త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత

Smart Ration Cards | తెలంగాణలో ఆహార భద్రతకు ‘స్మార్ట్‌’గా మార‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ నెల 15న సంగారెడ్డిలో జ‌రిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సీఎం ఈ ప్రక్రియను ప్రారంభించనుండగా.. అదే రోజు 33 జిల్లా కేంద్రాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేయ‌నున్నారు.

P

Telangana | Published On Aug 11, 2026, 7.43 pm IST

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
Advertisement
  • ఆగస్టు 15న పంపిణీ సీఎం రేవంత్‌ శ్రీకారం
  • 33 జిల్లాల్లో ఏకకాలంలో కార్యక్రమాలు..
  • ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల ఉచిత సన్నబియ్యం

Smart Ration Cards | తెలంగాణలో ఆహార భద్రతకు ‘స్మార్ట్‌’గా మార‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ నెల 15న సంగారెడ్డిలో జ‌రిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సీఎం ఈ ప్రక్రియను ప్రారంభించనుండగా.. అదే రోజు 33 జిల్లా కేంద్రాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేయ‌నున్నారు. కార్డుల పంపిణీ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్‌ రోహిత్‌సింగ్‌ తదితరులతో ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తో మాట్లాడి సీఎం పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.

1.06 కోట్ల కార్డులు.. 3.43 కోట్ల మంది

రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 ఆహార భద్రత కార్డులు ఉండగా.. వాటి పరిధిలో 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల అమలుతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం పెరగడంతో పాటు లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. 2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. వీటి ద్వారా 61,08,544 మందికి ఆహార భద్రత పరిధిలోకి వచ్చినట్లు తెలిపారు. 2026 ఆగస్టు నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రత కార్యక్రమం విస్తృతికి ప్రభుత్వం చేస్తున్న వ్యయమే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. రేషన్‌ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20వేల కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు.

లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా..

సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల తరలింపు, సీటింగ్‌, భద్రత, కార్డుల పంపిణీతో పాటు సీఎం పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ముందుగానే పకడ్బందీగా ప్రణాళిక చేయాలని సూచించారు. కార్యక్రమానికి మినిట్‌-టు-మినిట్‌ షెడ్యూల్‌ సిద్ధం చేసి.. నిర్దేశిత సమయంలో కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వాస్తవ లబ్ధిదారులను గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల గుర్తింపును ధ్రువీకరించి, పూర్తి పారదర్శకతతో కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలపై కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, అవసరమైన వ్యయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.

‘ప్రతి అర్హుడికీ ఆహార భద్రతే లక్ష్యం’

తెలంగాణలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఇంత విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా లబ్ధిదారుడి చెంతకు చేర్చడమే స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ఉద్దేశమని పేర్కొన్నారు. ఆహార భద్రత కార్యక్రమం విస్తృతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా వేదికలను వినియోగించాలని మంత్రి అధికారులకు సూచించారు. 1.06 కోట్ల కార్డులు, 3.43 కోట్ల లబ్ధిదారులు, ఉచిత సన్నబియ్యం వంటి అంశాలతో పాటు షార్ట్‌ వీడియోలు, రీల్స్‌ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి.. సంగారెడ్డిలో రాష్ట్రస్థాయి కార్యక్రమంతో పాటు 33 జిల్లాల్లో జరిగే స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement