త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana-Germany Partnership | తెలంగాణ-జ‌ర్మ‌నీ మ‌ధ్య కీల‌క ఒప్పందం.. పెట్టుబ‌డులకు ముందుకువ‌చ్చిన తురింగియా..!

Telangana-Germany Partnership | హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం–జర్మనీ తురింగియా రాష్ట్రాల మధ్య కీలక అంతర్జాతీయ భాగస్వామ్యం కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన నేపథ్యంలో టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సహకారానికి ఇరు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

P

Telangana | Published On Jun 3, 2026, 6.57 pm IST

Telangana-Germany Partnership | తెలంగాణ-జ‌ర్మ‌నీ మ‌ధ్య కీల‌క ఒప్పందం.. పెట్టుబ‌డులకు ముందుకువ‌చ్చిన తురింగియా..!
Advertisement

Telangana-Germany Partnership | హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం–జర్మనీ తురింగియా రాష్ట్రాల మధ్య కీలక అంతర్జాతీయ భాగస్వామ్యం కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన నేపథ్యంలో టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సహకారానికి ఇరు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జర్మనీ తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, కార్మిక‌శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామితో పాటు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తురింగియా సీఎం మారియో వోయిట్ తెలంగాణ అభివృద్ధి, ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన “తెలంగాణ రైజింగ్–2047” విజన్‌ను అభినందిస్తూ, భారత–జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంతో భాగస్వామ్యం తమకు గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ప్రపంచ ఉపాధి రంగంలో వేగవంతమైన మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), పాలిటెక్నిక్ కళాశాలల బోధన విధానాల్లో మార్పులకు తురింగియా సహకారం కోరారు. దీనికి స్పందించిన తురింగియా సీఎం, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రూపొందించేందుకు తమ పరిశ్రమలు, విద్యాసంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జర్మన్ పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ ఆధారంగా శిక్షణను రూపుదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. తెలంగాణ యువత గ్లోబల్ స్థాయిలో రాణిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీ సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో హైదరాబాద్ యువత కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జర్మన్ భాషా శిక్షణను విస్తరించేందుకు సహకరించాలని తురింగియా ప్రతినిధులను కోరారు.

భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూపొందిస్తున్న “భారత్ ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును కూడా సీఎం వివరించారు. ఫార్చ్యూన్–500 కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందుతోందని తెలిపారు. ఇక సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడుల అవకాశాలపై తురింగియా సీఎం ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు సిద్ధమని తెలిపారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక అంతర్జాతీయ సెమీకండక్టర్ సంస్థలు పనిచేస్తున్నాయని, తయారీ రంగంలో కూడా తెలంగాణ త్వరలో ముందంజ వేస్తుందని చెప్పారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ ఇప్పటికే కొనసాగుతోందని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్యాలు అందిస్తున్నామని వివరించారు. ఈ ఒప్పందం ద్వారా టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో తెలంగాణకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న తెలంగాణతో జర్మనీ రాష్ట్రం భాగస్వామ్యం కావడం రాష్ట్ర ప్రాధాన్యతను మరింత పెంచిందని అధికారులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో తురింగియా స్టేట్ సెక్రటరీలు డా. టైచార్ట్, సకెర్ట్, జర్మన్ కాన్సుల్ జనరల్ హాస్పర్ సహా వివిధ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అలాగే సీఎస్ రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక పాల్గొన్నారు.

Advertisement
Advertisement