త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagarjuna | ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం సీడ్ గ‌ణేషుడినే పూజించండి – అక్కినేని నాగార్జున పిలుపు

సీడ్ గ‌ణేశ ఉద్య‌మంలో టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున భాగ‌మ‌య్యారు. ఆదివారం అన్న‌పూర్ణ స్టూడియోలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం నాగార్జున‌కు సీడ్ గ‌ణేశుడిని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌పై నాగార్జున ప్ర‌శంస‌లు కురిపించారు.

N

Entertainment | Published On Sep 13, 2026, 1.00 pm IST

Nagarjuna | ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం సీడ్ గ‌ణేషుడినే పూజించండి – అక్కినేని నాగార్జున పిలుపు
Advertisement

Nagarjuna | ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ కోసం మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌కృతిని కాపాడుకునేందుకు ఈ సారి అంద‌రూ సీడ్ గ‌ణేషుడినే పూజించాల‌ని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం నాగార్జున‌కు పర్యావరణహిత సీడ్ గణేశ విగ్రహాన్ని అంద‌జేశారు.

ప్ర‌శంస‌లు...

విగ్రహాన్ని స్వీకరిరించిన నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను అభినందించారు. ప్ర‌కృతి కాపాడుతూ ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించ‌డం కోసం సంతోష్ కుమార్ చేస్తోన్న కృషిని కొనియాడారు. సీడ్ గణేశను అర్థవంతమైన కానుకగా అభివర్ణించారు. నదులు, చెరువులు, జలాశయాలపై భారం పడకుండా సీడ్ గ‌ణేశ ద్వారా వినాయ‌క‌చ‌వితిని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో అంద‌రూ జ‌రుపుకోవాల‌ని నాగార్జున పిలుపునిచ్చారు.

మ‌ట్టిలో క‌రిగిపోయి...

సహజ మట్టి, కోకోపీట్, కొబ్బరి నారతో తయారై, వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలు పొదిగిన సీడ్ గణేశను ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చు. పూజా కార్యక్రమాల తర్వాత విగ్రహం మట్టిలో కరిగిపోయి, విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా రూపొందుతాయి. వాటిని ఇంటి ఆవరణలు, ఉద్యానవనాలు, సామూహిక స్థలాల్లో నాటవచ్చు. ఈ విధంగా భక్తి మొక్కగా మారుతుంది...వినాయకుని ఆశీస్సు పచ్చదనంగా కొనసాగుతుంది.

హ‌రిత‌హారం స్ఫూర్తితో...

హరితహారం స్ఫూర్తితో 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొద‌లైంది. మూడు మొక్కలు నాటండి, మూడు సంవత్సరాలు సంరక్షించండి, మరో ముగ్గురిని నామినేట్ చేయండి అనే నినాదంతో ప్ర‌జ‌ల్లో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని నింపుతోంది. సీడ్ గణేశ అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగ కార్యక్రమంగా మారింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల స్థానంలో, భూమికి తిరిగి ప్రాణంగా మారే రూపాన్ని భక్తులు స్వీకరించాలని ఇది పిలుపునిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో సీడ్ గ‌ణేశ‌ విగ్రహాన్ని స్వీకరించి, సంతోష్ కుమార్ ప్రజాసేవను కొనియాడిన‌ నాగార్జునకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సీజన్‌లో సీడ్ గణేశను సినీ ప్రముఖులు, కుటుంబాలు, సంస్థలు స్వీకరించాలని సంస్థ పిలుపునిచ్చింది.

Advertisement
Advertisement