త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chandrayangutta Murder Case | చంద్రాయణగుట్టలో నెత్తురోడిన పాత కక్షలు: ప్లంబర్ దారుణ హత్య కేసులో నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట పరిధిలో పాత కక్షల నేపథ్యంలో మహమ్మద్ సల్మాన్ (23) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రంజాన్ దావత్‌కు వెళ్లి వస్తుండగా నకిల్ డస్టర్, రాళ్లతో దాడి చేసి హతమార్చిన నలుగురు నిందితులను పోలీసులు ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ వద్ద నాటకీయంగా అరెస్ట్ చేశారు.

J

Hyderabad | Published On Mar 28, 2026, 10.00 pm IST

Chandrayangutta Murder Case | చంద్రాయణగుట్టలో నెత్తురోడిన పాత కక్షలు: ప్లంబర్ దారుణ హత్య కేసులో నలుగురు అరెస్ట్
Advertisement

Chandrayangutta Murder Case | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్.శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

రంజాన్ దావత్‌కు వెళ్లి వస్తుండగా..

చంద్రాయణగుట్ట కందికల్ గేట్, అహ్మద్ కాలనీకి చెందిన మహమ్మద్ సల్మాన్ (23) వృత్తిరీత్యా ప్లంబర్. ఈ నెల 22వ తేదీ రాత్రి తన స్నేహితుడు ఇర్ఫాన్‌తో కలిసి సుల్తాన్ షాహీలో బంధువుల ఇంట్లో రంజాన్ దావత్‌కు వెళ్లాడు. తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అబ్దుల్లా, అమన్, మతీన్, సర్వర్ అనే నలుగురు యువకులు వారిని అడ్డగించారు.

నకిల్ డస్టర్, రాళ్లతో పాశవిక దాడి

గతంలో ఉన్న పాత కక్షలను మనసులో పెట్టుకున్న ప్రధాన నిందితుడు అబ్దుల్లా.. కావాలనే సల్మాన్‌తో గొడవకు దిగాడు. క్షణాల్లోనే ఆ గొడవ పెద్దది కావడంతో తన వద్ద ఉన్న 'నకిల్ డస్టర్'తో సల్మాన్ ముఖంపై బలంగా కొట్టాడు. వెంటనే అమన్ అనే మరో నిందితుడు పెద్ద రాయి తీసుకుని సల్మాన్ తల, కాళ్లు, భుజంపై విచక్షణా రహితంగా బాదాడు. మిగిలిన ఇద్దరు నిందితులు కూడా సల్మాన్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సల్మాన్ ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో పోరాడి ఓడిన ప్రాణం

ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ నెల 27వ తేదీ (27.03.2026) తెల్లవారుజామున 1:21 గంటలకు సల్మాన్ మృతి చెందాడు. దీంతో అప్పటివరకు నమోదు చేసిన దాడి కేసును పోలీసులు.. హత్య కేసుగా (Section 103(1) BNS) మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు.

గుల్బర్గా పారిపోతుండగా పోలీసుల వలలో..

సల్మాన్ మృతి చెందిన విషయం తెలుసుకున్న నిందితులు.. పోలీసుల కళ్లుగప్పి కర్ణాటకలోని గుల్బర్గాకు పారిపోయేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ వద్ద కాపు కాశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, 27వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో రైల్వే స్టేషన్‌లో ఆ నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితుల వివరాలు: సయ్యద్ అబ్దుల్లా (20): పాన్ షాపు నిర్వాహకుడు, పూల్ బాగ్, సయ్యద్ అమన్ (20): ఫ్యాబ్రికేషన్ వర్కర్, పూల్ బాగ్, షేక్ మతీన్ (25): ఎలక్ట్రీషియన్, కందికల్ గేట్, మొహమ్మద్ సర్వర్ (20): మెకానిక్, కందికల్ గేట్.

పోలీసుల ప్రతిభకు ప్రశంసలు

చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ. సుధాకర్ పర్యవేక్షణలో.. ఎస్‌హెచ్‌ఓ ఆర్. గోపి, ఎస్ఐలు ఎస్. చంద్రారెడ్డి, శ్రీనివాసరావుల బృందం అత్యంత వేగంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంది. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి తగిన రివార్డులు అందజేస్తామని డీసీపీ ఎస్. శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement