త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anivara Asthanam | శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్థానం.. క‌నుల‌పండువ‌గా ప‌ల్ల‌కీసేవ‌

Anivara Asthanam | తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం వేడుకలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. ఉదయం బంగారువాకిలి ఎదుటి ఘంటా మండపంలో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు.

P

Devotional | Published On Jul 17, 2026, 8.21 pm IST

Anivara Asthanam | శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్థానం.. క‌నుల‌పండువ‌గా ప‌ల్ల‌కీసేవ‌
Advertisement

Anivara Asthanam | తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం వేడుకలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. ఉదయం బంగారువాకిలి ఎదుటి ఘంటా మండపంలో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. స్వామివారికి ఎదురుగా గరుత్మంతుడిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో పీఠంపై విష్వక్సేనులవారిని దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు విశేష పూజలు, నైవేద్యాలు సమర్పించారు.

ఆ తర్వాత పెద్ద జీయర్‌స్వామి వెండి పళ్లెంలో ఆరు పట్టువస్త్రాలను తలపై ధరించి మంగళవాయిద్యాల మధ్య ఆలయానికి చేరుకున్నారు. చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. తీసుకొచ్చిన పట్టువస్త్రాల్లో నాలుగింటిని మూలవిరాట్టుకు, ఒక్కొక్కటి చొప్పున మలయప్పస్వామివారు, విష్వక్సేనులవారికి అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం ధరించి స్వామివారి నుంచి బియ్యపు దక్షిణ స్వీకరించారు. అనంతరం జీయర్‌స్వాములు, టీటీడీ ఈవోకు ఆలయ తాళాల గుత్తి అయిన ‘లచ్చన’ను అందించారు. పలు ఆధ్యాత్మిక మర్యాదల అనంతరం ఆ తాళాల గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం కార్యక్రమం ముగిసింది.

వార్షిక లెక్కలకు శ్రీకారం చుట్టే పర్వదినం

ఆణివార ఆస్థానం ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీ. తమిళ కాలమానం ప్రకారం ఆణి మాసం ముగింపు రోజున జరిగే కొలువు కావడంతో దీనికి ‘ఆణివార ఆస్థానం’ అనే పేరు వచ్చింది. గతంలో ఈ పర్వదినం నుంచే టీటీడీ ఆదాయ, వ్యయాలు, నిల్వల వార్షిక లెక్కలను ప్రారంభించే సంప్రదాయం ఉండేది. అనంతరం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత వార్షిక బడ్జెట్‌ను మార్చి–ఏప్రిల్ ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా మార్చారు. సాయంత్రం మలయప్పస్వామివారు, అమ్మవార్లు పుష్ప పల్లకీపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

శ్రీరంగం నుంచి శ్రీవారికి పట్టువస్త్రాలు..

ఆణివార ఆస్థానం సందర్భంగా తమిళనాడులోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. తిరుమలలోని పెద్ద జీయర్‌స్వామి మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో పాటు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి రమేష్, కమిషనర్ వినయ్ పాల్గొని స్వామివారికి వస్త్రాలను సమర్పించారు.

Advertisement
Advertisement