త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stars | బాక్సాఫీస్‌ 40+ స్టార్స్‌దే..!

Stars | పాన్ ఇండియా స్థాయిలో భారతీయ సినిమా బాక్సాఫీస్‌ను ప్రస్తుతం కొందరు సూపర్‌స్టార్‌లు ముందుండి నడిపిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ స్టార్‌లలో ఎక్కువ మంది నలభై ఏళ్లు దాటిన వారే. యువ హీరోలు వరుసగా ఇండస్ట్రీలోకి వస్తున్నప్పటికీ, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం నిర్మాతలు ఇప్పటికీ సీనియర్ స్టార్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

P

Entertainment | Published On Mar 14, 2026, 9.01 pm IST

Stars | బాక్సాఫీస్‌ 40+ స్టార్స్‌దే..!
Advertisement
  • భారీ బడ్జెట్‌ సినిమాలన్నీ స్టార్ల చేతుల్లోనే..
  • ఓపెనింగ్‌ కలెక్షన్స్‌పైనే మేకర్స్‌ దృష్టి
  • కంటెంట్‌ కీలకమైనా.. స్టార్‌ పవర్‌పైనే నమ్మకం
  • పెట్టుబడులు రాబట్టుకునే ప్రయత్నం
  • టాలీవుడ్‌లో ఇప్పుడిదే ట్రెండ్‌

Stars | పాన్ ఇండియా స్థాయిలో భారతీయ సినిమా బాక్సాఫీస్‌ను ప్రస్తుతం కొందరు సూపర్‌స్టార్‌లు ముందుండి నడిపిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ స్టార్‌లలో ఎక్కువ మంది నలభై ఏళ్లు దాటిన వారే. యువ హీరోలు వరుసగా ఇండస్ట్రీలోకి వస్తున్నప్పటికీ, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం నిర్మాతలు ఇప్పటికీ సీనియర్ స్టార్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వారికి ఉన్న మార్కెట్‌, దేశవ్యాప్తంగా విడుదల చేసే సామర్థ్యం, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించే నమ్మకం వంటి అంశాలన్నీ కలిసి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. దీంతో స్టార్‌డమ్‌కి వయసుతో సంబంధం లేదని ఈ 40 ప్లస్ హీరోలు మరోసారి రుజువు చేస్తున్నారు. విస్తరిస్తున్న సినిమా మార్కెట్‌లో రిస్క్ తీసుకోవడం కంటే సేఫ్ గేమ్‌కే నిర్మాతలు ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా థియేట్రికల్ మార్కెట్ ఇప్పటికీ స్టార్ పవర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. కథ, కంటెంట్ ఎంత ముఖ్యమైనా, తొలి రోజు వసూళ్ల విషయంలో స్టార్ ఇమేజ్ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ 40 ప్లస్ స్టార్స్‌ ప్రస్తుతం భారతీయ సినిమాపై తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.

ప్రభాస్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వయసు 46 సంవత్సరాలు. అత్యంత మార్కెట్ ఉన్న హీరోల్లో ముందువరుసలో ఉన్నాడు. రాజాసాబ్‌, ఆదిపురుష్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ప్రస్తుతం స్పిరిట్‌, ఫౌజీ, కల్కి2, సలార్‌2 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభాస్‌ రాబోయే ప్రాజెక్టుల వ్యయం దాదాపు రూ.2100కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో కల్కి-2 బడ్జెట్‌ రూ.700కోట్లు కాగా. సలార్‌-2 బడ్జెట్‌ రూ.350 నుంచి రూ.360 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్పిరిట్‌ రూ.320 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ పాన్‌ ఇండియా స్థాయిలో హై ఆక్టేన్‌ యాక్షన్‌, పైన్స్‌ ఫిక్షన్‌ తదితర జానర్లలో రూపొందుతున్నాయి. నిర్మాణ పరంగా ఈ హై బడ్జెట్‌ ప్రభాస్‌ మార్కెట్‌ రేంజ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.

అల్లు అర్జున్‌

పుష్ప స్టార్‌ అల్లు అర్జున్‌ వయసు 43. ప్రస్తుతం కెరీర్‌ను జాగ్రత్తగా తీర్చిద్దిద్దుకుంటున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్థాయిలో తనదైన మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి మరోసారి తన సత్తాచాటాలని భావిస్తున్నాడు భారీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ముందుకువెళ్తున్నాడు. ఈ యూవీ దాదాపుగా రూ.800 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. హై హెండ్‌ ప్రొడక్షన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌లతో తెరకెక్కిస్తుండగా.. ఇది ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో మరో ప్రాజెక్టులో నటించనున్నాడు. ‘ఇరుంబు కై మాయావి’ రివైవల్‌గా పేర్కొంటున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సూపర్‌హీరో సినిమా దాదాపుగా రూ.800 కోట్ల నుంచి రూ.1000కోట్లకుపైగానే ఉండొచ్చని టాక్‌ వినిపిస్తోంది.

యష్‌

కన్నడ నటుడు యష్‌ వయసు 40 సంవత్సరాలు. కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా లెవల్లో తన సత్తా చాటాడు. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల్లో యష్‌ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం టాక్సిక్‌ మూవీలో నటిస్తున్నాడు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో రిలీజ్‌కు సిద్ధమైంది. దాదాపుగా రూ.600 నుంచి రూ.700 కోట్ల బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించినట్లుగా అంచనాలున్నాయి. ఈ మూవీ సైతం భారతీయ చిత్రపరిశ్రమలో అత్యంత ఖర్చుతో తెరకెక్కించిన మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, యశ్‌ బాలీవుడ్‌లో నితిశ్‌ తివారీ దర్శకత్వంలో రామాయణ్‌ మూవీలో రావణుడిగా నటించనున్నాడు. రెండుపార్టులుగా రానున్న ఈ మూవీకి బడ్జెట్‌ రూ.4వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. నమిత్‌ మల్హోత్రా, యశ్‌ స్థాపించిన మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత బడ్జెట్‌గా తెరకెక్కిన మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ వయసు 40 ఏళ్లు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో మెగా హీరో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది గ్లోబల్‌ స్టార్‌గా పేరు పొందాడు. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన మూవీ గేమ్‌ ఛేంజర్‌ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు అంచనా. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్‌ రావడం విశేషం. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్‌ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీలో నటుస్తున్నాడు. ఈ మూవీ రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు అంచనా. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలువనున్నది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.

జూనియర్‌ ఎన్టీఆర్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ వయసు 42. ప్రస్తుతం పలు పాన్‌ ఇండియా సినిమాలను లైన్‌లో పెట్టాడు. బాలీవుడ్‌లో వార్‌-2 మూవీలో నటించినా.. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీని రూ.450కోట్లతో యాక్షన్‌ థిల్లర్‌ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి దాదాపుగా రూ.371 కోట్ల గ్రాస్‌ను రాబట్టగలిగింది. ఈ మూవీ నిరాశపరిచినా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మూవీని దాదాపు రూ.350 నుంచి రూ.450 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటుందని అంచనా.

రిషబ్‌ శెట్టి

రిషబ్‌ శెట్టి వయసు 46 ఏళ్లు. కాంతారాతో పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ మార్కెట్‌ను సృష్టించుకోగలిగారు. రిషబ్‌ కెరీర్‌కు కాంతారా, కాంతారా చాప్టర్‌-1 మూవీలు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచాయి. ప్రస్తుతం రిషబ్‌ శెట్టి పలు జై హనుమాన్‌ మూవీలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీ బడ్జె్‌ట్‌ రూ.200కోట్లుగా అంచనా. రూ.40కోట్లతో తెరకెక్కించిన హనుమాన్‌ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోంది. అలాగే, పాన్‌ ఇండియా స్థాయిలో సందీప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ : ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌ మూవీలో మరాఠా యోధుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే, బడ్జెట్‌ గురించిన వివరాలు తెలియరాలేదు. కానీ, భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 2027లో ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

మహేశ్‌ బాబు 

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు వయసు 50 సంవత్సరాలు. టాలీవుడ్‌లో సీనియర్‌ హీరోల్లో మహేశ్ ఒకరు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ మూవీలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నారు. ఈ మహేశ్, రాజమౌళి కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా మారనున్నది. వారణాసి మూవీతో మహేశ్ ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఈ మూవీ దాదాపుగా రూ.1300కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఇది ఓ భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కనున్నది. ఈ మూవీలో మహేశ్‌కు జోడీగా గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా జోడీగా నటించనున్నది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ అంచనాలు మరింత పెంచాయి. వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్న ఈ మూవీ ఎంత మేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాల్సిందే.

మొత్తంగా చూస్తే, 40 ఏళ్లు దాటిన ఈ స్టార్ హీరోలే ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల భారాన్ని మోస్తున్నారు. విస్తృత మార్కెట్ ఉన్నత స్థాయి బాక్సాఫీస్‌ను ప్రభావితం చేస్తోంది. స్థిరమైన అభిమాన వర్గం వీరిని అగ్రస్థానంలో నిలబెడుతోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉండనున్నారో.. లేకపోతే పాన్ ఇండియా ఫెనామినాన్ తగ్గిపోతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పనున్నది.

Advertisement
Advertisement