త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

వంటగది నుంచి గెరిల్లా దళం దాకా.. ఎవరూ చెప్పని తెలంగాణ ఆడబిడ్డల సాయుధ పోరాట రహస్యాలు!

సెప్టెంబర్ 17 అనగానే కేవలం రాజకీయ మార్పులు, సైనిక చర్యలే గుర్తుకొస్తాయి.. కానీ అదే చరిత్ర వెనుక, తుపాకులు పట్టి, గాయపడిన యోధులకు వైద్యం చేసి, అడవుల్లో బిడ్డలను కన్న తెలంగాణ ఇల్లాలి సాహస గాథలు ఎన్నో మరుగునపడిపోయాయి.

S

Telangana | Published On Sep 17, 2026, 5.08 pm IST

వంటగది నుంచి గెరిల్లా దళం దాకా.. ఎవరూ చెప్పని తెలంగాణ ఆడబిడ్డల సాయుధ పోరాట రహస్యాలు!

సంక్షిప్త సారాంశం

రాజులు, సైన్యాల చరిత్రే కాదు.. పేడపిడకల మధ్య దాక్కున్న సాలమ్మ, అడవిలో బిడ్డను కన్న కమలమ్మ, తుపాకీ పట్టిన స్వరాజ్యం వంటి అజ్ఞాత మహిళా యోధుల వీరగాథలను కళ్లకు కట్టే కథనం ఇది.

Advertisement

సెప్టెంబర్ 17 చరిత్రలో ఆమె కూడా ఉంది!

మిరపపొడి నుంచి తుపాకీ వరకు.. తెలంగాణ మహిళల మరుగునపడిన పోరాట గాథ

 

సెప్టెంబర్ 17 అనగానే నిజాం పాలన, రజాకార్లు, ఆపరేషన్ పోలో, హైదరాబాద్ విలీనం గుర్తుకొస్తాయి. కానీ అదే కాలపు తెలంగాణ చరిత్రలో మరో పేజీ ఉంది. అందులో రాజులు, సైన్యాధిపతుల కంటే.. పొలాల్లో పనిచేసిన మహిళలు, ఇల్లు నడిపిన ఇల్లాళ్లు, అడవుల్లో తిరిగిన మహిళా గెరిల్లాలు కనిపిస్తారు. కొందరు తుపాకులు పట్టారు. కొందరు రహస్య సందేశాలు మోశారు. మరికొందరు గాయపడిన యోధులకు వైద్యం చేశారు. ఇంకొందరు పాటలతో పల్లెలను కదిలించారు. 1946–51 మధ్య సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మనకు తెలిసిన కొన్ని పేర్లకంటే ఎంతో పెద్దది. తెలంగాణ ఉద్యమంలో ఆమె చరిత్రను తెలిపే కథనం ఇది.

మిరపపొడి నుంచి తుపాకీ వరకు!

పోలీసులు, రజాకార్లు గ్రామాలపై దాడులు చేసినప్పుడు మహిళలందరి చేతుల్లో ఆయుధాలు ఉండేవి కావు. అందుబాటులో ఉన్న మిరపపొడి, రోకళ్లు, వడిసెలు, వ్యవసాయ పనిముట్లే కొన్ని సందర్భాల్లో వారి ఆయుధాలయ్యాయి. కానీ మహిళల పాత్ర అక్కడితో ఆగలేదు. కొందరు కొరియర్లుగా రహస్య సమాచారాన్ని చేరవేశారు. మరికొందరు సాయుధ దళాల్లో చేరారు. “మహిళలు గెరిల్లా దళాల్లోనూ చేరారు; వారి సంఖ్య పరిమితమే అయినప్పటికీ కొందరు ఆయుధాలు పట్టి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నారు.” ఇంకొందరు ప్రథమ చికిత్స నేర్చుకుని అడవుల్లో దళాలకు వైద్య సహాయం అందించారు. అంటే వంటగది నుంచి గెరిల్లా దళం వరకు.. పాట నుంచి తుపాకీ వరకు వారి పాత్ర విస్తరించింది.

పేడపిడకల మధ్య దాక్కున్న సాలమ్మ!

ఆ పోరాటం ఎంత ప్రమాదకరంగా సాగిందో దుదాల సాలమ్మ జీవితం చెబుతుంది. పోలీసులు చుట్టుముట్టడంతో కట్టుబట్టలతోనే తప్పించుకున్న ఆమె ఓ ఇంట్లో ఆశ్రయం పొందారు. తనను వెతుకుతూ రజాకార్లు అక్కడికీ రావడంతో పేడపిడకలు నిల్వచేసే ప్రదేశంలో దాక్కున్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత బయటకు వచ్చి తిరిగి గెరిల్లా దళంతో వెళ్లిపోయారు. ఇది జానపద కథ కాదు. దశాబ్దాల తర్వాత సేకరించిన సాలమ్మ మౌఖిక చరిత్రలో నమోదైన అనుభవం.

భుజాన గాయపడిన యోధుడు.. అడవిలో మైళ్ల ప్రయాణం!

అంతగా బయటకు రాని మరో అసాధారణ కథ రేగళ్ల అచ్చమాంబది. అడవుల్లో దళాలకు వైద్య సహాయం అందించిన ఆమెను ‘బేర్‌ఫుట్ డాక్టర్’గా కూడా చారిత్రక రచనలు పేర్కొన్నాయి. ఒక సందర్భంలో కాల్పుల్లో గాయపడిన సహచరుడిని భుజాన వేసుకుని అడవిలో మైళ్ల దూరం మోసుకెళ్లారు. చివరకు అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని తెలుసుకున్నట్లు ఆమె జ్ఞాపకాల్లో నమోదైంది. తుపాకీ పట్టడమే ధైర్యానికి కొలమానం కాదని చెప్పే ఘటన ఇది.

అడవిలో బిడ్డ.. రెండురోజుల నడక!

మానుకోట ప్రాంతానికి చెందిన కమలమ్మది మరో కదిలించే జీవితం. సాంస్కృతిక దళంలో పాటలు పాడిన ఆమె తర్వాత అడవుల్లో పనిచేస్తూ ప్రథమ చికిత్స, ఇంజెక్షన్లు ఇవ్వడం నేర్చుకున్నారు. పోరాటంలో ఉండగానే అడవిలో ఆమెకు బిడ్డ పుట్టాడు. శిశువు ఏడుపుతో దళం ఉనికి బయటపడే ప్రమాదం ఉండడంతో బిడ్డను సురక్షితంగా మరోచోట ఉంచేందుకు రెండు రోజులు నడిచి వెళ్లాల్సి వచ్చిందని ఆమె జీవిత కథలో నమోదైంది.

ఒక్కొక్కరిదీ.. ఒక్కో వీరగాథ!

చాకలి ఐలమ్మ: తన పంటను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన విసునూరు దేశ్‌ముఖ్‌ శక్తులను ఎదురొడ్డి రైతాంగ ప్రతిఘటనకు ప్రతీకగా నిలిచారు.

మల్లు స్వరాజ్యం: చిన్న వయసులోనే ఉద్యమంలోకి వచ్చి సాయుధ దళాల్లో పనిచేశారు. గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేస్తూ తెలంగాణ పోరాటంలో ప్రముఖ మహిళా యోధురాలిగా నిలిచారు.

ఆరుట్ల కమలాదేవి: మహిళలను సంఘటితం చేయడంతో పాటు ఉద్యమంలో ప్రత్యక్షంగా పనిచేశారు. నిర్బంధం, జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు.

దుదాల సాలమ్మ: అజ్ఞాత జీవితం, పోలీసుల నిర్బంధం, చిత్రహింసలను ఎదుర్కొన్నా ఉద్యమాన్ని వీడలేదు.

రేగళ్ల అచ్చమాంబ: అడవుల్లో వైద్య సహాయకురాలిగా పనిచేస్తూ గాయపడిన వారికి చికిత్స అందించారు.

జమాలున్నీసా బాజీ–రజియా బేగం: హైదరాబాద్‌లోని ముస్లిం మహిళల రాజకీయ చైతన్యం, ఉద్యమ భాగస్వామ్యాన్ని గుర్తుచేసే పేర్లుగా వారి జీవితాలు నమోదయ్యాయి.

వీరిలో ఒకరి చేతిలో తుపాకీ ఉంటే.. మరొకరి చేతిలో మందుల సంచి. ఒకరు దళాన్ని నడిపితే.. ఇంకొకరు ఆ దళం బతికేందుకు అవసరమైన సహాయక వ్యవస్థలో భాగమయ్యారు.

సెప్టెంబర్ 17తో వారి కథ ముగియలేదు!

ఈ మహిళల పోరాటాన్ని 1948 సెప్టెంబర్ 17తో ముగిసిన కథగా చూడలేం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు సాగింది. మొదట నిజాం పాలన, రజాకార్లు, భూస్వామ్య వ్యవస్థను ఎదుర్కొన్న పోరాటం.. హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లోనూ కొనసాగింది. అందుకే సెప్టెంబర్ 17 వారి పోరాటానికి ముగింపు తేదీ కాదు. ఆ కాలంలో తెలంగాణ మహిళ చూపిన అసాధారణ ధైర్యాన్ని గుర్తుచేసుకునే చారిత్రక సందర్భం.

50 మందిని వెతికితే.. బయటపడిన ‘మన చరిత్ర’!

ఈ మహిళల కథలు ఎంతగా మరుగునపడ్డాయో చెప్పే మరో విశేషం ఉంది. 1980ల ప్రారంభంలో హైదరాబాద్‌కు చెందిన స్త్రీ శక్తి సంఘటన సభ్యులు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న మహిళలను వెతికి 50 మందికిపైగా ఇంటర్వ్యూ చేశారు. వారిలో 16 మంది జీవిత కథలు 1986లో మనకు తెలియని మన చరిత్రగా వెలువడ్డాయి. అందుకే తెలంగాణ పోరాట చరిత్ర అంటే రాజులు, సైన్యాలు, నాయకుల కథ మాత్రమే కాదు. పేడపిడకల మధ్య దాక్కున్న సాలమ్మ.. గాయపడిన సహచరుడిని భుజాన మోసిన అచ్చమాంబ.. అడవిలో బిడ్డకు జన్మనిచ్చిన కమలమ్మ.. తుపాకీ పట్టిన స్వరాజ్యం.. భూమి కోసం ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ వీరంతా అదే చరిత్రలో భాగం. వారి పేర్లన్నీ పాఠ్యపుస్తకాల్లో కనిపించకపోవచ్చు.. కానీ వారు లేకుండా తెలంగాణ పోరాట చరిత్ర మాత్రం పూర్తికాదు.

Advertisement
Advertisement