త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OFS అంటే ఏమిటి? షేర్ల విక్రయానికి కంపెనీలు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి?

OFS | స్టాక్ ఎక్స్చేంజ్ వేదిక ద్వారా ఇప్పటికే లిస్టెడ్ కంపెనీల్లో ఉన్న ప్రస్తుత వాటాదారులు ప్రమోటర్లు, ప్రభుత్వ సంస్థలు లేదా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ వాటాను విక్రయించేందుకు ఉపయోగించే విధానాన్ని ఆఫర్ ఫర్ సేల్ (OFS) అంటారు. ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)తో పోలిస్తే భిన్నమైన ప్రక్రియ. ఎందుకంటే OFSలో కొత్త షేర్ల‌ను జారీ చేయరు.

S

Business | Published On May 29, 2026, 1.32 pm IST

OFS అంటే ఏమిటి? షేర్ల విక్రయానికి కంపెనీలు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి?
Advertisement

OFS | స్టాక్ ఎక్స్చేంజ్ వేదిక ద్వారా ఇప్పటికే లిస్టెడ్ కంపెనీల్లో ఉన్న ప్రస్తుత వాటాదారులు ప్రమోటర్లు, ప్రభుత్వ సంస్థలు లేదా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ వాటాను విక్రయించేందుకు ఉపయోగించే విధానాన్ని ఆఫర్ ఫర్ సేల్ (OFS) అంటారు. ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)తో పోలిస్తే భిన్నమైన ప్రక్రియ. ఎందుకంటే OFSలో కొత్త షేర్ల‌ను జారీ చేయరు. అందువల్ల కంపెనీకి కొత్తగా మూలధనం సమకూరదు. OFS సమయంలో ఇప్పటికే ఉన్న షేర్ల యాజమాన్యం విక్రయదారులైన వాటాదారుల నుంచి కొత్త పెట్టుబడిదారులకు బదిలీ అవుతుంది. ఈ విక్రయం ద్వారా వచ్చే డబ్బు నేరుగా వాటా విక్రయిస్తున్న షేర్‌హోల్డర్లకే వెళ్తుంది. కంపెనీకి మాత్రం ఆ నిధులు అందవు. OFSలో కొత్త షేర్ల జారీ ఉండదు. దీంతో కంపెనీ ఈక్విటీ డైల్యూషన్ జరగదు. ఈ ప్రక్రియను స్టాక్ ఎక్స్చేంజ్‌లో ప్రత్యేక బిడ్డింగ్ విండో ద్వారా నిర్వహిస్తారు. పెట్టుబడిదారులు విక్రేత నిర్ణయించిన ఫ్లోర్ ప్రైస్ లేదా అంతకంటే ఎక్కువ ధరకు బిడ్లు సమర్పించవచ్చు.

OFS ఎందుకు..

OFS అమలు వేగంగా పూర్తయ్యే విధానంగా గుర్తింపు పొందింది. ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్ (FPOలు) లేదా IPOలతో పోలిస్తే, ఇవి కొన్ని రోజులు లేదా వారాలు పట్టే అవ‌కాశాలు ఉంటాయి. అయితే OFS సాధారణంగా ఒకే ట్రేడింగ్ రోజులో ముగుస్తుంది. OFS ప్రారంభించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి నియంత్రణ సంస్థల ప్రజా వాటాదారుల నిబంధనలను పాటించడం. భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టెడ్ కంపెనీలు కనీసం 25 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను కలిగి ఉండాలని సెబీ (SEBI) నిర్దేశించింది. ఈ నిబంధనను పాటించేందుకు ప్రమోటర్లు తమ వాటాను తగ్గించడానికి OFS మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అదే విధంగా ప్రారంభ దశ పెట్టుబడిదారులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, కంపెనీ వ్యవస్థాపకులు తమ పెట్టుబడులను పూర్తిగా లేదా కొంతమేర విక్రయించేందుకు కూడా OFSను వినియోగిస్తారు. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను తగ్గించే డిస్ఇన్వెస్ట్‌మెంట్ కార్యక్రమాల్లో OFSను తరచూ ఉపయోగిస్తుంటాయి.

మార్కెట్లు ఎలా చూస్తాయి..

ఐటీఐ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ సీఎఐఓ, మేనేజింగ్ పార్ట్నర్ మోహిత్ గులాటి మాట్లాడుతూ OFS ద్వారా ఇప్పటికే లిస్టెడ్ కంపెనీలో ఉన్న వాటాదారులు తమ వాటాను ప్రజా పెట్టుబడిదారులకు విక్రయిస్తారని, విక్రయం ద్వారా వచ్చే ఆదాయం కంపెనీకి కాకుండా విక్రయించే వాటాదారులకే వెళ్తుందని చెప్పారు. ప్రైవేట్ ఈక్విటీ లేదా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడిదారులు చేసే OFS లావాదేవీలను సాధారణంగా మార్కెట్ సానుకూలంగా చూస్తుంది. ఎందుకంటే ఆ వ్యాపారం పరిపక్వ దశకు చేరుకుందని, ప్రారంభ పెట్టుబడిదారుల నుంచి ఇకపై ఆర్థిక సహాయం అవసరం లేదనే సంకేతంగా దీన్ని పరిగణిస్తారు. 2021లో జొమాటో IPO సమయంలో ఇన్ఫో ఎడ్జ్ తన వాటాలో కొంత భాగాన్ని OFS ద్వారా విక్రయించింది. మార్కెట్ దీనిని కంపెనీ దీర్ఘకాలిక భవిష్యత్తుపై విశ్వాసానికి సంకేతంగా భావించింది.

ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో జ‌రిగితే..

అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం చేపట్టే OFS లావాదేవీలను పెట్టుబడిదారులు భిన్నంగా చూస్తారని గులాటి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంకా మెజారిటీ వాటాను కొనసాగిస్తుంటే, భవిష్యత్తులో మరిన్ని వాటాల విక్రయాలు జరిగే అవకాశం ఉందనే ఆందోళన పెట్టుబడిదారుల్లో ఉంటుంది. ముఖ్యంగా డిస్ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు ఉన్నప్పుడు ఈ భయం మరింత పెరుగుతుంది. మార్కెట్‌లో అధిక సరఫరా వచ్చే అవకాశం ఉందనే భావన షేర్ ధరలపై దీర్ఘకాల ప్రభావం చూపుతుంద‌ని ఆయన వివరించారు. పెట్టుబడిదారులు విక్రయం చేస్తున్నది ఎవరు, ఎంత శాతం వాటా విక్రయిస్తున్నారు, విక్రయం తర్వాత వారి వద్ద ఎంత వాటా మిగులుతుంది, విక్రయానికి గల కారణం ఏమిటి వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement