త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | రేపు స్టాక్ మార్కెట్ల‌లో బుల్ ర్యాలీ.. గ్లోబ‌ల్ స్థాయిలో పాజిటివ్ సంకేతాలు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం బలంగా పుంజుకునే సంకేతాలను చూపించాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగ‌ళ‌వారం దేశీయ మార్కెట్ల‌కు సెలవు ఉన్నప్పటికీ అంతర్జాతీయ సంకేతాలు, చమురు ధరల తగ్గుదల ప్రభావంతో విదేశీ నిఫ్టీ సూచీ GIFT Nifty 1 శాతానికి పైగా పెరిగింది.

S

Business | Published On Apr 14, 2026, 3.41 pm IST

Stock Markets | రేపు స్టాక్ మార్కెట్ల‌లో బుల్ ర్యాలీ.. గ్లోబ‌ల్ స్థాయిలో పాజిటివ్ సంకేతాలు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం బలంగా పుంజుకునే సంకేతాలను చూపించాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగ‌ళ‌వారం దేశీయ మార్కెట్ల‌కు సెలవు ఉన్నప్పటికీ అంతర్జాతీయ సంకేతాలు, చమురు ధరల తగ్గుదల ప్రభావంతో విదేశీ నిఫ్టీ సూచీ GIFT Nifty 1 శాతానికి పైగా పెరిగింది. అయితే తర్వాత కొంత లాభాలను కోల్పోయిన‌ప్ప‌టికీ క్రితం సెష‌న్‌తో పోలిస్తే సూచీ భారీగానే పెరిగి అక్కడే స్థిరంగా ఉంది. ప్ర‌స్తుతం GIFT Nifty 24,150 వద్ద ఉంది. గ‌త సెష‌న్ ముగింపుతో పోలిస్తే 105 పాయింట్లు (0.44 శాతం) పెరిగి స్థిరంగా ఉంది. దీని ఆధారంగా తదుపరి ట్రేడింగ్ సెషన్‌లో బుధ‌వారం దేశీయ సూచీ నిఫ్టీ50 బలంగా ప్రారంభమై మళ్లీ 24,000 స్థాయిని చేరుకునే అవకాశం ఉందని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ 24 గంట‌ల్లో నెగెటివ్ వార్త‌లు ఏమీ రాక‌పోతే బుధ‌వారం స్టాక్ మార్కెట్ల‌లో ర్యాలీ కొన‌సాగుతుంద‌ని అంటున్నారు.

భారీగా పైకి ఎగ‌బాకిన GIFT Nifty..

సోమ‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్ల‌తోపాటు దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు కూడా భారీగా ప‌త‌నం అయ్యాయి. సెన్సెక్స్ 700 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోగా, నిఫ్టీ 200 పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మైంది. గ‌త వారం చివ‌ర్లో పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ జ‌రిపిన శాంతి చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వ‌డంతోనే సోమ‌వారం సూచీలు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. అయితే ప్ర‌స్తుతం యుద్ధం ముగుస్తుంద‌ని సంకేతాలు వెలువ‌డ‌డంతోపాటు ఆసియా మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీ లాభాల్లో ఉండ‌డం, మ‌రోవైపు విదేశీ నిఫ్టీ సూచీ GIFT Nifty భారీగా పైకి ఎగ‌బాకి లాభాల్లో కొన‌సాగుతుండ‌డంతో బుధ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీ లాభాల‌ను న‌మోదు చేస్తాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

గ్లోబ‌ల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు..

మంగ‌ళ‌వారం గ్లోబ‌ల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వ‌చ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు 1.8 శాతం తగ్గి బ్యారెల్‌కు సుమారు 97 డాల‌ర్ల వద్దకు చేరడంతో భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ద్రవ్యోల్బణం, ఉత్పత్తి వ్యయాలపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గాయి. ఇక ఆసియా మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఆసియా-పసిఫిక్ విస్తృత సూచీ సుమారు 1 శాతం పెరిగింది. అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ సూచీలు 1 శాతానికి పైగా పెరిగాయి. మ‌ధ్య ప్రాచ్య‌ ఉద్రిక్తతలపై పరిష్కారం దొరికే అవకాశాలపై ఆశలు, అలాగే ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభం ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి.

ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై పెట్టుబ‌డిదారుల విశ్వాసం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. ఇటీవల చర్చలు విఫలమైనప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు కొనసాగవచ్చనే సంకేతాలు ఇచ్చారు. దీంతో మార్కెట్ ఆందోళనలు కొంతవరకు తగ్గాయి. భవిష్యత్ మార్కెట్ దిశను నిర్ణయించడంలో భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా చమురు ధరల మార్పులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement