త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kharg Island | ఇరాన్ జీవ‌నాడిపై దాడి..! అమెరికా చ‌ర్య‌ల‌తో విధ్వంస‌కర ప‌రిణామాలు త‌ప్ప‌వా..?

Kharg Island | ప‌శ్చిమాసియాలో ఉద్రిక‌త్త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. యూఎస్‌-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై విరుచుకుప‌డుతున్నాయి. అయితే, ఇరాన్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాజాగా ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్‌లోని ఖార్గ్ దీవిపై అమెరికా దాడి జరిపినట్లు తెలుస్తోంది. దాంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమ‌య్యాయి.

P

Business | Published On Mar 14, 2026, 6.27 pm IST

Kharg Island | ఇరాన్ జీవ‌నాడిపై దాడి..! అమెరికా చ‌ర్య‌ల‌తో విధ్వంస‌కర ప‌రిణామాలు త‌ప్ప‌వా..?
Advertisement

Kharg Island | ప‌శ్చిమాసియాలో ఉద్రిక‌త్త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. యూఎస్‌-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై విరుచుకుప‌డుతున్నాయి. అయితే, ఇరాన్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాజాగా ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్‌లోని ఖార్గ్ దీవిపై అమెరికా దాడి జరిపినట్లు తెలుస్తోంది. దాంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమ‌య్యాయి. ఇరాన్ తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న దీవి ఇరాన్‌కు ఆర్థికంగా అత్యంత కీలకమైంది. పొడవు కేవలం ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉన్నప్పటికీ, ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు మొత్తం భాగం ఈ దీవి ద్వారానే జరుగుతుంది. ఇప్పటివరకు ఈ దీవిపై అమెరికా దాడి చేయలేదు. తాజాగా జరిగిన దాడిలో ఖార్గ్ దీవికి గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోష‌ల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇరాన్‌కు ఈ దీవి ఎందుకు కీల‌కం..?

ఖార్గ్ దీవి ఇరాన్‌లో అత్యంత సున్నితమైన ఆర్థిక ప్రాంతంగా భావిస్తారు. ఇక్క‌డ ఉన్న క్రూడాయిల్ ఎక్స్‌పోర్ట్స్ టర్మినల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోంది. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ దీవి నుంచే సాగుతుందని అంచనా. ఈ టర్మినల్స్ రోజుకు సుమారు 70 లక్షల బ్యారెల్ల ముడి చమురును లోడ్ చేసే సామర్థ్యముంది. ఈ దీవి చమురు వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండ‌డంతో ఇరాన్ ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఈ ఆదాయంతోనే ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం, సైన్యానికి జీతాలు చెల్లిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఖార్గ్ దీవిలో భారీ చమురు నిల్వ ట్యాంకులు సైతం ఉన్నాయి. దక్షిణ ఇరాన్‌లోని ప్రధాన చమురు క్షేత్రాల‌తో సముద్రపు అడుగు భాగంలో వేసిన పైప్‌లైన్ల ద్వారా ఈ దీవి అనుసంధానమై ఉంది. అందుకే దీన్ని ఇరాన్ ఆర్థిక ‘లైఫ్‌లైన్’గా పిలుస్తారు.

ట‌ర్మిన‌ల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా కంపెనీ..

ఖార్గ్ దీవిలోని చమురు ఎగుమతి టర్మినల్‌ను మొదట అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీ అమోకో అభివృద్ధి చేసింది. త‌ర్వాత 1979లో జరిగిన ఇరాన్ విప్లవం తర్వాత దీన్ని ఇరాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇరాన్ తీరప్రాంతంలో ఎక్కువగా అతి తక్కువ లోతు ఉన్న సముద్ర ప్రాంతం ఉంటుంది. దాంతో పెద్ద నౌకలు అక్కడ నిలవలేవు. అయితే, ఖార్గ్ దీవి సమీపంలో లోతైన సముద్రం ఉండడంతో భారీ చమురు ట్యాంకర్లు సులభంగా నిలిపే అవకాశం ఉంటుంది. అందువ‌ల్ల ఈ దీవి చమురు ఎగుమతులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. చమురు ఎగుమతులతో పాటు నిల్వ కేంద్రంగా సైతం ఖార్గ్ దీవి కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ సుమారు 1.8 కోట్ల బ్యారెల్స్ ముడి చమురు నిల్వ సామర్థ్యం ఉందని సమాచారం.

యుద్ధం మరింత తీవ్రం కావచ్చా?

ఖార్గ్ దీవి నుంచి ఎగుమతి అయ్యే చమురులో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ ఈ మార్గం ద్వారా చైనాకు చమురు విక్రయిస్తూ భారీ ఆదాయం సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఖార్గ్ దీవిపై దాడి జరిగితే ప్రపంచ చమురు సరఫరాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచానికి ఇది మరింత సమస్యలు తెచ్చిపెట్టే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఇరాన్ చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేయాలంటే అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించాల్సి వస్తుందని, ప్రస్తుతం అలాంటి నిర్ణయంపై ట్రంప్ సందిగ్ధంలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఖార్గ్ దీవి అంశం ఎంత సున్నితమైనదో ట్రంప్‌కి సైతం తెలుసున‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అందుకే యూఎస్ దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఖార్గ్ దీవిపై జరిగిన దాడికి ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ చమురు, ఆర్థిక మౌలిక వసతులపై దాడులు జరిగితే పశ్చిమ ఆసియాలో ఉన్న అమెరికా, అమెరికన్ కంపెనీల క్రూడ్ మౌలిక వసతులపై ప్ర‌తిదాడులు త‌ప్ప‌వ‌ని ఇరాన్ హెచ్చ‌రించింది.

Advertisement
Advertisement