త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddhivinayak Temple | ముంబయి సిద్ధి వినాయక ఆలయానికి కొత్తరూపు..!

Siddhivinayak Temple | యావత్‌ దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గణేశ్‌ ఆలయాల్లో ఒకటైన ముంబయి సిద్ధివినాయక దేవాలయం కొత్త రూపును సంతరించుకోబోతోంది. ప్రతి రోజు వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ప్రసిద్ధ ఈ మందిరాన్ని మరింత విస్తరిస్తూ ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు.

P

Devotional | Published On May 26, 2026, 7.18 am IST

Siddhivinayak Temple | ముంబయి సిద్ధి వినాయక ఆలయానికి కొత్తరూపు..!
Advertisement

Siddhivinayak Temple | యావత్‌ దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గణేశ్‌ ఆలయాల్లో ఒకటైన ముంబయి సిద్ధివినాయక దేవాలయం కొత్త రూపును సంతరించుకోబోతోంది. ప్రతి రోజు వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ప్రసిద్ధ ఈ మందిరాన్ని మరింత విస్తరిస్తూ ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ఆలయాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దే ‘సిద్ధివినాయక కారిడార్‌ ప్రాజెక్ట్‌’ తొలి దశ పనులకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే శంకుస్థాపన చేశారు. సుమారు 225 ఏళ్ల చరిత్ర కలిగిన సిద్ధివినాయక ఆలయం కేవలం ముంబయికే పరిమితం కాదు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ముఖ్యంగా వినాయక చవితి, సంకష్టహర చతుర్థి వంటి పర్వదినాల్లో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోతాయి.

గంటల తరబడి క్యూల్లో నిలబడి దర్శనం చేసుకోవడం ఇక్కడ సాధారణమే. ఈ క్రమంలో భక్తులకు మరింత మెరుగైన అనుభూతి కల్పించాలనే ఉద్దేశంతో కారిడార్‌ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం, ఆలయ ట్రస్ట్‌ ముందుకు తీసుకొచ్చాయి. శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన ఏక్‌నాథ్‌ షిండే.. ‘సిద్ధివినాయకుడు కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి ప్రతీక. భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వారికి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు ఆధునిక సదుపాయాలు అవసరం అయ్యాయి’ అని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ కారిడార్‌ ప్రాజెక్ట్‌తో ఆలయ పరిసరాల్లో విస్తృత మార్పులు కనిపించనున్నాయి. ఆధునిక పార్కింగ్‌ సదుపాయాలు, క్రమబద్ధమైన క్యూ మేనేజ్‌మెంట్‌, భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. ఎండతో పాటు వానలు కురిసినా ఇబ్బంది లేకుండా ప్రత్యేక కారిడార్‌ను నిర్మించనున్నారు. దాంతో భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది.

సిద్ధివినాయక ట్రస్ట్‌ ఖజాంచి ఆచార్య పవన్‌ త్రిపాఠి మాట్లాడుతూ.. ఇప్పటివరకు భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతూ దర్శనం చేసుకునేవారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆధునిక సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న వేళ.. సిద్ధివినాయక కారిడార్‌ కూడా అదే దిశలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిరం, ఉజ్జయినిలో మహాకాళ్‌ కారిడార్‌ తరహాలో ముంబయిలో సిద్ధివినాయక ఆలయ అభివృద్ధి కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకురానుందని భక్తులు భావిస్తున్నారు. కారిడార్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత సిద్ధివినాయక ఆలయం మరింత క్రమబద్ధంగా, భక్తులకు అనుకూలంగా మారనుంది. అదే సమయంలో ముంబయి ఆధ్యాత్మిక గుర్తింపును మరింత బలోపేతం చేసే ప్రాజెక్ట్‌గా ఇది నిలువనుంది.

Advertisement
Advertisement