Srivilliputhur | ఆండాళ్ కొలువైన పుణ్యభూమి.. మహారథోత్సవానికి శ్రీవిల్లిపుత్తూరు..!
Srivilliputhur | తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు పేరు వినగానే గుర్తొచ్చేది ఆండాళ్ అమ్మవారి ఆలయం.. ఆకాశాన్ని తాకేలా కనిపించే ఆలయ గోపురం.. భక్తి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన తిరుప్పావై.. ఇక ఏటా జరిగే ఆడిపూరం మహోత్సవంలో ప్రధాన ఘట్టమైన మహారథోత్సవం. ఈ ఏడాది ఆగస్టు 14న శ్రీవిల్లిపుత్తూరులో మహారథోత్సవం జరగనుంది.
Devotional | Published On Aug 11, 2026, 3.36 pm IST
- ఆగస్టు 14న ఆండాళ్ అమ్మవారి మహారథోత్సవం..
- తరలిరానున్న భక్తజనం
- చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పకళల సంగమమైన క్షేత్రం
Srivilliputhur | తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు పేరు వినగానే గుర్తొచ్చేది ఆండాళ్ అమ్మవారి ఆలయం.. ఆకాశాన్ని తాకేలా కనిపించే ఆలయ గోపురం.. భక్తి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన తిరుప్పావై.. ఇక ఏటా జరిగే ఆడిపూరం మహోత్సవంలో ప్రధాన ఘట్టమైన మహారథోత్సవం. ఈ ఏడాది ఆగస్టు 14న శ్రీవిల్లిపుత్తూరులో మహారథోత్సవం జరగనుంది. ఆ రోజున ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోనున్నాయి. ప్రత్యేక పూజలు, అలంకరణలు, మంగళవాయిద్యాల నడుమ ఆండాళ్ అమ్మవారు, శ్రీరంగమన్నార్ స్వామివార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి ఊరేగిస్తారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
తులసి వనంలో వెలసిన ఆండాళ్..
శ్రీవిల్లిపుత్తూరు కథ ఆండాళ్తోనే మొదలవుతుంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లలో ఏకైక మహిళా ఆళ్వార్గా ఆండాళ్కు విశిష్ట స్థానం ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం పెరియాళ్వార్ తులసి వనంలో చిన్నారిగా ఆమె దొరకగా.. తన కుమార్తెగా పెంచారు. విష్ణుమూర్తినే తన భర్తగా భావించిన ఆండాళ్ భక్తి కవిత్వం అనంతరం తరాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె రచించిన ‘తిరుప్పావై’ తమిళ భక్తి సాహిత్యంలో అపూర్వ స్థానం సంపాదించుకుంది. మార్గశిర మాసంలో దేశంలోని అనేక వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పాశురాలు వినిపించడానికి ఇదే కారణం. ఆండాళ్ భక్తి, సాహిత్యం, వైష్ణవ సంప్రదాయం అన్నీ కలిసిన నేల కావడంతో శ్రీవిల్లిపుత్తూరు భక్తులకు సాధారణ పుణ్యక్షేత్రమే కాదు.. ఓ ఆధ్యాత్మిక అనుభూతి.
108 దివ్యదేశాల్లో ఒకటి
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారిని వటపత్రశాయిగా కొలుస్తారు. ఆలయానికి శిల్పకళ, శాసనాలు, పురాతన నిర్మాణశైలి ప్రత్యేక ఆకర్షణ. ఆలయ గోపురం ఈ పట్టణానికి గుర్తింపుగా నిలిచింది. ఆలయంలో నిత్యం నిర్వహించే పూజలు, అలంకరణలు, నైవేద్యాలు, దీపారాధనలతో పాటు నాదస్వర, తవిల్ మంగళవాయిద్యాలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఆండాళ్ అమ్మవారికి సంబంధించిన పూలమాల సంప్రదాయానికీ ఈ క్షేత్రంలో విశేష ప్రాధాన్యం ఉంది.
మహారథం.. కనులవిందు..
ఆడిపూరం ఉత్సవాల్లో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం మహారథోత్సవం. ఆలయ ఉత్సవమూర్తులను రథంపై అధిష్ఠింపజేసి ఆలయ పరిసర వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. భారీ కలప రథం, దానిపై చెక్కిన శిల్పాలు, అలంకరణలు, చుట్టూ భక్తుల సందడి.. మంగళవాయిద్యాల నడుమ రథం కదిలే వేళ శ్రీవిల్లిపుత్తూరు మొత్తం ఒక పండుగ వాతావరణంలోకి మారిపోతుంది. రథాన్ని లాగేందుకు భక్తులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఏటా ఆడిపూరం ఉత్సవం సాధారణంగా 12 రోజులపాటు సాగుతుంది. ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సంప్రదాయ కార్యక్రమాలతో పట్టణం కళకళలాడుతుంది. రథోత్సవం రోజున తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలవుతుంది. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించిన పల్లకీల్లో రథం వద్దకు తీసుకువస్తారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే రథోత్సవం భక్తులకు ప్రధాన ఆకర్షణ. రథం ముందుకు కదులుతుంటే ‘గోవిందా.. గోవిందా..’ అంటూ భక్తుల నామస్మరణ, మంగళవాయిద్యాల శబ్దాలు, ఆలయ ఘంటానాదాలు కలగలిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతాయి.

భక్తితో పాటు.. పర్యాటకానుభూతి
శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్లే వారికి రథోత్సవం ఒక్కటే కాదు.. చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఆలయ గోపురం, శిల్పాలు, పురాతన నిర్మాణాలు ఆసక్తి కలిగిస్తాయి. పశ్చిమ కనుమల సమీపంలో ఉండటం వల్ల ప్రకృతి అందాలనూ ఆస్వాదించవచ్చు. శ్రీవిల్లిపుత్తూరుకు సమీపంలోని శతురగిరి కొండలు మరో ప్రత్యేక ఆకర్షణ. అక్కడి పర్యటనకు అటవీ శాఖ అనుమతులు, స్థానిక పరిస్థితులపై ముందస్తు సమాచారం తెలుసుకోవడం మంచిది. ఒకవైపు ఆండాళ్ అమ్మవారి దర్శనం.. మరోవైపు దక్షిణ భారత ఆలయ శిల్పకళ.. ఇంకోవైపు పశ్చిమ కనుమల ప్రకృతి. అందుకే శ్రీవిల్లిపుత్తూరు భక్తి పర్యాటకానికి చక్కటి గమ్యస్థానం.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి?
శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఉంది. మదురై నుంచి సుమారు 74 కిలోమీటర్లు, విరుదునగర్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవిల్లిపుత్తూరుకు రైల్వే సదుపాయం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా ఎక్కువగా రైళ్లు అందుబాటు లేవు. మదురై, విరుదునగర్, రాజపాళయం తదితర స్టేషన్లకు చేరుకొని అక్కడి నుంచి శ్రీవిల్లిపుత్తూరుకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా చెన్నై, మదురై మీదుగా శ్రీవిల్లిపుత్తూరుకు చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా వెళ్తే మదురై, విరుదునగర్ మీదుగా శ్రీవిల్లిపుత్తూరు వెళ్లడం మంచిది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి బస్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి మదురై చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు, రైలులో శ్రీవిల్లిపుత్తూరు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి చెన్నైకి రైలుమార్గం ద్వారా చేరుకొని అక్కడి నుంచి మదురై వెళ్లి శ్రీవిల్లిపుత్తూరు చేరుకోవచ్చు. తిరుపతి నుంచి రైలు, రోడ్డు మార్గంలో చెన్నై–మదురై దిశగా ప్రయాణించి శ్రీవిల్లిపుత్తూరు చేరుకోవచ్చు. విమానంలో వెళ్లాలనుకునే వారు మదురైకి చేరుకొని రోడ్డుమార్గం ద్వారా వెళ్లొచ్చు. మదురై విమానాశ్రయానికి ఈ క్షేత్రం 74 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇవి మరిచిపోవద్దు..
మహారథోత్సవం రోజున భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత ముందుగానే ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. రైలు, బస్సు టికెట్లు ముందుగా బుక్ చేసుకోవడం, వసతి గదులు సైతం అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకోవడం మంచిది. ఆలయ అధికారిక సమాచారం ప్రకారం.. సాధారణంగా ఆలయ దర్శన వేళలు ఉదయం 5.45 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8.45 వరకు ఉంటాయి. అయితే ఉత్సవం రోజున ప్రత్యేక కార్యక్రమాల కారణంగా వేళల్లో మార్పులుంటాయి.
ఆండాళ్ కొలువైన నేల..
శ్రీవిల్లిపుత్తూరులో మహారథం కదిలే వేళ కనిపించేది కేవలం ఓ ఉత్సవ దృశ్యం కాదు. శతాబ్దాల భక్తి సంప్రదాయం, ఆండాళ్ సాహిత్య వారసత్వం, వైష్ణవ సంస్కృతి, దక్షిణ భారత ఆలయ శిల్పకళ అన్నీ ఒకే చోట కలిసిన దృశ్యం. ఆగస్టు 14న రథవీధుల్లోకి అడుగుపెడితే.. ఓ వైపు ఆండాళ్ అమ్మవారి నామస్మరణ.. మరోవైపు మహారథం వైభవం.. చుట్టూ భక్తజనం. అందుకే శ్రీవిల్లిపుత్తూరు మహారథోత్సవం ఓ ఉత్సవం మాత్రమే కాదు.. దక్షిణ భారత భక్తి సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభూతి చెందాలనుకునేవారికి ఓ ప్రత్యేక ప్రయాణంగా నిలుస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
- ●FSSAI | పిల్లల ఆహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త నిబంధనలు.. షుగర్, ఉప్పు, కొవ్వుకు పరిమితులు..
- ●Himachal Pradesh | హిమాచల్లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి
- ●KBR Park | వాహనదారులరా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే
- ●RanaBaali | రణబాలి వాయిదా - రష్మికనే కారణమా ? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
- ●Polymer Notes | రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్సిగ్నల్

CM Revanth Reddy | పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

FSSAI | పిల్లల ఆహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త నిబంధనలు.. షుగర్, ఉప్పు, కొవ్వుకు పరిమితులు..

Himachal Pradesh | హిమాచల్లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి

KBR Park | వాహనదారులరా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే






