త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaleshwaram Project | అప్పుడే వార్నింగ్ ఇచ్చినా.. కేసీఆర్ పట్టించుకోలేదు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి నిల్వకు పనికిరావని ఎన్డీఎస్ఏ తేల్చిచెప్పిందని సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On Jul 11, 2026, 7.32 pm IST

Kaleshwaram Project | అప్పుడే వార్నింగ్ ఇచ్చినా.. కేసీఆర్ పట్టించుకోలేదు

సంక్షిప్త సారాంశం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, ఇవి నీటి నిల్వకు ఏమాత్రం సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ (NDSA) తుది నివేదిక స్పష్టం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు బ్యారేజీల గేట్లు మూసి నీటిని పంపింగ్ చేయడం అసాధ్యమని ఆయన టెక్నికల్ వివరాలతో సహా వివరించారు. ఇంజనీర్ల ముసుగులో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి (CBI) కేసు అప్పగించినా విచారణ ఎందుకు వేగంగా సాగడం లేదో ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
  • కాళేశ్వరం బ్యారేజీల్లో భారీ లోపాలు
  • గేట్లు మూస్తే ప్రాజెక్టుకే డేంజర్
  • ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ ఫైర్

Kaleshwaram Project | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్రమైన డిజైన్, ప్లానింగ్ లోపాలు ఉన్నాయని.. ఇవి నీటి నిల్వకు ఏమాత్రం పనికిరావని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) తన ఫైనల్ రిపోర్టులో కుండబద్దలు కొట్టిందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్‌లో మంత్రులతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్, ప్రతిపక్షాల విమర్శలపై సీఎం ఘాటుగా స్పందించారు.

వాళ్ల నిర్లక్ష్యం వల్లే

2019 జూన్‌లో అప్పటి సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, కేవలం 11 నెలల్లోనే (మే 2020లో) మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని ఏఈ రమణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. లోపాలను తక్షణమే సరిదిద్దాలని కోరినా.. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఇరిగేషన్ మంత్రి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రేవంత్ ఆరోపించారు. ఆ నిర్లక్ష్యం వల్లే అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని గుర్తుచేశారు.

CM Revanth Reddy Slams BRS BJP Over Kaleshwaram Barrage Defects

గేట్లు మూస్తే డ్యామేజ్ గ్యారెంటీ.. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇదే

ఎన్డీఎస్ఏ ఇచ్చిన 360 పేజీల ఫైనల్ రిపోర్ట్‌ను సీఎం రేవంత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. "మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏడో బ్లాక్ కుంగిపోవడం వల్ల మేడిగడ్డలో నీటి మళ్లింపు అసాధ్యం. గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తే ప్రాజెక్టుకే ముప్పు" అని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా నీటిని లిఫ్ట్ (Lift) చేయాలంటే 93.50 మీటర్ల పంపింగ్ లెవల్ ఉండాలని, కానీ ప్రస్తుతం అక్కడ కేవలం 89.90 మీటర్ల నీరు మాత్రమే ఉందన్నారు. గేట్లు మూస్తే తప్ప నీరు నిల్వ ఉండదని, కానీ గేట్లు మూయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పినప్పుడు నీళ్లను ఎలా ఎత్తిపోస్తామని సీఎం టెక్నికల్ అంశాలను వివరించారు.

ఈటల రాజేందర్‌కు సీఎం రేవంత్ సవాల్

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల డైరెక్షన్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. "ఈటల రాజేందర్ గారంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆయన హరీశ్ రావు మాటలు విని తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కిలాడీల కమిటీగా ఏర్పడి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు" అని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఈటల ముందు సీఎం రెండు డిమాండ్లు ఉంచారు.

CM Revanth Reddy Slams BRS BJP Over Kaleshwaram Barrage Defects

ఎన్డీఎస్ఏ పర్మిషన్ తీసుకురండి: ఈ కిలాడీల కమిటీ ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏను ఒప్పించి పర్మిషన్ తెస్తే, రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోయడానికి పూర్తి సహకారం అందిస్తుంది.

సీబీఐ విచారణ ఏమైంది?: మేడిగడ్డ నిర్మాణ అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 1నే సీబీఐ విచారణకు ఆదేశిస్తూ జీవో ఇచ్చింది. ఆ విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదో బీజేపీ ఎంపీగా ఈటల సమాధానం చెప్పాలి.

ఈ నివేదికలను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి ఎక్స్‌పర్ట్ కమిటీ ద్వారా ప్రాజెక్టుల పునరుద్ధరణకు (Restoration) రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement