త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cybercrime Refund Hyderabad | ఆన్‌లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల ‘రీఫండ్’

ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్న వారికి సైబరాబాద్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఏకంగా రూ.21.90 కోట్లు రికవరీ చేశారు.

J

Hyderabad | Published On Jun 22, 2026, 8.12 pm IST

Cybercrime Refund Hyderabad | ఆన్‌లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల ‘రీఫండ్’
Advertisement
  • జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ క్రైమ్ బాధితులకు రూ.21.90 కోట్ల నగదు తిరిగి ఇప్పించిన సైబరాబాద్ పోలీసులు
  • కమిషనరేట్ పరిధిలోని 24 పోలీస్ స్టేషన్లలో నమోదైన మొత్తం 2,232 కేసుల్లో రీఫండ్ (Refund) ఆదేశాలు జారీ చేసిన కోర్టులు
  • అకౌంట్లు ఫ్రీజ్ చేసి, బ్యాంకులతో సమన్వయం చేసుకుని సత్వర న్యాయం అందించిన దర్యాప్తు అధికారులు
  • పోలీసుల దర్యాప్తు తీరును, సమన్వయాన్ని అభినందించిన టీజీసీఎస్‌బీ (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్

Cybercrime Refund Hyderabad | సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కష్టార్జితాన్ని పోగొట్టుకున్న బాధితులకు సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) భారీ ఊరటనిచ్చారు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్ (National Lok Adalat) వేదికగా.. మోసపోయిన బాధితులకు సత్వర న్యాయం అందించారు. ఏకంగా రూ.21.90 కోట్ల భారీ మొత్తాన్ని రికవరీ చేసి, బాధితులకు తిరిగి ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు.

2,232 కేసుల్లో రీఫండ్ ఆదేశాలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 24 పోలీస్ స్టేషన్లలో నమోదైన మొత్తం 2,232 సైబర్ క్రైమ్ (Cyber crime) కేసులను పోలీసులు లోక్ అదాలత్ ముందుకు తీసుకెళ్లారు. పక్కా ఆధారాలతో న్యాయస్థానాల నుంచి బాధితులకు అనుకూలంగా రీఫండ్ ఆదేశాలు తీసుకురావడంలో విజయం సాధించారు.

పోలీస్ స్టేషన్ల వారీగా రీఫండ్ (Refund) వివరాలు ఇలా ఉన్నాయి

సైబర్ క్రైమ్ పీఎస్: రూ. 20.54 కోట్లు

అమీన్‌పూర్ పీఎస్: రూ. 45.94 లక్షలు

కూకట్‌పల్లి పీఎస్: రూ. 12.55 లక్షలు

ఇతర పోలీస్ స్టేషన్లు: రూ. 78.43 లక్షలు

కోర్టుల నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో.. లీగల్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే సంబంధిత బ్యాంకులు ఈ డబ్బును నేరుగా బాధితుల అకౌంట్లలో జమ చేయనున్నాయి.

ఈ రికవరీ ఎలా సాధ్యమైంది?

కోట్ల రూపాయల రికవరీ వెనుక సైబరాబాద్ పోలీసుల సమగ్ర ఆర్థిక దర్యాప్తు (Financial investigation) దాగి ఉంది. దర్యాప్తు అధికారులు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. సైబర్ క్రిమినల్స్ ఖాతాలను ట్రాక్ చేశారు. లావాదేవీల రికార్డులు (Transactions), కేవైసీ (KYC) సమాచారాన్ని సేకరించి, ఆయా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఆ సేకరించిన ఆధారాలతోనే కోర్టుల్లో రీఫండ్ పిటిషన్లు దాఖలు చేసి ఈ విజయం సాధించారు.

ఈ అద్భుతమైన పనితీరును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ ప్రత్యేకంగా అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో పనిచేసిన సిబ్బంది కృషి ప్రశంసనీయమని ఆమె కొనియాడారు.

సైబర్ మోసాలపై పోలీసుల అలర్ట్..

  • ఆన్‌లైన్ ఫ్రాడ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పలు సూచనలు చేశారు.
  • ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, పార్ట్ టైమ్ జాబ్ టాస్క్‌లు, డిజిటల్ అరెస్ట్ (Digital Arrest) బెదిరింపులు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
  • బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు (OTPs), సీవీవీ (CVV) నంబర్లు, యూపీఐ పిన్స్ (UPI PINs) ఎవరికీ షేర్ చేయొద్దు.
  • ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్ చేసే ముందు ఆ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ జెన్యూన్ అవునా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి.
  • ఒకవేళ సైబర్ మోసానికి గురైతే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి.

స్కామర్లతో మాట్లాడిన కాల్ రికార్డ్స్, చాట్ హిస్టరీ, వాట్సాప్ నంబర్లు, స్క్రీన్ షాట్స్ డిలీట్ చేయకుండా పోలీసులకు అందించాలి. కోర్టుల నుంచి లోక్ అదాలత్ (Lok Adalat) నోటీసులు వస్తే తప్పనిసరిగా హాజరై మీ డబ్బును క్లెయిమ్ చేసుకోవాలి.

Advertisement
Advertisement