త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | యుద్ధం కార‌ణంగా ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల‌కు గ‌డ్డు కాల‌మే.. అంత‌ర్జాతీయ బ్రోక‌రేజీల వెల్ల‌డి..

Stock Markets | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కారణంగా భారత స్టాక్ మార్కెట్ల‌పై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీలు తమ అంచనాలను తగ్గించాయి.

S

Business | Published On Apr 3, 2026, 1.26 pm IST

Stock Markets | యుద్ధం కార‌ణంగా ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల‌కు గ‌డ్డు కాల‌మే.. అంత‌ర్జాతీయ బ్రోక‌రేజీల వెల్ల‌డి..
Advertisement

Stock Markets | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కారణంగా భారత స్టాక్ మార్కెట్ల‌పై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీలు తమ అంచనాలను తగ్గించాయి. సిటీ రీసెర్చ్‌, నోమురా, గోల్డ్‌మ‌న్ సాక్స్‌, బ‌ర్నెస్టెయిన్ వంటి సంస్థలు నిఫ్టీ 50 లక్ష్యాలను తగ్గించాయి. అధిక చమురు ధరలు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధి, కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నిఫ్టీ 50 ఇప్పటికే 10 శాతం క‌న్నా ఎక్కువగా పతనమైంది. భారత్‌ దిగుమతి చేసుకునే ఇంధనంపై అధికంగా ఆధారపడడం ఈ పరిస్థితిలో ప్రధాన బలహీనతగా మారింది.

మ‌రో 5 శాతం మేర ప‌త‌న‌మ‌య్యే అవ‌కాశం..

సిటీ రీసెర్చ్ తన నిఫ్టీ టార్గెట్‌ను 28,500 నుంచి 27,000కు తగ్గించింది. అయినప్పటికీ ఈ స్థాయి నుంచి సుమారు 17 శాతం పెరుగుదల అవకాశముందని భావిస్తోంది. అలాగే వాల్యుయేషన్ మల్టిపుల్‌ను 20 నుంచి 19కి తగ్గించింది. నోమురా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 2026 డిసెంబర్ నాటికి నిఫ్టీ 24,900 స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ఇది గత అంచనాతో పోలిస్తే 15 శాతం తక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. చమురు ధరలు ఎక్కువ కాలం అధికంగా ఉంటే కంపెనీల లాభాలపై 10-5 శాతం వరకు ప్రభావం పడొచ్చని నోమురా హెచ్చరించింది. అయితే మార్కెట్ మరింతగా ప‌త‌న‌మైతే దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది మంచి కొనుగోలు అవకాశమవుతుందని పేర్కొంది. సమీప కాలంలో మరో 5 శాతం పతనం కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

నిఫ్టీ ల‌క్ష్యం 25,900 మాత్ర‌మేనా..?

గోల్డ్‌మన్ సాక్స్ భారత ఈక్విటీలను ఓవర్‌వెయిట్ నుంచి మార్కెట్‌వెయిట్ కు తగ్గించింది. నిఫ్టీ 12 నెలల లక్ష్యాన్ని 29,300-29,500 స్థాయి నుంచి 25,300-25,900కు తగ్గించింది. 2026లో కంపెనీల లాభాల వృద్ధి 8 శాతం వ‌ర‌కు, 2027లో 13 శాతం వ‌ర‌కు పరిమితం అవుతుందని అంచనా వేసింది. చమురు ధరలు మూడు నెలలపాటు బ్యారెల్‌కు 45 డాల‌ర్లు పెరిగితే మొత్తం లాభాల వృద్ధిపై 9 శాతం వరకు ప్రభావం పడొచ్చని తెలిపింది. బెర్న్‌స్టీన్ కూడా నిఫ్టీ లక్ష్యాన్ని 26,000కు తగ్గించింది. ద్రవ్యోల్బణం 6 శాతం దాటే అవకాశం ఉందని, వడ్డీ రేట్ల కోతలు ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపింది. 2026లో మార్కెట్ స్థిరంగా లేదా కొంత ప్రతికూలంగా ఉండొచ్చ‌ని, రూపాయి కూడా ఒత్తిడిలోనే ఉంటుంద‌ని పేర్కొంది. అత్యంత ప్రతికూల పరిస్థితిలో నిఫ్టీ 20,000 కంటే దిగువకు, 19,000 స్థాయికి కూడా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఆర్థిక వృద్ధి మందగించడం, లిక్విడిటీ తగ్గడం, మార్కెట్ విలువలు పడిపోవడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని తెలిపింది.

కాగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం భారత మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని బ్రోకరేజీలు భావిస్తున్నాయి. తక్షణ కాలంలో అస్థిరత కొనసాగినా, దీర్ఘకాల పెట్టుబడిదారులకు అవకాశాలు కూడా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement