త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharathi Mukhi Accident Case | యువతి భార‌తి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్ల‌క్ష్య డ్రైవింగే కార‌ణ‌మ‌ని నిర్ధార‌ణ‌

Bharathi Mukhi Accident Case | ఇటీవ‌ల హైద‌రాబాద్ ఇనార్బిట్ మాల్ వ‌ద్ద జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన నిందితుడిని పోలీసులు గుర్తించారు. హైటెక్‌సిటీకి చెందిన లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ కారును వేగంగా, నిర్ల‌క్ష్యంగా న‌డ‌ప‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు.

S

Hyderabad | Published On Aug 21, 2026, 3.20 pm IST

Bharathi Mukhi Accident Case | యువతి భార‌తి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్ల‌క్ష్య డ్రైవింగే కార‌ణ‌మ‌ని నిర్ధార‌ణ‌
Advertisement
  • వాహ‌నం స్వాధీనం, ఆధారాల సేక‌ర‌ణ‌పై కొన‌సాగుతున్న ద‌ర్యాప్తు

Bharathi Mukhi Accident Case | త్రినేత్ర‌.న్యూస్: ఇటీవ‌ల హైద‌రాబాద్ ఇనార్బిట్ మాల్ వ‌ద్ద జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన నిందితుడిని పోలీసులు గుర్తించారు. హైటెక్‌సిటీకి చెందిన లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ కారును వేగంగా, నిర్ల‌క్ష్యంగా న‌డ‌ప‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 16న భార‌తి ముఖి అనే యువ‌తిని ఢీకొట్ట‌గా ఆమె అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. కాగా అదే రోజు నిందితుడిని అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షతో పాటు డ్రగ్ పరీక్ష నిర్వహించిన‌ట్లు మాదాపూర్ పోలీసులు శుక్ర‌వారం వెల్ల‌డించారు.

మాదాపూర్ పోలీస్‌స్టేష‌న్ ఎస్‌హెచ్‌వో కేవీ సుబ్బారావు వివ‌రాల ప్ర‌కారం.. ఒడిశాకు చెందిన భారతి ముఖి (26) అనే యువతి ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. ఈనెల‌ 16న మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో తన సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసీ కోహినూర్ సమీపంలో భోజనం తీసుకురావడానికి వెళ్లింది. అనంతరం ఇనార్బిట్ మాల్ వైపు తిరిగి వస్తుండగా, మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న సమయంలో లింగమనేని సంజుష్ (TG-09-G-0666) కారు వేగంగా, నిర్లక్ష్యంగా న‌డుపుతూ భారతి ముఖిని ఢీకొట్టాడు.

ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర రక్తస్రావ గాయం కావడంతో వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం PME (Post-Mortem Examination) నివేదికతో పాటు ఇతర ఆధారాల సేకరణపై దర్యాప్తు కొనసాగుతున్న‌ట్లు వివ‌రించారు.

Advertisement
Advertisement