆరోపిస్తూ భావ‌న అనే ఓ ఐటీ ఉద్యోగిని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మేడ్చ‌ల్‌లోని టెక్ మ‌హీద్రా కార్యాల‌యం ఎదుట ఆమె గురువారం నిర‌స‌న చేప‌ట్టి తన గోడును మీడియాకు వెళ్ల‌బోసుకుంది.

S

Hyderabad | Published On Jul 23, 2026, 3.55 pm IST

Tech Mahindra | ఆరోగ్యం బాగాలేక‌ సెల‌వు పెడితే ఉద్యోగం నుంచి తీసేశారు.. టెక్ మ‌హీంద్రాపై ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు..
Advertisement

Tech Mahindra | ఆరోగ్యం బాగాలేద‌ని సెల‌వు పెడితే తీవ్ర వేధింపుల‌కు గురి చేశార‌ని, చివ‌ర‌కు ఎలాంటి స‌రైన కార‌ణం లేకుండానే త‌న‌ను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని ఆరోపిస్తూ భావ‌న అనే ఓ ఐటీ ఉద్యోగిని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మేడ్చ‌ల్‌లోని టెక్ మ‌హీద్రా కార్యాల‌యం ఎదుట ఆమె గురువారం నిర‌స‌న చేప‌ట్టి తన గోడును మీడియాకు వెళ్ల‌బోసుకుంది. భావ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. టెక్ మ‌హీంద్రాలో ఆమె గ‌త నాలుగున్న‌ర నెల‌లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వ‌హిస్తోంది. ఇటీవ‌ల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. శారీర‌కంగా కోలుకునేందుకు వైద్యుల స‌ల‌హా మేర‌కు 13 రోజుల పాటు సెల‌వు తీసుకుంది. అయితే అనారోగ్యం కార‌ణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న‌ప్ప‌టికీ కంపెనీ ఉన్న‌త స్థాయి ఉద్యోగులు త‌న‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌లేద‌ని ఆమె వాపోయింది. ఇంకా ఎన్ని రోజులు సెల‌వు తీసుకుంటావు, త్వ‌ర‌గా ఆఫీసుకు రావాలంటూ త‌న‌కు నిత్యం ఈ-మెయిల్స్ పంపుతూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని తెలిపింది. వారి ఈ-మెయిల్స్ వ‌ల్ల తాను తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అనారోగ్యంగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు సంస్థ అండ‌గా నిల‌బ‌డ‌క‌పోగా, త‌న‌ను వేధింపుల‌కు గురి చేయ‌డం ఎంత‌గానో బాధించింద‌ని, మ‌హిళ‌ల‌కు ఇలాంటి కార్పొరేట్ సంస్థ‌ల్లో స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని ఆరోపించింది.

కుమార్తె కోసం సెల‌వు అడిగితే క‌నిక‌రించ‌లేదు: భావ‌న‌

అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరిన‌ప్ప‌టికీ యాజ‌మాన్యం త‌న ప‌ట్ల తిరిగి అలాగే ప్ర‌వ‌ర్తించింద‌ని భావ‌న తెలియ‌జేసింది. త‌న కుమార్తెకు ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆమెకు సేవ‌లు చేసేందుకు తిరిగి సెల‌వు అడ‌గాల్సి వ‌చ్చింద‌ని, అయితే ఈ సారి త‌న ప‌ట్ల ఏమాత్రం క‌నిక‌రం చూపించ‌కుండా ఉద్యోగం నుంచి తొల‌గించిన‌ట్లు చెప్పార‌ని వెల్ల‌డించింది. ఇంకా ఎన్ని రోజులు సెల‌వులో ఉంటావు, వెంట‌నే విధుల్లో చేరాలంటూ ఉన్న‌త స్థాయి ఉద్యోగులు త‌న‌పై ఒత్తిడి తెచ్చార‌ని, త‌న విజ్ఞ‌ప్తిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ఉన్న ప‌ళంగా త‌న‌ను ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కుమార్తె ఆరోగ్యం విష‌యంలో సెల‌వు కావాల‌ని అడిగితే టెక్ మ‌హీంద్రా యాజ‌మాన్యం ఇలా దారుణంగా ప్ర‌వ‌ర్తించింద‌ని తెలిపింది. ముంద‌స్తు స‌మాచారం ఇచ్చిన‌ప్ప‌టికీ ఎలాంటి నోటీసు ఇవ్వ‌కుండా త‌న‌ను అకార‌ణంగా ఉద్యోగం నుంచి తీసేశార‌ని తెలిపింది. ఉద్యోగం నుంచి తొల‌గించాలంటే 60 రోజుల ముంద‌స్తు నోటీసులు ఇవ్వాల‌ని, అయిన‌ప్ప‌టికీ అవేవీ పాటించ‌కుండా త‌న‌ను తొల‌గించార‌ని స్ప‌ష్టం చేసింది.

పోలీసుల‌కు ఫిర్యాదు..

ఆఫీసులో ప‌ని వాతావ‌ర‌ణం సైతం అత్యంత దారుణంగా ఉంటుంద‌ని భావ‌న వెల్ల‌డించింది. క‌నీసం వాష్ రూమ్‌కు వెళ్లాల‌న్నా ఉన్న‌తాధికారుల నుంచి అనుమ‌తి తీసుకోవాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న ఐటీ కెరీర్‌లో ఇలా న‌ర‌కం చూపించే కంపెనీని తాను ఎక్కడా చూడ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. సంస్థ‌ల్లో ఉద్యోగుల‌ను యంత్రాల్లా చూస్తున్నార‌ని, మ‌హిళ‌ల‌కు అయితే విలువ లేకుండా పోతుంద‌ని విచారం వ్య‌క్తం చేసింది. మ‌హిళా ఉద్యోగుల‌కు కేవ‌లం ఆఫీసు ప‌నులే కాకుండా, కుటుంబ బాధ్య‌త‌లు కూడా ఉంటాయ‌ని, ఐటీ కంపెనీల యాజ‌మాన్యాలు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేసింది. పిల్ల‌లు ఉన్న త‌ల్లుల ప‌ట్ల ఐటీ కంపెనీలు ఇంత క‌ఠినంగా, అమానుషంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని ఆమె అభిప్రాయం వ్య‌క్తం చేసింది. కాగా ఇదే విష‌య‌మై తన‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాన‌ని, పోలీసులు త‌గిన చ‌ర్య తీసుకుని త‌న‌కు న్యాయం జ‌రిగేలా చూస్తార‌ని ఆశిస్తున్నాన‌ని వెల్ల‌డించింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై టెక్ మ‌హీంద్రా ఇంకా అధికారికంగా స్పందించ‌లేదు.

Advertisement
Advertisement