త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

BC Reservations | దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో కులగణనను తప్పనిసరి చేయడంతో పాటు ప్రతి కులానికి ప్రత్యేకంగా ‘యూనిక్ కోడ్’ కేటాయించాలని పలువురు మేధావులు, రాజకీయ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Aug 30, 2026, 10.20 pm IST

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
Advertisement

లేదంటే జనగణనను నిలిపివేయండి
శాస్త్రీయత లేకుంటే రూ.12,800 కోట్ల ప్రజాధనం వృథా
డిమాండ్లు పట్టించుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమం
ఓబీసీ జాతీయ సదస్సులో వక్తల డిమాండ్‌

BC Reservations | త్రినేత్ర‌.న్యూస్ : దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో కులగణనను తప్పనిసరి చేయడంతో పాటు ప్రతి కులానికి ప్రత్యేకంగా ‘యూనిక్ కోడ్’ కేటాయించాలని పలువురు మేధావులు, రాజకీయ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్త ఏకాభిప్రాయం కుదిరేవరకు జనగణన ప్రక్రియను నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఆదివారం, తెలంగాణ భవన్‌లో ‘జనగణనలో కులగణన – ప్రతి కులానికి యూనిక్ కోడ్’ అనే ప్రధాన డిమాండ్‌తో ఓబీసీ జాతీయ సదస్సు జరిగింది.

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ టి. చిరంజీవులు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి. కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాజ్యసభ ఎంపీ విల్సన్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ అనిల్ జైహింద్, స్వరాజ్ ఇండియా నేత ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ రతన్ లాల్, ప్రొఫెసర్ సూరజ్ మండల్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాలరాజ్ గౌడ్, ఎస్ దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వకుండా కులగణన నిర్వహించడం శాస్త్రీయ పద్ధతి కాదని వక్తలు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల తరహాలోనే ఓబీసీలతో పాటు జనరల్ వర్గాలకు కూడా విడివిడిగా ప్రత్యేక కాలమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. డ్రాప్‌డౌన్ మెనూ ద్వారా ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించిన తర్వాతే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

రూ.12,800 కోట్ల ప్రజాధనం వృథా!

శాస్త్రీయమైన ప్రణాళిక లేకుండా మొక్కుబడిగా జనగణన చేపడితే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సుమారు రూ.12,800 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని డాక్టర్ సూరజ్ మండల్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఎంపీ విల్సన్ హెచ్చరించారు. ప్రతి కులాన్ని ఖచ్చితంగా నమోదు చేసేలా పారదర్శక, శాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా ముందుకెళ్తే దేశవ్యాప్తంగా విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement