త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth | ఒకే ఒక్క‌డు తెలంగాణ‌ను రూ.8.11ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో ముంచిండు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్‌

CM Revanth | తెలంగాణను పదేళ్లపాటు పాలించిన కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. 2014లో తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ అప్పగించే నాటికి రాష్ట్రంపై కేవలం రూ.70 వేల కోట్ల అప్పు మాత్రమే ఉండేదని.. తొమ్మిదిన్నరేళ్లలో ఒకే కుటుంబం ఆ అప్పును రూ.8.11 లక్షల కోట్లకు చేర్చిందని ఆరోపించారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

P

Hyderabad | Published On Aug 31, 2026, 7.24 pm IST

CM Revanth | ఒకే ఒక్క‌డు తెలంగాణ‌ను రూ.8.11ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో ముంచిండు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్‌
Advertisement

CM Revanth | తెలంగాణను పదేళ్లపాటు పాలించిన కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. 2014లో తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ అప్పగించే నాటికి రాష్ట్రంపై కేవలం రూ.70 వేల కోట్ల అప్పు మాత్రమే ఉండేదని.. తొమ్మిదిన్నరేళ్లలో ఒకే కుటుంబం ఆ అప్పును రూ.8.11 లక్షల కోట్లకు చేర్చిందని ఆరోపించారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మూసారాంబాగ్‌–అంబర్‌పేట వంతెనను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. 2023 డిసెంబరు 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సచివాలయానికి వెళ్లి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడానని రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసిందని ఫైనాన్స్‌ సెక్రెటరీ చెప్పడంతో ఆశ్చర్యపోయానన్నారు. ‘‘ప్రభుత్వంలో పనిచేసే 11 లక్షల మందికి జీతాలు ఇవ్వలేదు. ఇంటి అద్దె, పాల బిల్లు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు చెల్లించలేకపోతున్నామని ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉండేది’’ అని పేర్కొన్నారు.

మిగులు రాష్ట్రాన్ని.. అప్పుల కుప్పగా మార్చారు

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను అప్పగించే నాటికి రాష్ట్రం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉందని సీఎం చెప్పారు. 2014 జూన్‌ 2న రాష్ట్రంపై సుమారు రూ.70 వేల కోట్ల అప్పు మాత్రమే ఉండేదన్నారు. దానికి అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.6,500 కోట్లు.. నెలకు సుమారు రూ.500 కోట్లు చెల్లిస్తే సరిపోయేదని తెలిపారు. ‘‘1948 నుంచి 2014 వరకు 16 మంది ముఖ్యమంత్రులు 60 ఏళ్లకుపైగా పాలించినా రాష్ట్ర అప్పు రూ.70 వేల కోట్లు మాత్రమే. కానీ ఒకే ఒక్క కుటుంబం.. ఒకే ఒక్క వ్యక్తి.. కుటుంబంలోని నలుగురు కలిసి తొమ్మిదిన్నరేళ్లు పాలించి తెలంగాణను రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నాడు నెలకు రూ.500 కోట్లుగా ఉన్న అప్పు భారం ఇప్పుడు నెలకు రూ.7,500 కోట్ల అసలు, వడ్డీ చెల్లించాల్సిన స్థాయికి చేరిందన్నారు. ఏడాదికి రూ.80 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్ల వరకు అప్పులపై చెల్లిస్తున్నామని తెలిపారు. ‘‘నేను తిన్నా తినకపోయినా.. పనిచేసినా చేయకపోయినా.. ఆరోగ్యం బాగాలేక ఇంట్లో పడుకున్నా అప్పులోడు ఊరుకోడు. చంద్రశేఖర్‌రావు చేసిన తప్పులకు, అప్పులకు నెలకు రూ.7,500 కోట్లు కడుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

పదేళ్లలో సాధించింది ఇదే..

పదేళ్ల పాలనలో కేసీఆర్ సాధించిన ఘనత ఏదైనా ఉందంటే రాష్ట్ర అప్పును రూ.70 వేల కోట్ల నుంచి రూ.8.11 లక్షల కోట్లకు పెంచడమేనని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని నెట్టేశారని విమర్శించారు. ‘‘యజమాని నెలకు సమయానికి జీతం ఇవ్వకపోతే పనిచేసేవాళ్లు మర్యాద ఇస్తారా?’’ అని ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల సమస్యలను తాను అర్థం చేసుకుంటానని, ఉద్యోగులు తనను మధ్యమధ్యలో బెదిరించినా వారిని కుటుంబ సభ్యులుగానే భావిస్తానని చెప్పారు.

33 నెలలుగా ఒకటో తేదీనే జీతాలు

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు. 2024 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబరు 1 వరకు 33 నెలల్లో ఒక్కసారైనా ఒకటో తేదీన జీతాలు ఆపామా? అని ఉద్యోగులను ప్రశ్నించారు. ‘‘తుఫాను వచ్చినా.. ఎండ కొట్టినా.. కరువు వచ్చినా.. ఎన్ని కష్టాలు వచ్చినా మీ జీతాలు మీ ఖాతాల్లో వేయలేదా?’’ అని అన్నారు. గతంలో ఉద్యోగ సంఘాల నేతలు తన వద్దకు వచ్చి బ్యాంకుల్లో అప్పులు, పిల్లల చదువుల కోసం రుణాలు తెచ్చుకున్నామని.. చెక్కులు ఫెయిల్‌ కావడంతో సిబిల్‌ స్కోర్‌ పడిపోయిందని, ఏ బ్యాంకు తమను నమ్మడం లేదని చెప్పేవారని గుర్తుచేశారు. అప్పట్లో వచ్చే నెల నుంచి ఆ సమస్య ఉండదని హామీ ఇచ్చానని, ఆ మేరకు జీతాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని తెలిపారు. ‘‘ఆనాడు ఎలా ఉండే.. ఈనాడు ఎట్లుంది? ఒక్కసారి ఆలోచన చేయాలి’’ అని ఉద్యోగులకు సూచించారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ సకాలంలో జీతాలు

ఐదున్నర లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోగా వారికి జీతాలు చెల్లించేలా బిల్లులు పెట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అధికారులు మాట వినకపోతే బిల్లులు పెట్టొద్దని, జీతాలు ఆపొద్దని స్పష్టం చేశామన్నారు. గతంలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరు నెలలకోసారి జీతాలు అందే పరిస్థితి ఉండేదని విమర్శించారు. ‘‘మీ బంధువులు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో ఉంటే ఆ బాధ ఏందో మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఐదో తేదీలోగా ఠంచన్‌గా వారి ఖాతాల్లో జీతాలు వేయాలని చెప్పాం’’ అని సీఎం పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement