త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | రూ.10 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. యుద్ధం కార‌ణంగా భారీగా పెరిగిన అమ్మ‌కాల ఒత్తిడి..

ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్ల‌లోనూ తీవ్ర‌మైన భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న‌తో అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యారు. విదేశీ స్టాక్ మార్కెట్లే కాకుండా భార‌తీయ సూచీలు కూడా భారీగా ప‌త‌నం అయ్యాయి.

S

Business | Published On Mar 4, 2026, 4.16 pm IST

Stock Markets | రూ.10 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి.. యుద్ధం కార‌ణంగా భారీగా పెరిగిన అమ్మ‌కాల ఒత్తిడి..
Advertisement
  • నిఫ్టీ50 385 పాయింట్లు ప‌త‌నం
  • 1122 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోయిన సెన్సెక్స్‌
  • నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం లాభాల్లో
  • టాటా స్టీల్ షేర్ల ధ‌ర‌లు భారీగా ప‌త‌నం
  • త‌గ్గుతున్న బంగారం, వెండి ధ‌ర‌లు

ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్ల‌లోనూ తీవ్ర‌మైన భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న‌తో అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యారు. విదేశీ స్టాక్ మార్కెట్లే కాకుండా భార‌తీయ సూచీలు కూడా భారీగా ప‌త‌నం అయ్యాయి. మొత్తం రూ.10 ల‌క్ష‌ల కోట్ల మ‌దుప‌ర్ల సంప‌ద ఆవిరైంది. బుధ‌వారం నిఫ్టీ50 1.55 శాతం మేర న‌ష్టపోయి 385.20 పాయింట్ల ప‌తనాన్ని చ‌విచూసింది. 24,480.50 వ‌ద్ద నిఫ్టీ50 ముగిసింది. అలాగే సెన్సెక్స్ 1122.66 (1.40 శాతం) పాయింట్ల మేర ప‌త‌నం అయింది. 79,116.19 వ‌ద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ50లో అన్ని సూచీలు న‌ష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ 1.81 శాతం మేర ప‌త‌నం అవ‌గా, నిఫ్టీ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ 1.97 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ 1.92, నిఫ్టీ స్మాల్ క్యాప్ (100) 2.11, నిఫ్టీ ఆటో 2.44, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.88, నిఫ్టీ మెటల్ 3.99, నిఫ్టీ ఫార్మా 1.24 శాతం మేర న‌ష్ట‌పోయాయి. అయితే కేవ‌లం నిఫ్టీ ఐటీ సూచీ మాత్ర‌మే పెరుగుద‌ల న‌మోదు చేసింది. ఆ ఇండెక్స్ 0.11 శాతం పెరిగింది.

భారీగా న‌ష్ట‌పోయిన టాటా స్టీల్‌..

నిఫ్టీ50 సూచీలో భార‌తీ ఎయిర్‌టెల్ షేర్ ధ‌ర 1.88 శాతం పెరిగి టాప్ గెయిన‌ర్‌గా నిలిచింది. త‌రువాతి స్థానంలో 1.85 శాతం పెరుగుద‌ల‌తో కోల్ ఇండియా రెండో స్థానంలో గెయిన‌ర్‌గా నిలిచింది. ఇన్ఫోసిస్ షేర్ ధ‌ర 1.33 శాతం పెర‌గ్గా, టెక్ మ‌హీంద్రా షేర్ ధ‌ర 0.15 శాతం పెరిగింది. ఈ నాలుగు స్టాక్స్ మాత్ర‌మే టాప్ గెయిన‌ర్ల జాబితాలో నిలిచాయి. అలాగే టాటా స్టీల్ ఏకంగా 7.08 శాతం న‌ష్ట‌పోయి టాప్ లూజ‌ర్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. త‌రువాత టాటామోటార్స్ ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ లిమిటెడ్ 5.29 శాతం న‌ష్ట‌పోగా, ఎస్‌బీఐ లైఫ్ 4.98, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్ 4.67 శాతం, ఎల్ అండ్ టీ 4.54 శాతం న‌ష్ట‌పోయి టాప్ లూజ‌ర్ల జాబితాలో నిలిచాయి.

తీవ్రంగా అమ్మ‌కాల ఒత్తిడి..

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మ‌ధ్య చోటు చేసుకుంటున్న యుద్ధ ప‌రిస్థితుల ప్ర‌భావం స్టాక్ మార్కెట్ల‌పై తీవ్రంగా ప‌డుతోంది. మార్కెట్లు తీవ్రంగా అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌వుతున్నాయి. మ‌రోవైపు చ‌మురు ధ‌ర‌లు పెరుగుతాయ‌న్న ఆందోళ‌న‌లు కూడా మార్కెట్ ప‌త‌నానికి కార‌ణం అయ్యాయి. ప్ర‌పంచ మార్కెట్ల ప్ర‌భావం కూడా దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది. భార‌త్ త‌న‌కు కావ‌ల్సిన ముడిచ‌మురులో దాదాపు 85 శాతం మొత్తాన్ని దిగుమ‌తుల ద్వారానే పొందుతోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో చ‌మురు సంక్షోభం త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని కూడా పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అయితే భార‌త్ వ‌ద్ద 8 వారాల‌కు స‌రిప‌డా చ‌మురు నిల్వ‌లు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే అధికారులు స్ప‌ష్టం చేశారు. దేశంలో చ‌మురు సంక్షోభం త‌లెత్తే అవ‌కాశం లేద‌ని అన్నారు. క‌మోడిటీస్ మార్కెట్‌లో ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు 74 డాల‌ర్లుగా ఉంది. అలాగే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు 81 డాల‌ర్లుగా ఉంది.

త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు..

ఇక యుద్ధం కార‌ణంగా స్టాక్ మార్కెట్ల‌పై ఒత్తిడి ఉన్నా బంగారం, వెండి ధ‌ర‌లు మాత్రం త‌గ్గుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.31,100 మేర త‌గ్గింది. 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.28,500 వ‌ర‌కు త‌గ్గింది. ఇక హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.16,451 ఉండ‌గా, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,080గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,338గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.1,64,510 ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,50,800, 18 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,23,380గా ఉంది. ఇక వెండి ధ‌రల విష‌యానికి వ‌స్తే 10 గ్రాముల వెండి ధ‌ర రూ.2,850 ఉండ‌గా, 1 కిలో వెండి ధ‌ర రూ.2,85,000గా ఉంది.

Advertisement
Advertisement