త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Edhamma Thalli Bonala Jathara | భ‌క్తుల కొంగుబంగారం కొల్లాపూర్ ఈద‌మ్మ దేవ‌త‌.. రేప‌ట్నుంచి జాత‌ర ప్రారంభం

Edhamma Thalli Bonala Jathara | భ‌క్తుల కొంగు బంగార‌మైన కొల్లాపూర్ ప‌ట్ట‌ణ శివారులోని ఈద‌మ్మ దేవ‌త ఉత్స‌వాలు రేప‌ట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన ఊర బోనాలాతో ఉత్స‌వాలు ప్రారంభం కాగా, 10వ తేదీన షిడే వారంతో జాత‌ర ప్రారంభం కానుంది.

S

Devotional | Published On Feb 9, 2026, 12.31 pm IST

Edhamma Thalli Bonala Jathara | భ‌క్తుల కొంగుబంగారం కొల్లాపూర్ ఈద‌మ్మ దేవ‌త‌.. రేప‌ట్నుంచి జాత‌ర ప్రారంభం
Advertisement

Edhamma Thalli Bonala Jathara | త్రినేత్ర‌.న్యూస్ : భ‌క్తుల కొంగు బంగార‌మైన కొల్లాపూర్ ప‌ట్ట‌ణ శివారులోని ఈద‌మ్మ దేవ‌త ఉత్స‌వాలు రేప‌ట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన ఊర బోనాలాతో ఉత్స‌వాలు ప్రారంభం కాగా, 10వ తేదీన షిడే వారంతో జాత‌ర ప్రారంభం కానుంది. ఈ జాత‌ర మ‌రో రెండు మంగ‌ళ‌వారాలు క‌నుల పండువ‌గా కొన‌సాగ‌నుంది.

ఉత్స‌వాల్లో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన షిడె మ‌హోత్స‌వం ఫిబ్ర‌వ‌రి 10న మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మ‌యంలో త‌ప్పెట్ల ద‌రువుల మ‌ధ్య‌.. శివ‌స‌త్తులు పూన‌కాల‌తో ఊగిపోనున్నారు. ఇక షిడెపై పూజారి.. పొడ‌వైన క‌ర్ర చివ‌న గొర్రెను క‌ట్టి మ‌ధ్య‌లో తెల్ల‌చీర‌, జాకెట్ ధ‌రించి విధ‌వ‌రాలి వేష‌ధార‌ణ‌లో నిల్చోని భ‌క్తుల‌పై బండారు చ‌ల్లుతూ గుడి చుట్టూ ఊరేగించ‌నున్నారు. ఇక షిడెను తాకితే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. ఈ క్ర‌మంలో షిడెను తాకేందుకు భ‌క్తులు పోటీ ప‌డుతారు.

ఇత‌ర జిల్లాల నుంచి భ‌క్తుల రాక‌

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూల్, ప్ర‌కాశం జిల్లాల నుంచి భ‌క్తులు వేల సంఖ్య‌లో త‌ర‌లిరానున్నారు. ఈద‌మ్మ త‌ల్లీ.. దీవించ‌మ్మా అంటూ భ‌క్తులు ప్రార్థించ‌నున్నారు. మ‌హిళ‌లు బోనాల‌తో మొక్కులు స‌మ‌ర్పించుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి భక్తులు ఇక్కడికొచ్చి నైవేద్యం సిద్ధం చేయడంతోపాటు కోళ్లు, పొట్టేళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుంటారు.

ఈద‌మ్మ జాత‌ర నేప‌థ్యం ఇదే..

సురభి రాజుల సంస్థానంలో ప్రజలను ప్లేగు వ్యాధి నుండి కాపాడితే ఈదమ్మ తల్లికి గుడి నిర్మాణం చేపడతానని సురభి సంస్థానాధీశులు ముడుపు కట్టారు. దీంతో సంస్థానంలో ప్లేగు వ్యాధులు తగ్గడంతో సున్నపు గచ్చుతో అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్టించారు. వందల సంవత్సరాల క్రితం ఈదమ్మ తల్లి కొల్లాపూర్ ప్రజలకే కాక సమీప గ్రామాల ప్రజలకు ఇలవేల్పుగా మారింది. ఇక ప్ర‌తి ఏడాది ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో కోట మైస‌మ్మ‌, పోచ‌మ్మ బోనాల‌తో ఈద‌మ్మ జాత‌ర ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ జాత‌ర‌కు సుర‌భి రాజుల వంశ‌స్థులు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయ‌కులు హాజ‌రువుతుంటారు.

కృష్ణ శిల రాయితో అమ్మ‌వారి విగ్ర‌హం..

గత కొన్ని దశాబ్దాలుగా ఆలయం శిథిల వ్యవస్థకు చేరడంతో పాటు అమ్మవారి విగ్రహం కండనం జరిగింది. కండనం జరిగిన విగ్రహానికి పూజలు జరగడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని కొల్లాపూర్ ప్రజలు, రైతులు ఆలయ పునర్ నిర్మాణం చేపట్టడం కోసం ఎంతో ప్రయత్నించారు. ఎంతోమంది నాయకులు చుట్టు తిరిగిన ఆలయం పునర్నిర్మాణం కోసం ఎవ‌రు ముందుకు రాలేదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి రావడంతో విగ్రహంతో పాటు నా సొంత నిధులతో ఆలయ పున:నిర్మాణం చేపడతానని ముందుకొచ్చి 2022లో పనులు ప్రారంభించారు. మహాబలిపురంలో కృష్ణశిల రాయితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావడంతో 2025 జ‌న‌వ‌రి 29న గణపతి పూజతో ఆలయ ప్రతిష్ట కార్యక్రమం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

Advertisement
Advertisement