త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | ఇండస్ట్రీలోని విభేదాలపై మెగాస్టార్‌ సీరియస్.. ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌ల‌తో చిరంజీవి భేటీ

ప‌ర్సెంటేజీ విధానం అమ‌లుపై నెల‌కొన్న వివాదానికి సంబంధించి టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్లు, తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల‌తో చిరంజీవి భేటీ అయ్యారు. స‌మ‌స్య ప‌రిష్కారానికి అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాన‌ని చెప్పారు. ఛాంబ‌ర్ నిర్ణ‌యానికి అంద‌రూ క‌ట్టుబ‌డి ఉండాల‌ని సూచించారు.

N

Entertainment | Published On May 25, 2026, 7.19 pm IST

Chiranjeevi | ఇండస్ట్రీలోని విభేదాలపై మెగాస్టార్‌ సీరియస్.. ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌ల‌తో చిరంజీవి భేటీ
Advertisement

Chiranjeevi |  ప‌ర్సెంటేజీ సిస్ట‌మ్ అమ‌లు విష‌యంలో టాలీవుడ్ నిర్మాత‌ల‌కు, తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల‌కు మ‌ధ్య కొంత‌కాలంగా వివాదం న‌డుస్తోంది. ప్ర‌స్తుతం నైజాం ఏరియాలోని సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో అమ‌లులో ఉన్న రెంట‌ల్ సిస్ట‌మ్ స్థానంలో ప‌ర్సెంటేజీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఎగ్జిబిట‌ర్లు కోరుతున్నారు. నిర్మాత‌లు మాత్రం ప‌ర్సెంటేజ్ సిస్ట‌మ్‌ను వ్య‌తిరేకిస్తున్నారు. చిన్న‌గా మొద‌లైన ఈ వివాదం గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు ఒక‌రిపై మ‌రొక‌రు వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేసుకునే స్థాయికి చేరుకుంది. ప‌ర్సెంటేజ్ సిస్ట‌మ్‌కు అంగీక‌రించ‌ని నిర్మాత‌ల సినిమాల‌ను త‌మ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌బోమ‌ని ఇటీవ‌లే ఎగ్జిబిట‌ర్లు తీర్మాణించారు.

చిరంజీవి నివాసంలో...

తాజాగా ప‌ర్సెంటేజీ స‌మ‌స్య‌కు సంబంధించి ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌లు సోమ‌వారం మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ స‌మావేశం జ‌రిగింది. ప‌ర్సెంటేజీ విష‌యంలో నెల‌కొన్న సంక్షోభానికి సంబంధించి నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు గంట పాటు ఇరువురి స‌మ‌స్య‌ల‌ను చిరంజీవి విన్న‌ట్లు స‌మాచారం.

ఛాంబ‌ర్ నిర్ణ‌యానికి...

ఒక్క  సినిమా  గురించో  , ఓ  సెక్టార్  గురించో  ఈ  చర్చ కాదని, ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మైన అంద‌రికి న్యాయం జ‌ర‌గాల‌నే స‌మావేశాన్ని ఏర్పాటుచేసిన‌ట్లు ఎగ్జిబిట‌ర్ల భేటీలో చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు  సినీ ప‌రిశ్ర‌మ‌కు తెలుగు  ఫిలిం  ఛాంబర్  ఆఫ్  కామర్స్  పెద్ద దిక్కుగా ఉంద‌ని,   ఛాంబర్  తీసుకున్న  నిర్ణయానికి అంద‌రూ క‌ట్టుబ‌డి ఉండాల‌ని చిరంజీవి అన్నారు. ఇండ‌స్ట్రీలోని నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు  అందరినీ  సంప్రదించి , పర్సెంటేజ్ విధానం మీద  ఛాంబ‌ర్ ఓ క‌మిటీ ఏర్పాటుచేసింద‌ని చిరంజీవి గుర్తుచేశారు.  కానీ ఛాంబ‌ర్ నిర్ణ‌యాన్ని   వ్యతిరేకిస్తూ  మీడియా  ముందు వ్య‌తిరేక‌ అభిప్రాయాలు  వ్యక్తపరచటం తగదని చిరంజీవి అన్నారు.
ఇలాంటి వాటివల్ల  ఇండస్ట్రీ ఐక‌మ‌త్యం లేద‌న్న‌ సందేశం ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జూన్ 30 లోగా...

ఇంతకు  ముందు  వేసిన  ఇత‌ర‌  కమిటీ ల  పని  తీరు , వాటి ఫలితాల పట్ల  సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత   అసంతృప్తి , అపనమ్మకం   ఉంద‌ని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సారి తెలుగు ఫిల్మ్  ఛాంబర్  ఏర్పాటు చేసిన  కమిటీ  అనుకున్న గడువులో  అంటే  జూన్  30 వ  తేదీ  వరకూ , అన్ని  విషయాలని కూలంకుషంగా ప‌రిశీలించి  ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు అందరికీ  న్యాయం  జరిగేలా  పర్సెంటేజ్ మోడల్ మీద స‌రైన   నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే   నమ్మకం త‌న‌కు వుందని,  ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు  పూర్తిచేసి  నివేదిక  ఇవ్వటానికి  తనవంతు అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాన‌ని  ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌ల‌కు చిరంజీవి హ‌మీ ఇచ్చారు.ఈ స‌మావేశంలో నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, సురేష్‌బాబుతో పాటు సునీల్ నారంగ్‌, కేఎల్ నారాయ‌ణ‌, శేఖ‌ర్‌, అనుప‌మ్‌, సందానంద్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

Advertisement
Advertisement