త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bathukamma Kunta | మ‌ళ్లీ బ‌తుక‌మ్మ కుంట ఆక్ర‌మ‌ణ‌కు కుట్ర‌లు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్‌

Bathukamma Kunta | తెలంగాణ ఆడబిడ్డలు ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రతీకగా ఉన్న బతుకమ్మ కుంటను గతంలో కబ్జా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు హైడ్రా ద్వారా కబ్జాదారులను తొలగించి కుంటను పునరుద్ధరించామని తెలిపారు. ఇప్పుడు అదే బతుకమ్మ కుంటను తిరిగి ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

P

Telangana | Published On Aug 31, 2026, 7.15 pm IST

Bathukamma Kunta | మ‌ళ్లీ బ‌తుక‌మ్మ కుంట ఆక్ర‌మ‌ణ‌కు కుట్ర‌లు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్‌
Advertisement

Bathukamma Kunta | తెలంగాణ ఆడబిడ్డలు ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రతీకగా ఉన్న బతుకమ్మ కుంటను గతంలో కబ్జా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు హైడ్రా ద్వారా కబ్జాదారులను తొలగించి కుంటను పునరుద్ధరించామని తెలిపారు. ఇప్పుడు అదే బతుకమ్మ కుంటను తిరిగి ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూసారాంబాగ్‌–అంబర్‌పేట వంతెనను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. బతుకమ్మను పేర్చి, పాటలు పాడి కుంటల్లో నిమజ్జనం చేయడం తెలంగాణ ఆడబిడ్డల సంప్రదాయమని రేవంత్‌రెడ్డి అన్నారు. అలాంటి బతుకమ్మ కుంటనే ఆక్రమించారని పేర్కొన్నారు. ‘‘ఏ నాయకుడు వస్తే హెలికాప్టర్‌ పెట్టి పై నుంచి పూలు జల్లి పది ఎకరాల భూమిని కబ్జా పెట్టుకున్నారో ఇక్కడున్న ఆడబిడ్డలకు తెలియదా?’’ అని ప్రశ్నించారు.

క్రీడాస్థ‌లాన్ని ఏర్పాటు చేశాం..

స్థానికులు బతుకమ్మ కుంటను చెర నుంచి విడిపించాలని కోరడంతో హైడ్రాను పంపించి కబ్జాదారులను ఈడ్చుకెళ్లి ప‌డేశామ‌ని సీఎం చెప్పారు. కుంటను పునరుద్ధరించామని, మట్టి తొలగించడంతో ఎండాకాలంలోనూ నీరు వచ్చిందన్నారు. గతంలో గాయని విమలక్క వచ్చి పాట పాడిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. అప్పట్లో కలగా కనిపించిన బతుకమ్మ కుంట పునరుద్ధరణ నేడు నిజమైందన్నారు. కుంటను పునరుద్ధరించడమే కాకుండా చిన్నారులు ఆడుకునేందుకు క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

తిరిగి ఆక్రమించేందుకు ప్రయత్నాలు

బతుకమ్మ కుంటను తిరిగి ఆక్రమించుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘కుట్రదారులు, ఆకాశం నుంచి పూలు జల్లినోళ్లు, హెలికాప్టర్‌లో తిరిగినోళ్లు, పదేళ్లు మున్సిపల్‌ శాఖ మంత్రికి కబ్జాల్లో తోడుగా ఉన్నోళ్లు.. ఇవాళ కేసులు వేసి బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు. ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కుంటను కబ్జా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. బతుకమ్మ కుంటను తాను జూబ్లీహిల్స్‌కు, కొడంగల్‌కు తీసుకెళ్లలేదన్నారు. కుంట పక్కన ఇళ్లు, లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్లు నిర్మించుకోలేదని స్పష్టం చేశారు. కుంటను పునరుద్ధరించి ప్రజలకే అప్పగించామని చెప్పారు. ‘‘వేలాది మంది ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకునేందుకు మీకు అందుబాటులోకి తీసుకొస్తే ఇవాళ నన్నే నిందిస్తున్నారు. నాపై ఆరోపణలు చేస్తున్నారు. హైడ్రా పెట్టి రేవంత్‌రెడ్డి కబ్జాలు చేస్తున్నాడని అంటున్నారు. బతుకమ్మ కుంటను ఖాళీ చేయించానా? కబ్జా చేసుకున్నానా? ఆలోచించాలి’’ అని సీఎం అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరో, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా కబ్జా చేస్తున్నది ఎవరో ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాలని కోరారు.

ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన

2023లో పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలలా తిరిగినప్పుడు ప్రజలు తనకు అండగా నిలిచారని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఈసారి ఇందిరమ్మ పాలన వస్తుంది.. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పినప్పుడు ప్రజలు ఆశీర్వదించారని, వారి మద్దతుతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని తెలిపారు. 2023 డిసెంబరు 7న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే సహా ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుల సమక్షంలో ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందని గుర్తుచేశారు. వేలాది మంది అభిమానుల మధ్య ప్రభుత్వం కొలువుదీరిందన్నారు. తమ ప్రజాపాలనకు నేటితో వెయ్యి రోజులు పూర్తయ్యాయని తెలిపారు. వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా సోనియాగాంధీకి ప్రజలు పెద్ద ఎత్తున చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు చేపడతామని, తన దిష్టిబొమ్మలు దహనం చేస్తామని కొంతమంది అల్లరిమూకలు బయలుదేరారని విమర్శించారు.

Advertisement
Advertisement