త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Towers | నెర‌వేరిన సొంతింటి క‌ల‌.. 7340 ఫ్లాట్ల కేటాయింపు

Indiramma Towers | హైద‌రాబాద్ న‌గ‌రంలోని నిరుపేద‌ల సొంతింటి క‌ల నెర‌వేరింది. 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో 7340 ఫ్లాట్ల‌ను ప్ర‌భుత్వం లాట‌రీ ప్ర‌క్రియ ద్వారా.. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, నిష్ప‌క్ష‌పాతంగా ల‌బ్దిదారుల‌కు కేటాయించింది.

S

Hyderabad | Published On Aug 31, 2026, 8.01 pm IST

Indiramma Towers | నెర‌వేరిన సొంతింటి క‌ల‌.. 7340 ఫ్లాట్ల కేటాయింపు
Advertisement

16 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్
నాలుగు రోజుల పాటు కొనసాగిన లాటరీ ప్రక్రియ
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ల‌బ్దిదారుల‌ ఎంపిక

Indiramma Towers | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని నిరుపేద‌ల సొంతింటి క‌ల నెర‌వేరింది. 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో 7340 ఫ్లాట్ల‌ను ప్ర‌భుత్వం లాట‌రీ ప్ర‌క్రియ ద్వారా.. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, నిష్ప‌క్ష‌పాతంగా ల‌బ్దిదారుల‌కు కేటాయించింది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 28న లాట‌రీ ప్ర‌క్రియ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మినహాయించి మిగిలిన 15 నియోజకవర్గాల్లో 480 ఇండ్ల చొప్పున కేటాయించారు. కంటోన్మెంట్ పరిధిలో తొలివిడతలో 140 ఇండ్లను మాత్రమే నిర్మిస్తున్నందున ఆ సంఖ్యలోనే ఇండ్లను కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలోనూ, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికే ఇండ్లు కేటాయించాలన్న ఉద్దేశ్యంతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టి, హౌసింగ్ బోర్డు ద్వారా దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఇలా అందుబాటులో ఉన్న స్థలాల్లో ప్రతిపాదించిన మొత్తం 7340 ఇండ్లకు గాను, 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో అర్హులైన వారి పేర్లతో పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బహిరంగంగా లాటరీ నిర్వహించి ఇండ్లను కేటాయించారు. ఆగస్టు 28వ తేదీ నుంచి 31 వరకు ఆయా నియోజకవర్గాల్లోనే దరఖాస్తుదారులు, అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ జరిగింది. లాటరీ నిర్వహణ ప్రక్రియపై దరఖాస్తుదారుల్లో సంతృప్తి వ్యక్తం కాగా, లాటరీ ద్వారా ఇండ్లు పొందిన కుటుంబాల్లో మరింత సంతోషాలను నింపింది.

ఔట‌ర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 16 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు పూర్తి కాగా, 4 నియోజకవర్గాల్లో ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడనున్నది.

ఆన్‌లైన్‌లో వివరాలు.. అభ్యంతరాల స్వీకరణ

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో లాటరీ ద్వారా ఇండ్లు పొందిన వారి వివరాలన్నిటినీ tghb.telangana.gov.in లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతం తెలిపారు. ఇలా ఎంపికైన వారి మీద ప్రజలు తమ అభ్యంతరాలను తెలియచేసే అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ అభ్యంతరాలను కూడా వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చన్నారు. అలాగే, లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించడానికి అధికారుల బృందం క్షేత్ర స్థాయి పరిశీలనను చేపడుతుందని ఆయన వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా, అర్హులైన వారికే ఇండ్లు లభించేలా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. లాటరీలో ఇండ్లు వచ్చిన వారు క్షేత్ర స్థాయిలో తమ ఇండ్లకు వచ్చే అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

త్వరలో మరిన్ని ప్రాజెక్టులు

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కోసం దరఖాస్తు చేసుకుని, లాటరీ ప్రక్రియలో ఇండ్లు రాని వారు ఏమాత్రం నిరుత్సాహం చెందవద్దని, త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను చేపడతామని, అందులో ఇండ్లు వచ్చే అవకాశం ఉందని బోర్డు వైస్ ఛైర్మన్ గౌతం తెలిపారు. ఇలా అర్హులైన వారికి ఇండ్లను నిర్మించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన వివరించారు.

Advertisement
Advertisement