త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | షాబాద్ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. పోలీసుల నిర్ల‌క్ష్యానికి సజీవ సాక్ష్యం

Harish Rao | రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జ‌రిగిన ఆరు హ‌త్య‌లు ముమ్మాటికీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు ఆరోపించారు. హోంమంత్రిగా, ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫ‌ల‌మయ్యార‌ని విమ‌ర్శించారు. పోక్సో కేసు నిందితుడిని కాపాడిన పోలీసుల నిర్లక్ష్యమే ముగ్గురు పసి పిల్లలతో సహా ఆరుగురి ప్రాణాలు బలితీసుకుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Flash news | Published On Jul 11, 2026, 7.14 pm IST

Harish Rao | షాబాద్ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. పోలీసుల నిర్ల‌క్ష్యానికి సజీవ సాక్ష్యం
Advertisement
  • హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం
  • తక్షణమే రాజీనామా చేయాలి
  • సిద్దిపేట క్యాంపు కార్యాల‌యంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జ‌రిగిన ఆరు హ‌త్య‌లు ముమ్మాటికీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు ఆరోపించారు. హోంమంత్రిగా, ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫ‌ల‌మయ్యార‌ని విమ‌ర్శించారు. పోక్సో కేసు నిందితుడిని కాపాడిన పోలీసుల నిర్లక్ష్యమే ముగ్గురు పసి పిల్లలతో సహా ఆరుగురి ప్రాణాలు బలితీసుకుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒంటరైన వికలాంగ బాలిక పేరిట కోటి రూపాయలు డిపాజిట్ చేసి, ప్రభుత్వమే ఆ చిన్నారి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది, పోలీస్ స్టేషన్లు కేవలం ల్యాండ్ సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మారాయి. రాష్ట్రంలో ఈరోజు జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని కిరాతకంగా చంపేయడం రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల వైఫల్యానికి సజీవ సాక్ష్యం అని హ‌రిశ్ రావు నొక్కి చెప్పారు.

గత నెల మే 16న బాలికపై అత్యాచారం జరిగితే.. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారు. నిందితుడికి కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సాధారణ సెక్షన్లు పెట్టి కాపాడే ప్రయత్నం చేశారు. నెలరోజుల పాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో.. అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఈరోజు ఆ కుటుంబాన్నే అంతం చేశాడు. మాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని ఆ బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. సరైన సమయంలో ఏసీపీ, డీసీపీ, కమిషనర్ స్థాయిలో సమీక్ష చేసి, కఠిన సెక్షన్లు పెట్టి ఉంటే ఈరోజు ఈ హత్యలు జరిగేవి కావు అని ఆయ‌న మండిప‌డ్డారు.

గుండె తరుక్కుపోతోంది..

కళ్లు తెరువని ముగ్గురు పసిపిల్లలతో పాటు అత్యాచారానికి గురైన బాలికను, ఆమె చెల్లెల్ని, తల్లిని, నాయనమ్మను చంపేశాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో కేవలం ఒకే ఒక అమ్మాయి మిగిలింది. ఆ అమ్మాయికి మాటలు రావు, చెవులు వినబడవు, నడవలేని వికలాంగురాలు. పూర్తిగా కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి బతికే ఆ చిన్నారి బాగోగులు చూసేందుకు ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరూ లేరు. ఆ అమ్మాయి భవిష్యత్తు తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఇంత ఘోరం జరిగినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు అని హ‌రీశ్ రావు ఆవేద‌న చెందారు.

కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకోవడానికి నెలల తరబడి సమయం తీసుకున్న పోలీసులు.. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడానికి మాత్రం నిమిషాల్లో స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ పక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని స్పెషల్ టీమ్‌లు పెట్టి మరీ ఇంటి దగ్గరే అరెస్ట్ చేయించారు. ఓదార్పు కోసం వెళ్తున్న నాయకులను నేరస్తుల్లా చూస్తున్న ఈ ప్రభుత్వం.. నేరస్తులను మాత్రం వదిలేస్తోంది అని మాజీ మంత్రి ఆరోపించారు.

ల్యాండ్ సెటిల్‌మెంట్ల‌కు అడ్డాలుగా మార్చేశారు..

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టించింది. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మార్చేశారు. మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారుడు శశిధర్ రెడ్డి ఏమో మాది ఖాకీ బుక్ అంటారు. ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్ ఏమో మావోయిస్టులు మంచోళ్లు అంటారు. ఈ మాటలు చెబుతున్న అధికారులు నేరాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు? నైతిక విలువలు ఉంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి తక్షణమే తన ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులకు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.

పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. పరామర్శకు వెళ్తూ అరెస్టయిన బీఆర్ఎస్ మహిళా నాయకులను వెంటనే విడుదల చేయాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement