త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | క‌మ‌ల్‌హాస‌న్ క్లాప్‌తో ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ ప్రారంభం – త‌మిళంలో ర‌ష్మిక స్పీచ్ హైలైట్‌

ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ బుధ‌వారం చెన్నైలో ఘ‌నంగా మొద‌లైంది. ఈ బ‌యోపిక్ లాంఛ్ ఈవెంట్‌కు విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. ఈ సినిమాలో ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌బోతుంది. ర‌ష్మిక‌పై చిత్రీక‌రించిన తొలి స‌న్నివేశానికి క‌మ‌ల్‌హాస‌న్ క్లాప్ కొట్టారు.

N

Entertainment | Published On Sep 17, 2026, 11.21 am IST

Rashmika Mandanna | క‌మ‌ల్‌హాస‌న్ క్లాప్‌తో ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్  ప్రారంభం – త‌మిళంలో ర‌ష్మిక స్పీచ్ హైలైట్‌
Advertisement

Rashmika Mandanna |  దిగ్గ‌జ సంగీత క‌ళాకారిణి ఎంఎస్‌సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ బుధ‌వారం చెన్నైలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ బ‌యోపిక్‌లో టైటిల్‌లో రోల్‌లో నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ర‌ష్మిక మంద‌న్న‌పై చిత్రీక‌రించిన తొలి స‌న్నివేశానికి క‌మ‌ల్‌హాస‌న్ క్లాప్ కొట్టారు.
ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌లో ర‌ష్మిక మంద‌న్న త‌మిళంలో మాట్లాడింది. ఆమె త‌మిళ స్పీచ్‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

గ‌ర్వంగా గౌర‌వంగా...

సుబ్బుల‌క్ష్మి అమ్మ జీవిత‌ ప్రయాణంలో చిన్న భాగంగా మారుతున్నందుకు ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాన‌ని ఈ వేడుక‌లో ర‌ష్మిక మంద‌న్న చెప్పింది. భార‌త‌ర‌త్న అవార్డు అందుకున్న ఈ దిగ్గ‌జ సంగీత క‌ళాకారిణి పాత్రను అంద‌రిని మెప్పించేలా పోషించేందుకు శాయ‌శ‌క్తులా కృషిచేస్తాన‌ని ఈ వేడుక‌లో ర‌ష్మిక మంద‌న్న తెలిపింది.

భాష‌కే అందం...

ఈ వేడుక‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ - "తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత దేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ. తెలుగు, తమిళం, కన్నడ ఇలా ఏ భాషలో ఆమె పాట పాడినా భాషకే అందం తెచ్చేలా సుబ్బుల‌క్ష్మి పాట ఉండేది. ఆమె సంగీతమే మనకు అందించిన సందేశం. ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ నాలో ఎంతో స్ఫూర్తి నింపారుఅమ్మ ఆలపించిన సుప్రభాతం, లలితసహస్రనామం, రంగపుర విహార పాటలు వింటే మనసు ఆనందంతో నిండిపోతుంది" అని అన్నారు...

మ‌హాత్మా గాంధీ...

"మహాత్మాగాంధీ కూడా ఎంఎస్ సుబ్బులక్ష్మి అభిమాని. ఆమె పాటలు విని సంతోషించేవారు. అమ్మ బయోపిక్ నిర్మిస్తున్న అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్ కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అమ్మ పాత్రలో నటించి మెప్పించ‌డం అంత సుల‌భం కాదు. ఈ సినిమాతో హీరోయిన్ ర‌ష్మిక‌తో పాటు డైరెక్ట‌ర్ గౌత‌మ్‌పై ఎంతో బాధ్య‌త పెరిగింది" అని క‌మ‌ల్‌హాస‌న్ చెప్పారు...

భార‌త‌ర‌త్న...

"డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి మాట్లాడుతూ ..."సుబ్బుల‌క్ష్మి అమ్మ‌ జీవితం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఆమె కేవలం ఒక గొప్ప సంగీత కళాకారిణి మాత్రమే కాదని, ఒక అసాధారణ జీవితాన్ని చూశార‌ని అర్థమైంది. మధురైలో పుట్టిన ఆమె సౌతిండియాతో పాటు మొత్తం ప్రపంచాన్ని తన సంగీతంతో అలరించారు. సినిమా కోసం ఆమె గురించి తెలుసుకున్నప్పుడు గొప్ప గొప్ప వేదికలు, అద్భుత సంగీత విభావరిలు, భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారం ఆమె సాగించిన జీవనయానంలో ఒక భాగంగా మారాయనిపించింది" అని చెప్పారు.

షేర్, స‌బ్‌స్కైబ‌ర్లు...

"వ్యక్తిగతంగా చూస్తే ఎంఎస్ అమ్మ ఒక కూతురు, ఒక కళాకారిణి, ఒక మహిళ. ఆమె తన జీవితంలో గొప్ప కలల్ని కన్నారు. జయాపజయాలు చూశారు. ఎన్నో త్యాగాలు చేశారు. వ్యక్తిగతంగా ఆమె జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని మేము అనుకున్నాం. ఈ రోజు గుర్తింపు అనేది రాత్రికి రాత్రే దక్కుతోంది. లైక్స్ షేర్స్ సబ్ స్క్రైబర్స్ రూపంలో ఫేమ్ ను , సక్సెస్ ను కొలుస్తున్నాం. కానీ ఎంఎస్ అమ్మ తన విజయాలను జీవితకాల క్రమశిక్షణతో, సహనంతో దక్కించుకున్నారు. ఈ పవర్ ఫుల్ మెసేజ్ ను ఈతరం వారికి మా సినిమా ద్వారా ఇవ్వబోతున్నాం. ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ మీద గౌరవభావం, ప్రేమతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నాం" అని డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి పేర్కొన్నారు.

సుబ్బ‌ల‌క్ష్మి బ‌యోపిక్ లాంఛ్ ఈవెంట్‌లో అల్లు అర‌వింద్‌, బ‌న్నీవాస్, రాక్‌లైన్ వెంక‌టేష్, సుహాసిని మ‌ణిర‌త్నం, నటుడు శివ‌కుమార్‌తో పాటు సుబ్బుల‌క్ష్మి కుటుంబ‌స‌భ్యులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement