త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | బ‌డ్జెట్ 2026 ఎఫెక్ట్‌.. నిఫ్టీ, సెన్సెక్స్ ఢ‌మాల్‌.. ద‌లాల్ స్ట్రీట్‌లో బ్ల‌డ్ బాత్‌..

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 1, 2026) పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ 2026 నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి.

S

Business | Published On Feb 1, 2026, 1.25 pm IST

Union Budget 2026 | బ‌డ్జెట్ 2026 ఎఫెక్ట్‌.. నిఫ్టీ, సెన్సెక్స్ ఢ‌మాల్‌.. ద‌లాల్ స్ట్రీట్‌లో బ్ల‌డ్ బాత్‌..
Advertisement

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 1, 2026) పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ 2026 నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. మార్కెట్లు ముందుగా పాజిటివ్ గానే ప్రారంభం అయిన‌ప్ప‌టికీ బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసే స‌రికి ఒక్క‌సారిగా భారీ ఎత్తున ప‌త‌నం అయ్యాయి. నిఫ్టీ 50 ఆదివారం సెష‌న్‌లో 25,329 వ‌ద్ద ప్రారంభం కాగా ఇంట్రా డే హై 25,440 న‌మోదు చేసింది. ఆ త‌రువాత మ‌ళ్లీ కోలుకోలేదు. ఈ క్ర‌మంలోనే బడ్జెట్ ప్ర‌సంగం ముగిసే స‌మయానికి నిఫ్టీ ఏకంగా 867 పాయింట్లు ప‌త‌నం అయి ఇంట్రా డే-లో ను న‌మోదు చేసింది. ఆ త‌రువాత కాస్తంత రిక‌వ‌రీ అయింది. ప్రస్తుతం నిఫ్టీ 25,086 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ఒక్క‌సారిగా పెరిగిన అమ్మ‌కాల ఒత్తిడి..

ఇక సెన్సెక్స్ విష‌యానికి వ‌స్తే ముందుగా 82,500 వద్ద ప్రారంభ‌మై ఆ త‌రువాత 82,715 ఇంట్రా డై హై న‌మోదు చేసింది. అనంత‌రం ఏకంగా 2800 పాయింట్లు ప‌త‌నం అయి ఇంట్రా డే-లో ను న‌మోదు చేసింది. మ‌ళ్లీ కాస్త రిక‌వ‌ర్ అయి ప్ర‌స్తుతం 82,420 వ‌ద్ద కొన‌సాగుతోంది. అయితే కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ప‌న్ను రాయితీల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు లేక‌పోవ‌డంతో పెట్టుబ‌డిదారులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలోనే బెంచ్ మార్క్ స్టాక్‌ల‌కు చెందిన సూచీలు భారీగా కుప్ప‌కూలాయి. ముఖ్యంగా నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగం అనంత‌రం మార్కెట్ లో ఒక్క‌సారిగా అమ్మ‌కాల ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయా సూచీలు భారీగా ప‌త‌నం అయ్యాయి.

టాప్ గెయిన‌ర్లు, టాప్ లూజర్లు..

కాగా బ‌డ్జెట్ ప్ర‌సంగం నేప‌థ్యంలో ఫార్మా రంగానికి కేంద్రం ఇచ్చిన ఊతం కార‌ణంగా ప‌లు ఫార్మా కంపెనీల షేర్లు పెరిగాయి. ఈ క్ర‌మంలోనే స‌న్ ఫార్మాసూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ షేర్ ధ‌ర 0.77 శాతం పెరిగి టాప్ గెయిన‌ర్‌గా నిలిచింది. అలాగే టీసీఎస్ షేర్ ధ‌ర 0.71 శాతం మేర లాభ ప‌డ్డాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లలో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు. మ‌రోవైపు భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ షేర్ ధ‌ర 6.50 శాతం మేర ప‌త‌నం అయింది. అలాగే ఎస్‌బీఐ 3.38 త‌గ్గుద‌ల న‌మోదు చేయ‌గా, ఎన్‌టీపీసీ షేర్ల ధ‌ర‌ల్లో 3.06 శాతం మేర త‌గ్గుద‌ల క‌నిపించింది. హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ షేర్లు 2.91 శాతం ప‌డిపోగా, బ‌జాజ్ ఎల‌క్ట్రానిక్స్ షేర్లు 2.50 శాతం మేర త‌గ్గాయి.

పెరిగిన ఎస్టీటీ చార్జిలే కార‌ణం..?

అయితే మార్కెట్లు కుప్ప‌కూల‌డానికి ఫ్యూచ‌ర్స్‌, ఆప్ష‌న్స్ ట్రేడింగ్ చార్జిల‌ను పెంచ‌డం ప్ర‌ధాన కార‌ణంగా భావిస్తున్నారు. స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను నియంత్రించాల‌నే ఉద్దేశంతో ఇప్ప‌టికే ఆయా చార్జిలను ప‌లు మార్లు పెంచారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ చార్జిల‌ను మ‌రోమారు పెంచుతున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ప్ర‌క‌టించారు. ఈ కార‌ణంగా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను పెంచిన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో ట్రేడ‌ర్లు, ఇన్వెస్ట‌ర్ల‌లో ఆందోళ‌న‌, ఒత్తిడి పెరిగి అది మార్కెట్ ప‌త‌నానికి కార‌ణం అయింది. ఫ్యూచ‌ర్స్ ట్రేడింగ్‌పై ఎస్‌టీటీని 150 శాతం పెంచ‌గా, ఆప్ష‌న్స్‌పై ఎస్‌టీటీని 50 శాతం పెంచిన‌ట్లు బడ్జెట్‌లో తెలిపారు. అయితే ఇది మార్కెట్‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపించింద‌ని క్లియర్ ట్యాక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో అర్చిత్ గుప్తా తెలిపారు.

నిఫ్టీ అన్ని సూచీల్లో తీవ్ర న‌ష్టాలు..

బ‌డ్జెట్ 2026 నేప‌థ్యంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100లో 1.38 శాతం త‌గ్గుద‌ల క‌నిపించ‌గా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100లో 1.96 శాతం త‌గ్గుదల చోటు చేసుకుంది. ఇక ఇండియా విక్స్ (భ‌య సూచీ) ఓ ద‌శ‌లో ఏకంగా 17 శాతం పెరుగుద‌ల న‌మోదు చేసింది. కాగా నిఫ్టీకి చెందిన అన్ని రంగాల సూచీలు కూడా తీవ్ర న‌ష్టాల్లో కొన‌సాగాయి. నిఫ్టీ ఆటో సూచీ 0.85 శాతం ప‌త‌నం అవ్వ‌గా, నిఫ్టీ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ 25/50 సూచీ 1.35 శాతం త‌గ్గుద‌ల న‌మోదు చేసింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీలో 1.75 శాతం త‌గ్గుద‌ల క‌నిపించింది. నిఫ్టీ ఐటీ 0.20 శాతం మేర ప‌త‌నం అయింది. నిఫ్టీ మీడియా 1.01 శాతం, నిఫ్టీ మెట‌ల్ 2.74 శాతం, నిఫ్టీ ఫార్మా 0.21 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 3.92, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 0.58 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.80, నిఫ్టీ క‌న్‌జ్యూమ‌ర్ డ్యూర‌బుల్స్ 0.45, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.57 శాతం త‌గ్గుద‌ల న‌మోదు చేశాయి. అయితే కేవలం నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ లో మాత్రమే 0.12 శాతం పెరుగుద‌ల చోటు చేసుకుంది.

6 ఏళ్ల‌లో ఇదే తొలిసారి..

కాగా గ‌త 6 ఏళ్ల కాలంలో జ‌రిగిన బడ్జెట్ స‌మావేశాల్లో బ‌డ్జెట్ రోజు ఇంత‌టి భారీ ఎత్తున మార్కెట్లు ప‌త‌నం కావ‌డం ఇదే తొలిసార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇంట్రా డే హై తో పోలిస్తే నిఫ్టీ ఓ ద‌శ‌లో ఏకంగా 867 పాయింట్లు ప‌త‌నం కాగా సెన్సెక్స్ 2800 పాయింట్ల మేర న‌ష్ట‌పోయింది. దీంతో మార్కెట్లో మ‌దుప‌ర్ల సంప‌ద రూ.11 ల‌క్ష‌ల కోట్లు ఆవిరైంది. బడ్జెట్‌లో పన్ను రాయితీలు లేకపోవడం, డెరివేటివ్స్ ట్రేడింగ్‌పై అదనపు భారం మోప‌డం కారణంగా మార్కెట్‌లో భారీ అమ్మకాలు చోటు చేసుకున్నాయని, అందుక‌నే మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురై ప‌త‌నం అయ్యాయ‌ని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement