త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 Ads | ఈసారి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌ల‌కు త‌గ్గిన ప్ర‌క‌ట‌న‌లు.. 3 శాతం మేర క్షీణ‌త‌..

IPL 2026 Ads | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ప్రారంభ మ్యాచ్‌లలో టెలివిజన్ ప్రకటనల (యాడ్స్‌) వ్యయం స్వల్పంగా తగ్గినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వర్షం కారణంగా మధ్యలో నిలిచిపోయిన మ్యాచ్‌లు, మధ్యాహ్నం ప్రసారాల్లో తక్కువ ఖర్చులు వంటి అంశాలు ఇందుకు కార‌ణంగా తేలింది.

S

Sports | Published On Apr 11, 2026, 1.20 pm IST

IPL 2026 Ads | ఈసారి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌ల‌కు త‌గ్గిన ప్ర‌క‌ట‌న‌లు.. 3 శాతం మేర క్షీణ‌త‌..
Advertisement

IPL 2026 Ads | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ప్రారంభ మ్యాచ్‌లలో టెలివిజన్ ప్రకటనల (యాడ్స్‌) వ్యయం స్వల్పంగా తగ్గినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వర్షం కారణంగా మధ్యలో నిలిచిపోయిన మ్యాచ్‌లు, మధ్యాహ్నం ప్రసారాల్లో తక్కువ ఖర్చులు వంటి అంశాలు ఇందుకు కార‌ణంగా తేలింది. విస్తృత ఆర్థిక ఒత్తిళ్లు, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ల గైర్హాజరీ కూడా ఈ తగ్గుదలపై ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే టోర్నమెంట్ ముందుకు సాగేకొద్దీ ఈ పరిస్థితి మారే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రకటనల విభాగాల్లో కూడా మార్పులు వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. IPL తొలి 13 మ్యాచ్‌లలో టెలివిజన్ ప్రకటనల వాల్యూమ్ (సంఖ్య‌) 3 శాతం తగ్గింది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జర‌గాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం, అలాగే మధ్యాహ్నం మ్యాచ్‌ల సమయంలో తక్కువ ప్రకటన ఖర్చులు ఈ తగ్గుదలకు కార‌ణ‌మ‌య్యాయి. ఈ వివరాలను TAM AdEx వెల్లడించింది.

యుద్ధం, ఫాంట‌సీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లు..

విస్తృత స్థాయి ఆర్థిక పరిస్థితులు కూడా ఈ మందగమనానికి కారణమయ్యాయి. ప‌శ్చిమ‌ ఆసియా యుద్ధం కారణంగా FMCG, ఆహార, పానీయాల రంగాలకు చెందిన ప్రకటనదారులు ప్రభావితమయ్యారని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా సీజన్‌కు విరుద్ధంగా వచ్చిన వర్షాలు, పానీయాలు, ఎయిర్ కండిషనర్లు వంటి సీజనల్ ఉత్పత్తుల డిమాండ్‌ను దెబ్బతీశాయి. ఇక రియల్ మనీ గేమింగ్ (RMG) పై నియంత్రణ చర్యల నేపథ్యంలో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లు లేక‌పోవడం కూడా ప్రకటనల వ్యయంపై ఒత్తిడిని పెంచింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్రాండ్లు చేసిన ఖర్చులు కొంత మేర తగ్గుదల ప్రభావాన్ని సమతుల్యం చేశాయి.

త‌గ్గిన ప్ర‌క‌ట‌న‌దారుల సంఖ్య..

TAM AdEx డేటా ప్రకారం ప్రకటనల విభాగాల సంఖ్య 22 శాతం తగ్గి కేవలం 40కు పైగా మాత్రమే నమోదైంది. ప్రకటనదారుల సంఖ్య కూడా 31 శాతం తగ్గి 45కు పైగా మాత్రమే ఉంది. గత సంవత్సరం IPL 2025లో కనిపించిన ఈ-కామర్స్ గేమింగ్, స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాన్స్, ఎయిర్‌లైన్స్, రియల్ ఎస్టేట్ వంటి విభాగాలు ఈ సీజన్‌లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో TAM మీడియా సీఈవో ఎల్.వి. కృష్ణన్ మాట్లాడుతూ IPL ప్రారంభం అయి రెండు వారాలే అయ్యాయ‌ని, ఇది మొత్తం టోర్నమెంట్‌లో సుమారు 25 శాతం మాత్రమేన‌ని అన్నారు. ప్రారంభంలో కనిపించిన 3 శాతం తగ్గుదల సులభంగా భ‌ర్తీ అవుతుంద‌న్నారు. ప్రస్తుతం విభాగాలు, ప్రకటనదారుల విషయంలో ధరలు, ఇన్వెంటరీ అందుబాటుతో నెమ్మదిగా ప్ర‌క‌ట‌న‌ల సంఖ్య పెరుగుతుంద‌ని తెలిపారు. పెద్ద స్థాయి ప్రకటనదారులు అధిక రీచ్, ఎంగేజ్‌మెంట్ కోసం లీనియర్ టీవీ ఇన్వెంటరీపై ఆధిపత్యం చెలాయిస్తార‌ని తెలిపారు.

పెరిగిన మౌత్ ఫ్రెష‌న‌ర్ విభాగం యాడ్స్‌..

చిన్న విభాగాలకు చెందిన ప్రకటనదారులు తక్కువ ఖర్చుతో నిర్దిష్ట ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకునే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లే అవకాశముందని ఆయన అన్నారు. ప్రస్తుత తగ్గుదలను ఈ కోణంలో చూడాలని, డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను కలిపి చూస్తే మొత్తం ప్రకటనల రంగంలో వృద్ధి కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రకటనల విభాగాల మిశ్రమంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ-కామర్స్ సేవలు, డిజిటల్ వాలెట్లు, పెయింట్స్, ఫైనాన్షియల్ సంస్థలు ఇప్పుడు ప్రధాన ప్రకటనదారులుగా నిలుస్తున్నాయి. గతేడాది ప్రధానంగా ఉన్న గేమింగ్, బిస్కెట్లు, ఆటోమొబైల్, స్మార్ట్‌ఫోన్ విభాగాలు ఈసారి వెనుకబడినట్లు కనిపిస్తోంది. మౌత్ ఫ్రెషనర్ విభాగం ఈసారి అత్యధిక ప్రాధాన్యం సాధించింది. టెలివిజన్ ప్రకటనలలో దీని వాటా 11 నుంచి 14 శాతానికి పెరిగింది. ఓ ప్రముఖ సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ ప‌శ్చిమ‌ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధన ధరలు పెరగడం, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల FMCG విభాగం ప్రభావితమైంద‌ని తెలిపారు. అందువల్లే ఈసారి ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభంలో ప్ర‌క‌ట‌న‌ల సంఖ్య త‌గ్గింద‌ని, కానీ ఐపీఎల్ కొన‌సాగేకొద్దీ ఇది పెరుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement