త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanath Jayasuriya | టీ20 వ‌రల్డ్‌క‌ప్‌లో శ్రీ‌లంక పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌.. కోచ్‌గా త‌ప్పుకోనున్న జ‌య‌సూర్య‌..

Sanath Jayasuriya | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో శ్రీ‌లంక జ‌ట్టు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ టీమ్ ప్ర‌ధాన కోచ్ స‌న‌త్ జ‌య‌సూర్య త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. శ‌నివారం పాకిస్థాన్‌తో శ్రీ‌లంక ఆడిన సూప‌ర్ 8 మ్యాచ్ అనంత‌రం ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

S

Cricket | Published On Mar 1, 2026, 9.49 am IST

Sanath Jayasuriya | టీ20 వ‌రల్డ్‌క‌ప్‌లో శ్రీ‌లంక పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌.. కోచ్‌గా త‌ప్పుకోనున్న జ‌య‌సూర్య‌..
Advertisement

Sanath Jayasuriya | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో శ్రీ‌లంక జ‌ట్టు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ టీమ్ ప్ర‌ధాన కోచ్ స‌న‌త్ జ‌య‌సూర్య త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. శ‌నివారం పాకిస్థాన్‌తో శ్రీ‌లంక ఆడిన సూప‌ర్ 8 మ్యాచ్ అనంత‌రం ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ మ్యాచ్‌లో శ్రీ‌లంక కెప్టెన్ ద‌సున్ శ‌న‌క చివ‌రి బంతి వ‌ర‌కు పోరాటం చేసిన‌ప్ప‌టికీ శ్రీ‌లంక 5 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌కు ముందు టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన శ్రీ‌లంక చివ‌రి పోరులో అయినా గెలుపొంది ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావించింది. కానీ అది సాధ్యం కాలేదు. మ‌రోవైపు పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

బోర్డుతో మాట్లాడి చెబుతా..

శ్రీ‌లంక‌-పాకిస్థాన్ సూప‌ర్ 8 మ్యాచ్ అనంత‌రం జ‌య‌సూర్య మాట్లాడుతూ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మంచి ముగింపును ఆశించామ‌ని, కానీ అది సాధ్యం కాలేద‌ని అన్నారు. త‌న బాధ్య‌త‌ల‌ను ఇప్పుడు మ‌రొక‌రికి అప్ప‌గించాల‌ని చూస్తున్నాన‌ని, ఆ మేర నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, అందుకు స‌మ‌యం వ‌చ్చింద‌ని కూడా భావిస్తున్నాన‌ని తెలిపారు. ఇంగ్లండ్ సిరీస్ స‌మ‌యంలోనే తాను ఎక్కువ కాలం కొన‌సాగబోన‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు. ఎక్కువ కాలం తాను కోచ్‌గా ప‌నిచేయ‌లేన‌ని, త‌న భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌పై శ్రీ‌లంక క్రికెట్ బోర్డుతో చ‌ర్చిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న కాంట్రాక్టు జూన్‌లో ముగుస్తుంద‌ని, అయిన‌ప్ప‌టికీ ఇంకా అధికారికంగా నిర్ణ‌యాన్ని తెలియ‌జేయ‌లేద‌ని చెప్పారు. బోర్డుతో మాట్లాడాక ఇక‌పై ఏం చేయాలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు.

సూప‌ర్ 8లో శ్రీ‌లంక వ‌రుస ఓట‌ములు..

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో శ్రీ‌లంక క‌ష్ట‌ప‌డి సూప‌ర్ 8 ద‌శ‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ గ్రూప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌లేక‌పోయింది. తొలుత ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 51 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాల‌వ‌గా, న్యూజిలాండ్ చేతిలోనూ 61 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. శ‌నివారం పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పోరాటం చేసినా 5 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీ‌లంక కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌, ప‌వ‌న్ ర‌త‌నాయ‌కె అర్ధ శ‌త‌కాలు సాధించారు. అయిన‌ప్ప‌టికీ విజ‌యం ద‌క్క‌లేదు. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌ను కోల్పోయి 212 ప‌రుగులు చేసింది. అయితే వారు సెమీస్‌కు క్వాలిఫై అవ్వాలంటే శ్రీ‌లంక‌ను 147 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయిన‌ప్ప‌టికీ శ్రీ‌లంక బ్యాట‌ర్లు విజృంభించారు. దీంతో పాక్ సెమీస్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. ఇక సెమీస్ లోకి చేర‌లేమ‌ని తెలిసిన పాక్ క‌నీసం మ్యాచ్‌లో అయినా గెలుద్దామ‌ని ఆశ‌ప‌డింది. కానీ లంక బ్యాట‌ర్లు చివ‌రి బంతి వ‌ర‌కు పోరాటం చేశారు. అయిన‌ప్ప‌టికీ స్వ‌ల్ప తేడాతో ల‌క్ష్యాన్ని చేరుకోలేక‌పోయారు. ఇక ఈ గ్రూప్ నుంచి ఇప్ప‌టికే ఇంగ్లండ్ సెమీ ఫైన‌ల్‌కు క్వాలిఫై అవ‌గా, శ్రీ‌లంక‌-పాక్ మ్యాచ్ ఫ‌లితంతో న్యూజిలాండ్ కు సెమీస్ బెర్తు ఖాయం అయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement