త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | జ‌న నాయ‌గ‌న్ వ‌చ్చేది ఎప్పుడో..? తీర్పును రిజ‌ర్వ్ చేసిన మ‌ద్రాస్ హైకోర్టు..!

Jana Nayagan | త‌మిళ న‌టుడు విజ‌య్ న‌టిస్తున్న చిత్రం జ‌న నాయ‌గ‌న్‌. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నాడు. దాంతో సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌బోతున్నాడు.

P

Entertainment | Published On Jan 20, 2026, 8.13 pm IST

Jana Nayagan | జ‌న నాయ‌గ‌న్ వ‌చ్చేది ఎప్పుడో..? తీర్పును రిజ‌ర్వ్ చేసిన మ‌ద్రాస్ హైకోర్టు..!
Advertisement

Jana Nayagan | త‌మిళ న‌టుడు విజ‌య్ న‌టిస్తున్న చిత్రం జ‌న నాయ‌గ‌న్‌. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ త్వ‌ర‌లో త‌మిళ‌నాడులో జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నాడు. దాంతో సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం జ‌న నాయ‌గ‌న్ మూవీలో న‌టించాడు. పొలిటిక‌ల్ ఎంట్రీ నేప‌థ్యంలో ఇదే ఆఖ‌రి చిత్రంగా భావిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. అయితే, ఈ మూవీని సంక్రాంతి పండుగ‌కు ముందు విడుద‌ల చేయాల్సి ఉండ‌గా.. సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీలో జాప్యం కార‌ణంగా రిలీజ్ వాయిదాప‌డింది. దాంతో సెన్సార్ బోర్డు తీరును స‌వాల్ చేస్తూ నిర్మాత‌లు మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. నిర్మాత‌లు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై కోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపింది. ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుణ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం వాద‌న‌లు విని.. సీబీఎఫ్‌సీ దాఖలు చేసిన అప్పీల్‌పై మద్రాస్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.

జ‌న‌వ‌రి 9న మ‌ద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వుపై స్టే విధించింది. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించాల‌ని చెప్పింది. మంగ‌ళ‌వారం విచార‌ణ సంద‌ర్భంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ త‌ర‌ఫున న్యాయవాది సతీష్ పరాశరన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సంబంధించిన విషయాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. డిసెంబ‌ర్ 31 నాటికి మూవీ విడుద‌ల తేదీపై స్ప‌ష్ట‌త రాక‌పోతే తాము నిర్మాత‌ల‌పై కేసు పెడతామని అమెజాన్ తమకు చెప్పిందని ఆయన తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ డేట్ స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో కంపెనీ ఎప్పుడైనా నిర్మాత‌ల‌పై కేసు పెట్టొచ్చ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నిర్మాతలు ఈ సినిమాపై చాలా డబ్బు పెట్టుబడి పెట్టారని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

విచారణ సందర్భంగా చిత్ర నిర్మాతల తరపు న్యాయవాది 'ధురందర్ 2' చిత్రాన్ని ప్ర‌స్తావించారు. జన నాయగ‌న్‌ చిత్రం విడుదల తేదీ కోసం ఇంకా ఎదురుచూస్తోందని అడ్వకేట్ సతీష్ పరాశరన్ పేర్కొన్నారు. రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2' చిత్రం రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించార‌ని.. చైర్‌ప‌ర్స‌న్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేద‌ని ఆయ‌న వాద‌న‌లు వినిపించారు. 'ధురందర్ 2' మార్చి 19న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంద‌ని చెప్పారు. సెన్సార్ సర్టిఫికేట్ రాకుండానే విడుదల తేదీని ప్రకటించినందుకు కోర్టు చిత్ర నిర్మాతలను మందలించింది. నిర్మాణ సంస్థ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది, సర్టిఫికేషన్ రాకముందే నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించడం సర్వసాధారణమని తెలిపారు. ఈ సంద‌ర్భంగా 'ధురందర్ 2' చిత్రాన్ని ఉదాహరణగా చూపించారు. సినిమా ఆల‌స్యం కావ‌డంతో అభిమానుల‌తో పాటు నిర్మాత‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ని.. ఆల‌స్య‌మైతే రూ.500కోట్ల న‌ష్టాన్ని చ‌వి చూడాల్సి వ‌స్తుంద‌ని మేకర్స్ వాదించారు.

విచార‌ణ సంద‌ర్భంగా సెన్సార్ బోర్డు త‌ర‌ఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) సుందరేశన్ హాజరై వాదనలను వినిపించారు. కేసు తొలుత విచార‌ణ స‌మ‌యంలో త‌మ స్పంద‌న‌ను తెలిపేందుకు సీబీఎఫ్‌సీకి సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. కోర్టులో ఎప్పుడూ సవాల్ చేయలేదన్నారు. కమిటీ సూచించిన 14 కట్‌లకు సంబంధించి అంతిమ నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ఈ విషయంపై చైర్‌పర్సన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంద‌న్నారు. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న 'జన నాయగ‌న్' కేసులో వాదనలు ముగిసిన తర్వాత మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, సినిమా విడుదలపై అనిశ్చితి కొన‌సాగుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement