త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో బ్యాడ్ ఫేజ్ ముగిసిన‌ట్లే..? 40 శాతం ర్యాలీకి సిద్ధ‌మ‌వండి..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్ల‌లో కీలక సూచిక అయిన నిఫ్టీ50 అరుదైన నాలుగు నెలల వరుస పతనాన్ని ముగించింది. చారిత్రక డేటా ప్రకారం ఇటువంటి పరిస్థితుల తర్వాత మార్కెట్లు బలమైన పునరుద్ధరణను నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

S

Business | Published On Apr 4, 2026, 11.44 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో బ్యాడ్ ఫేజ్ ముగిసిన‌ట్లే..? 40 శాతం ర్యాలీకి సిద్ధ‌మ‌వండి..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్ల‌లో కీలక సూచిక అయిన నిఫ్టీ50 అరుదైన నాలుగు నెలల వరుస పతనాన్ని ముగించింది. చారిత్రక డేటా ప్రకారం ఇటువంటి పరిస్థితుల తర్వాత మార్కెట్లు బలమైన పునరుద్ధరణను నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. డీఎస్పీ మ్యుచువల్ ఫండ్ డేటా ప్రకారం నిఫ్టీ చరిత్రలో నాలుగు నెలలు లేదా అంతకంటే ఎక్కువకాలం పతనం జరిగిన ఘటనలు కేవలం ఏడు సార్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ సందర్భాల్లో తర్వాతి ఏడాదిలో సగటున 40.7 శాతం రాబడులు నమోదయ్యాయి. మధ్యస్థ రాబడి (మీడియన్) 20.8 శాతంగా ఉన్నప్పటికీ దీన్ని కూడా గణనీయమైన లాభాల సూచికగానే భావించవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మూడు నెలల్లో సగటు రాబడి 12.2 శాతం, ఆరు నెలల్లో 22.4 శాతంగా ఉంది.

ఇలా ప‌త‌నం అవడం ఇప్ప‌టి వ‌ర‌కు 7 సార్లే..

ఈ పరిణామాల నేపథ్యంలో క్వాంట్ మ్యుచువ‌ల్ ఫండ్స్ తన తాజా నివేదికలో కోవిడ్ తర్వాతి కాలం నుంచి ఇదే అతిపెద్ద కొనుగోలు అవకాశంగా మారవచ్చ‌ని పేర్కొంది. పెట్టుబడిదారులను తమ పోర్ట్‌ఫోలియోలను పునర్‌వ్యవస్థీకరించాల‌ని సూచించింది. నిఫ్టీ చరిత్రలో 105 నెగెటివ్ స్ట్రీక్స్‌లో సగానికి పైగా కేవలం ఒక నెల మాత్రమే కొనసాగాయి. నాలుగు నెలలకంటే ఎక్కువకాలం కొనసాగినవి కేవలం ఏడు మాత్రమే. 1994 సెప్టెంబర్ నుంచి 1995 ఏప్రిల్ వరకు సాగిన ఎనిమిది నెలల పతనం అత్యంత దీర్ఘమైనది. తాజా పతనం సుమారు 14.8 శాతం వరకు నమోదవడంతో మార్కెట్ క్యాపిట్యులేషన్ దశను తాకిందని నిపుణులు భావిస్తున్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ ఏఎంసీకి చెందిన బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ మార్చి 31 నాటికి ఈక్విటీ వాటాను 61.9 శాతానికి పెంచింది. ఇది గత ఐదేళ్లలో అత్యధిక స్థాయి కావ‌డం విశేషం.

ప‌త‌నం ఎక్కువ‌గా ఉంటే త‌రువాత అంతే బ‌లంగా ర్యాలీ..

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ ఏఎంసీ ఈడీ, సీఐవో ఎస్. నరేన్ మాట్లాడుతూ విలువలు, భావోద్వేగ సూచికలు అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు దశలవారిగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచే సమయం వచ్చింద‌ని అన్నారు. డీఎస్పీ మ్యుచువల్ ఫండ్ డేటా ప్రకారం పతనం ఎంత ఎక్కువకాలం కొనసాగితే త‌రువాత‌ ర్యాలీ అంత బలంగా ఉండే అవకాశముంద‌ని తెలిపింది. ఒక నెల పతనం తర్వాత సగటు రాబడి 22.4 శాతం కాగా, నాలుగు నెలల పతనం తర్వాత ఇది 40.7 శాతానికి చేరింది. 1991 జనవరిలో ముగిసిన పతనం తర్వాత నిఫ్టీ 117.9 శాతం ర్యాలీ నమోదు చేసింది. 1998 ఆగస్టు ఘటనలో 65.6 శాతం లాభం వచ్చింది. 2025 ఫిబ్రవరిలో ముగిసిన ఇటీవలి ఘటనలో కూడా 13.8 శాతం రాబడి నమోదైంది. అయితే అన్ని సందర్భాల్లో ర్యాలీ వెంటనే ప్రారంభం కాలేదు. కొన్ని సందర్భాల్లో ప్రారంభంలో మందగించి తర్వాత వేగం పెరిగింది.

ఈక్విటీల‌లో వాటాల‌ను పెంచుతున్న మ్యుచువల్ ఫండ్స్ సంస్థ‌లు..

క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో క్యాపిట్యులేషన్ సంకేతాలు కనిపిస్తున్నాయ‌ని తెలిపింది. అంటే అత్యంత క‌నిష్ట‌ దశ ముగిసినట్లు సూచనగా భావించ‌వ‌చ్చు. ఈ దశలో అస్థిరత పెరుగుతుంది, పెట్టుబడిదారుల రిస్క్ ఆసక్తి తగ్గుతుంది. కానీ ఇదే సమయం అవకాశాలను ఉపయోగించుకోవడానికి అనుకూలం అని సంస్థ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ముఖ్యంగా నామినల్ జీడీపీ వృద్ధి చైనా కంటే రెట్టింపు వేగంతో కొనసాగుతుండటం భారత ఈక్విటీలను ప్రపంచ స్థాయిలో ఆకర్షణీయంగా మార్చ‌బోతోందని సంస్థ విశ్లేషించింది. క్వాంట్ ఫండ్ తన తాజా పోర్ట్‌ఫోలియోలో పెద్ద కంపెనీలపై దృష్టి సారిస్తూ కొన్ని మిడ్, స్మాల్ క్యాప్‌లలో కూడా పెట్టుబడులు పెంచింది. తయారీ రంగంలో అనిశ్చితి కారణంగా అండర్‌వెయిట్‌గా ఉన్నప్పటికీ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్, బ్యాంకులు, ఫార్మా, టెలికాం, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలపై ఆశావహ దృక్పథం కొనసాగిస్తోంది.

నిఫ్టీ నాలుగు నెలల పతనం ముగిసిన ఈ దశ చారిత్రకంగా బలమైన ర్యాలీకి సంకేతంగా కనిపిస్తోంది. 40 శాతం సగటు రాబడులు వస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ మార్కెట్‌లో బ్యాడ్ ఫేజ్ ముగిసిందన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో నిఫ్టీ మ‌రింత ప‌త‌నం అవుతుందా, ఇక్క‌డి నుంచి మ‌ళ్లీ పుంజుకుంటుందా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Advertisement
Advertisement