త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Mallya | బ్రిటన్‌ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..

Vijay Mallya | లిక్కర్‌ వ్యాపారి, విజయ్ మాల్యా మరోసారి తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తనను భగోడా అంటూ భారత్‌కు తిరిగి రావడానికి నిరాకరిస్తున్న వ్యక్తిగా చిత్రీకరించడం సరికాదని అన్నారు. తాను 1992 నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌లో శాశ్వత నివాసిగా ఉన్నానని, ప్రస్తుతం బ్రిటన్‌ నుంచి బయటకు వెళ్లకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని మాల్యా ఎక్స్‌లో పెట్టిన‌ పోస్టులో పేర్కొన్నారు.

S

Business | Published On Sep 9, 2026, 1.25 pm IST

Vijay Mallya | బ్రిటన్‌ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Vijay Mallya | లిక్కర్‌ వ్యాపారి, విజయ్ మాల్యా మరోసారి తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తనను భగోడా అంటూ భారత్‌కు తిరిగి రావడానికి నిరాకరిస్తున్న వ్యక్తిగా చిత్రీకరించడం సరికాదని అన్నారు. తాను 1992 నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌లో శాశ్వత నివాసిగా ఉన్నానని, ప్రస్తుతం బ్రిటన్‌ నుంచి బయటకు వెళ్లకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని మాల్యా ఎక్స్‌లో పెట్టిన‌ పోస్టులో పేర్కొన్నారు. ఇదే తరహా వాదనను మాల్యా గతంలో బాంబే హైకోర్టులోనూ వినిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు హాజరైన సమయంలో, ఇంగ్లాండ్‌, వేల్స్‌ కోర్టులు తనపై దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించాయని, అంతర్జాతీయ ప్రయాణ పత్రం కోసం దరఖాస్తు చేయడం లేదా దానిని కలిగి ఉండటంపైనా నిషేధం ఉందని తెలిపారు. అందువల్ల తాను ఎప్పుడు భారత్‌కు తిరిగి వస్తానో నిర్దిష్టంగా చెప్పలేనని మాల్యా కోర్టుకు వివరించారు.

ప‌ట్టిక‌ను షేర్ చేసిన మాల్యా..

అయితే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం, 2018ను సవాల్‌ చేయాలంటే భారత్‌కు తిరిగి రావాల్సిందేనని బాంబే హైకోర్టు మాల్యాకు స్పష్టం చేసింది. భారత న్యాయస్థానాల పరిధిని తప్పించుకుంటూనే అదే కోర్టుల నుంచి ఉపశమనం కోరలేరని పేర్కొంది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించేందుకు జరిగిన ప్రక్రియతోపాటు, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టంలోని కొన్ని నిబంధనలను కూడా మాల్యా సవాల్‌ చేస్తున్నారు. మరో ఎక్స్‌ పోస్టులో మాల్యా మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బాంబే హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసినట్లు చెబుతున్న అఫిడవిట్‌ను ప్రస్తావిస్తూ, తన నుంచి రూ.14,131.60 కోట్లను రికవరీ చేసినట్లు అందులో ఉందని పేర్కొన్నారు. రికవరీకి సంబంధించిన ఖాతా వివరాలుగా పేర్కొంటూ ఒక పట్టికను కూడా మాల్యా షేర్‌ చేశారు. న్యాయమైన, సరైన లెక్కలపై నమ్మకం ఉన్నవారు ఆ పట్టికను పరిశీలించాలని ఆయన కోరారు. తనను మీడియా ప్రతి వార్త ప్రారంభంలోనే మోసగాడిగా పేర్కొనడం సమంజసమా అని ప్రశ్నించారు. తనకు తిరిగి చెల్లించాల్సిన మొత్తంపై కూడా ప్రశ్నలు అడగాలని మాల్యా అన్నారు.

రూ.6వేల కోట్ల రుణానికి, రూ.14వేల కోట్ల రిక‌వ‌రీ..?

ఈడీ జప్తు చేసిన తన ఆస్తులు, నిధుల్లో నుంచి రూ.350 కోట్లకు పైగా కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులకు చెల్లించేందుకు విడుదల చేసినట్లు కూడా మాల్యా పేర్కొన్నారు. ఈడీ తన ఆస్తులు, నిధులను జప్తు చేయడం వల్ల తాను ఉద్యోగులకు చెల్లించలేకపోయానని అన్నారు. ఆగస్టులోనూ మాల్యా ఇదే తరహాలో స్పందించారు. రూ.6,203 కోట్ల తీర్పు రుణానికి వ్యతిరేకంగా బ్యాంకులు, ప్రభుత్వం తన నుంచి సుమారు రూ.14,100 కోట్లను రికవరీ చేశాయని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న రుణాల విషయంలో న్యాయపరమైన ఒత్తిడి పెరుగుతున్న సమయంలో 2016 మార్చిలో మాల్యా భారత్‌ను విడిచిపెట్టారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన రుణాలకు సంబంధించి సీబీఐ కేసులు నమోదు చేసింది. 2018లో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మాల్యాపై ఆ చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. మరోవైపు, మాల్యాను భారత్‌కు అప్పగించాలని భారత ప్రభుత్వం యునైటెడ్ కింగ్‌డమ్‌ను కోరింది.

2019 ఫిబ్రవరిలో అప్పటి యూకే హోం సెక్రటరీ మాల్యా అప్పగింతకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ నిర్ణయాన్ని మాల్యా సవాల్‌ చేశారు. 2020 ఫిబ్రవరిలో యూకే హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం యూకే సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న మాల్యా అభ్యర్థనను కూడా తిరస్కరించింది. అయితే యూకేలో కొనసాగుతున్న ఇతర న్యాయపరమైన ప్రక్రియల కారణంగా అప్పగింత వ్యవహారం ఇప్పటికీ పూర్తిగా ముగియలేదు.

Advertisement
Advertisement