త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S Janaki | దిగ్గ‌జ గాయ‌ని ఎస్ జాన‌కి క‌న్నుమూత – అర‌వై ఏళ్ల సినీ ప్ర‌యాణం – యాభై వేల పాట‌లు

దిగ్గ‌జ సినీ గాయ‌ని ఎస్ జాన‌కి వృద్ధాప్య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో శ‌నివారం క‌న్నుమూసింది. ఆరు ప‌దుల సినీ ప్ర‌యాణంలో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో క‌లిపి యాభై వేల‌కుపైగా పాట‌లు పాడింది. జాన‌కి మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది.

N

Entertainment | Published On Jul 11, 2026, 8.57 pm IST

S Janaki  | దిగ్గ‌జ గాయ‌ని ఎస్ జాన‌కి క‌న్నుమూత – అర‌వై ఏళ్ల సినీ ప్ర‌యాణం – యాభై వేల పాట‌లు
Advertisement

S Janaki |  ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. దిగ్గ‌జ గాయ‌ని ఎస్ జాన‌కి క‌న్నుమూసింది. వృద్ధాప్య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో గ‌త కొద్ది రోజులుగా మైసూరులోని ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న జాన‌కి శ‌నివారం తుది శ్వాస విడిచారు. ఈ మేర‌కు వైద్యులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె మ‌ర‌ణ వార్త‌ను ప్ర‌క‌టించారు.  తన సుమ‌ధుర గాత్రంతో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. జాన‌కి మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

తెలంగాణ‌తో సంబంధం...

ఎస్. జానకి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. పుట్టింది ఏపీలో అయినా పెరిగింది మొత్తం తెలంగాణ‌లోనే.  ఉద్యోగం కోసం తండ్రి సిరిసిల్ల‌కు రావ‌డంతో జాన‌కి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం ఇక్క‌డే సాగింది. చిన్నప్పటి నుంచే సంగీతం ప‌ట్ల జాన‌కిలో ఆస‌క్తి మొదలైంది. నాదస్వర విద్వాంసుడైన పైడిస్వామి వద్ద ఆమె సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు.  సినిమాల కోసం ఇరవై ఏళ్ల వయసులో మద్రాస్ పయనమయ్యారు.

తమిళ సినిమాతో గాయనిగా ఎంట్రీ...

1957లో వ‌చ్చిన త‌మిళ చిత్ర విధియ‌న్ విలాయ‌త్తుతో గాయ‌నిగా జాన‌కి సినీ ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. కేవ‌లం సినిమా పాట‌లే కాకుండా భ‌క్తి గీతాల‌తో సంగీత ప్రియుల‌ను మెప్పించింది. ఐదు త‌రాల హీరోయిన్ల‌కు త‌న గాత్రాన్ని అందించింది.

నాలుగు జాతీయ అవార్డులు...

సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో జాన‌కి అందుకోని అవార్డు లేదు. ఉత్త‌మ గాయ‌నిగా నాలుగు సార్లు జాతీయ పుర‌స్కారాన్ని దక్కించుకున్నారు. వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి 33 సార్లు బెస్ట్ సింగ‌ర్‌గా అవార్డులు సొంతం చేసుకున్నారు. అందులో ప‌ది నంది అవార్డులు ఉన్నాయి. సితార సినిమాలోని వెన్నెల్లో గోదారి అందం పాట‌కు గాను జాన‌కిని నేష‌న‌ల్ అవార్డ్ వ‌రించింది. రెండు సార్లు త‌మిళం, ఓ సారి మ‌ల‌యాళ సినిమాకు జాతియ అవార్డును కైవ‌సం చేసుకుంది.

పేరు తెచ్చిన పాట‌లు

ఆరు ప‌దుల సినీ ప్ర‌యాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాష‌ల్లో క‌లిపి యాభై వేల‌కుపైగా పాట‌లు పాడారు జాన‌కి.  తెలుగులో 1957లో ఎమ్మెల్యే సినిమాలోని నీ ఆశ అడియాస పాట జాన‌కికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి సింగర్ గా వెనుతిరిగి చూడలేదు.  ఆ త‌ర్వాత సిరిమల్లె పువ్వా (పదహారేళ్ల వయసు) , శివ పూజకు చిగురించిన సిరిసిరిమువ్వా (స్వర్ణ కమలం) , ఈ తీగ పువ్వునో (మరో చరిత్ర) , గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన (సప్తపది) , వెన్నెల్లో గోదావరి అందం: (సితార) , వేణువై వచ్చాను భువనానికీ (మాతృదేవోభవ) పాట‌లు జాన‌కికి ఎన‌లేని పేరును తెచ్చిపెట్టాయి.

 

Advertisement
Advertisement