త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala Temple | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం మూసివేత‌.. ఫిబ్ర‌వ‌రిలో తెరుచుకోనున్న ద్వారాలు..!

Sabarimala Temple | కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆల‌యం మంగ‌ళ‌వారం మూత‌ప‌డింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ అయ్యప్పను ద‌ర్శించుకున్నాక మూసివేసిన‌ట్లు తెలిపారు.

P

Devotional | Published On Jan 20, 2026, 9.50 pm IST

Sabarimala Temple | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం మూసివేత‌.. ఫిబ్ర‌వ‌రిలో తెరుచుకోనున్న ద్వారాలు..!
Advertisement

Sabarimala Temple | కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆల‌యం మంగ‌ళ‌వారం మూత‌ప‌డింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ అయ్యప్పను ద‌ర్శించుకున్నాక మూసివేసిన‌ట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయంలో నిత్య‌క్ర‌తువులు నిర్వ‌హించారు. సంప్రదాయం ప్రకారం తూర్పు మండపంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం పవిత్ర త్రివాభరణం తిరుగు ప్రయాణం మొద‌లైంది. 30 మంది సభ్యులతో కూడిన బృందం, పెరియస్వామి మరుతువన శివంకుట్టి నేతృత్వంలో పవిత్ర ఆభరణాలను అదే మార్గంలో పందలం శ్రీంబిక్కల్ ప్యాలెస్‌కు తీసుకెళ్ల‌నున్నారు. ఈ బృందం జనవరి 23న పందలం చేరుకుంటుందని దేవ‌స్వం బోర్డు అధికారులు తెలిపారు.

మండ‌ల‌-మ‌క‌ర‌విల‌క్కు సంద‌ర్భంగా దాదాపు రెండునెల‌ల‌కుపైగా ఆల‌యాన్ని తెరిచారు. చివ‌రి రోజున ప్రధాన పూజారి ఈడీ ప్రసాద్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం నిర్వహించారు. విగ్రహాన్ని రుద్రాక్ష మాలతో అలంక‌రించారు. అలాగే, యోగ దండాన్ని స్వామివారి చేతిలో ఉంచారు. చివ‌ర‌గా హరివరాసనం గానం అనంత‌రం దీపాలను ఆర్పివేసి గ‌ర్భాల‌య ద్వారాల‌ను మూసివేశారు. సంప్ర‌దాయం మేర‌కు ఆలయ తాళంచెవిల‌ను పందలం రాజకుటుంబ ప్రతినిధికి అప్పగించారు. ఆయన 18 మెట్లు దిగి, సంప్రదాయ ఆచారాలు పూర్తి చేసి, ప‌రిపాల‌న అధికారి శ్రీనివాసన్‌కు అందించారు. ఇదిలా ఉండ‌గా.. ఈ సారి సీజ‌న్‌లో ల‌క్ష‌లాది మంది భ‌క్తులు శ‌బ‌రిమ‌లకు పోటెత్తారు. ఆల‌యాన్ని తిరిగి ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే పూజ‌ల కోసం తెరువ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. కుంభం మాసపు పూజ‌లు ఫిబ్రవరి 12న తేదీ సాయంత్రం 5 గంటలకు 17న రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. ఈ రోజుల్లోనే స్వామివారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని, ద‌ర్శ‌నం టోకెన్లు, ఆన్‌లైన్ బుకింగ్, భద్రతా ఏర్పాట్లు గ‌తం మాదిరిగానే ఉంటాయ‌ని వివ‌రించారు.

Advertisement
Advertisement